భజగోవిందం ---ఆది శంకరాచార్య


భజగోవిందం ---ఆది శంకరాచార్య
భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృణ్  కరణే .
                                                           భజగోవిందం భజగోవిందం  
తాత్పర్యము:    గోవిదాం పతిః గోవింద. ఇంద్రియములకు భర్త మనస్సు.
మూఢమతీ, మనస్సును స్థిరము చెయ్యి. ఆ స్థిరమనస్సును ప్రార్థించు అస్థిరము కాకూడదని. వ్యాకరణము బట్టీ పెట్టినందువలన లాభము లేదు. అవసానకాలములో ఆ స్థిరమనస్సు మాత్రమె అన్ని భయములనుండి నిన్ను కాపాడగలదు.
1)  శ్రవణం (భగవంతుని శబ్దమును అనగా ఓం శబ్దమును వినుట), 2) కీర్తనం (ఆ ఓం శబ్దమును తిరిగి తిరిగి కూటస్థములో ఉచ్ఛారణ చేయుట), 3)  స్మరణం (ఆ ఓం శబ్దముపై మళ్ళీ మళ్ళీ  ఆలోచన చేయుట), 4) పాదసేవనం (పాదము నుండి అనగా మూలాధారము నుండి సహస్రారము వరకు చక్రములన్నిటిలోను సేవించుట అనగా దానిలో విలీనమగుట), 5) అర్చనం (బీజమంత్రములతో చక్రములన్నిటిలోను ఉచ్ఛారణ చేయుట), 6) వందనం (ఆ ఓం శబ్దములో విలీనమగుట),7) దాశ్యం (ఆ ఓం శబ్దము వినుటకు సాధన చేయుట), 8) సఖ్యం (ఆ ఓం శబ్దమునకే అంటిపెట్టుకొని ఉండుట), మరియు 9) ఆత్మనివేదనమ్(ఆత్మను అనగా సాధకుడు తనను తానుఆ ఓం శబ్దమునకు అర్పించుకొనుట). అప్పుడు మానవసేవయే మాధవసేవ. అని ఖచ్చితముగా తెలుసుకుంటాడు.  
శ్లోక 2)
మూఢ జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం  మనస వితృష్ణాం
యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం -- భజగోవిందం భజగోవిందం
, మూర్ఖుడా,  ధనార్జన తృష్ణను విడిచిపెట్టు. మనసులో ఆశలు పెంచుకోకు.  మంచి ఆలోచనలు కలిగిఉండు. నీ భూతకాలములోని కర్మలనుబట్టి ధనమును సంపాదించగలుగుతావు.  దానితో సుఖముగా ఉండు.
శ్లోక 3)
నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం
ఏతన్మాంసావసాది వికారం మనసి విచంతయ వారం వారం -- భజగోవిందం భజగోవిందం
స్త్రీల వక్ష సౌందర్యము, తదుపరి నాభీ ప్రదేశమును చూచి మోహావేశము చెందవచ్చు.  కొవ్వు, మాంస పదార్ధములతో కూడి వికరాము పుట్టించును. నీ మనస్సులో మళ్ళీ మళ్ళీ వీటిగురించి విచారణ చేస్తూ ఉండు. 
శ్లోక 4:
నళినీ దలగత జలమతి తరళం  తద్వాత్జీవిత మతిశయచపలం
విద్ధివ్యాద్యభిమాన గ్రస్తం లోకం శోకం హతం చ సమస్తం
తామరాకు మీద నీటిబొట్టు ఎంతో చంచలమయినది.  ఈ మానవ జీవితం కూడా అంతే అస్థిరమయినది. ఈ ప్రపంచము రోగము, మోసముతోను కూడుకొని దుఃఖ పూరితమయి యున్నది.    
శ్లోక 5:
యావద్విత్తోపార్జనసక్తః తావన్నిజపరివారో రక్తః
పశ్చాత్ జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే
ఎంతవరకు ధనము సంపాదించగలడో అంతవరకు వారి పరివారము ప్రేమగా ఉంటారు. దేహము సడలిపోయి శక్తి విహీనులగుదురో అప్పుడు వాడిగురించి ఒక్కడుకూడా పట్టించుకోడు.
శ్లోక 6:
యావత్పవనో  నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహేపాయే భార్యా భిభ్యతి తస్మిన్ కాయే
ఎంతవరకయితే ఈ శరీరములో ప్రాణశక్తియుండునో, అంతవరకూ బంధుపరివారము కుశల ప్రశ్నలు వేయుదురు. ఈ దేహమునకు ఏదయినా అపాయము కలిగి ప్రాణము పోయినచో భార్యకూడా అట్టి శరీరమును చూచి భయపడును. 
శ్లోక 7:
బాలాస్తావతి క్రీడాసక్తః తరుణీ స్తావత్తరుణీసక్తః
వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణీ కోపి న సక్తః 
బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాతలమీద ఆసక్తి కలిగి ఉంటాడు. యౌవనదశ లో స్త్రీల మీద ఆసక్తి కలిగి ఉంటాడు. వృద్ధాప్యములో చింతలతో సతమతము అవుతూ ఉంటాడు. పరమాత్మయండు ఆసక్తిని చూపేవారు ఎవరూ లేరు కదా.
శ్లోక 8:
కా తే కాంతా కస్తే పుత్రః సంసారో యమతీవ విచిత్రః
కస్య త్వం కః కుత ఆయాతః తత్వం చింతయ తద్విహ భ్రాతః
ఎవరు నీకు భార్య? ఎవరు నీకు కొడుకు? ఈ సంసారము చాలా విచిత్రమయినది.  నీవు ఎవరు? ఎక్కడనుంచి వచ్చావు? ఓ సోదరా, దానిని నీవు ఇక్కడే విచారము చెయ్యి.
శ్లోక 9:
సత్ సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ ముక్తిః
సత్ పురుష సాంగత్యము ప్రాపంచిక విషయములమీద సంగభావము తొలగించును. ఆ నిస్సంగత్వభావము సంసారము పై మోహము భ్రమ తొలగిస్తుంది. ఆ తొలగిన  భ్రమ వలన ఏర్పడిన నిశ్చలతత్వము జీవించి ఉండగానే ముక్తి లభ్యము చేస్తుంది.
శ్లోక 10:
వయసి గతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః
క్షీణే విత్తం కః పరివారః జ్ఞాత్వే తత్వే కః సంసారః 
నీరు ఇంకిపోయిన తదుపరి సరస్సు ఉండదు. అదేవిధముగా వయసు మళ్ళిపోతే కామవికారములు ఉండవు.  ధనము లేనియడల పరిచారకులు ఉండరు. అజ్ఞానము తొలగిపోయిన శుద్ధ జ్ఞానము కూడిన తత్వజ్ఞానికి ఈ జనన మరణరూప సంసారము ఉండదు.
శ్లోక 11
మా కురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వః  
మాయా మాయ మిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వాం ప్రవిశ విదిత్వా
ధనము, అనుచరగణము, యౌవనము ఉన్నదని గర్వము చెందకు. ఈ మొత్తము అచిరకాలములో హరించుకు పోతుంది. ఈ ప్రపంచము మాయా మోహము అనగా భ్రమతో కూడియున్నదని తెలుసుకో.  తెలుసుకొని ఆ బ్రహ్మపదములోనికి ప్రవేశించు.
శ్లోక 12
దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ  పునరాయాతః
కాలః క్రీడతి గచ్చత్యాహుః తదపి న ముంచతి ఆశావాయుః
రాత్రింబవళ్ళు, ఉదయము సాయంత్రము, శిశిర వసంతములు , మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాలము అలా ఆడుకుంటూ ఉంటుంది. చివరికి ఆయుష్కాలముకూడా వస్తుంది. అయినప్పటికీ మనిషి ఆశ అనే వాయువును అంటిపెట్టుకునే ఉంటాడు.
శ్లోక 13
కాతే కాంతా ధనగత చింతా వాతుల కిం నాస్తి నియంతా
త్రిజగతి సజ్జన సంగతిరేకా భవతి భవార్ణవ తరణే
ఎందుకు నీ భార్య, ధనసంబంధ విషయములమీద ఇంత ఆసక్తి? అందరినీ నియమించే సర్వజ్ఞుడయిన ప్రభువు లేడనుకున్నావా? ఈ మూడు లోకములలోనూ, చావు పుట్టుక అనే భవ సాగరమును దాటుటకు సజ్జన సాంగత్యమే సరి అయిన నౌక.
ద్వాదశ మంజరికాభిరాశేషః కథితో వైయాకరణ స్యైషః
ఊపదెశొ భూద్విద్యా నిపుణైః శ్రీమచ్చంకర భగవచ్చరణైః
ఈ పై పన్నెండు శ్లోకములు అనగా 2 నుండి 13 వరకు ఉన్న పన్నెండు శ్లోకములు శ్రీ ఆదిశంకరాచార్యులు ఒక వ్యాకరణ కర్తకి ఉపదేశముగా బోధించారు.
ఒక వయసు మళ్ళిన పెద్దాయన వ్యాకరణము బట్టే పెడుతున్నాడు. పూర్వము రాజులను తన విద్యా విజ్ఞానములతో మెప్పిస్తే దానికి ప్రతిగా పండితులు అగ్రహారములు లేదా తగు బహుమానములు పొందేవారు. అందుకై కృషి చేస్తున్న ఒక వృద్ధుడిని చూసి జాలిపడి ఈ ఉపదేశము చేశారు.
శ్లోక 14: (తోటకాచార్య కృత)
జటిలోముండీ లుంచితకేశః కాషాయాంబర బహుకృత వేషః
పశ్యన్నపిచ న పశ్యతి మూఢః హ్యుదరనిమిత్తం బహుకృతవేషః 
జడలు కట్టుకొని ఒకడు, గుండుగీకించుకొని ఒకడు, జుట్టు ఒక్కొక్కటి పీకేసుకొని ఒకడు, కాషాయవస్త్రములు ధరించి ఒకడు, రకరకాల వేషాలు వేస్తుంటారు. ఈ వేషములన్నియు ఉదరనిమిత్తము అనగా పొట్ట కూటి కోసమే. కళ్ళతో చూస్తూ కూడా సత్యము గ్రహించలేని మూర్ఖులు వీరు.  
శ్లోక 15: (హస్తమలక కృత)
అంగం గలితం పలితం ముండం దశనవిహీనం జాతం తుండం
వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచతి ఆశాపిండం
శరీరము క్రుంగి కృశించి పోయినది. తల నేరసిపోయినది. నోటిలో పళ్ళు ఊదిపోయినవి. ముసలితనముతో కఱ్ఱ చేతికి వచ్చినది. అయినప్పటికీ కోరికలమూట మాత్రము వదలిపెట్టదు.
శ్లోక 16: (సుబోధ కృత)
అగ్రే వహ్నిః పృష్టే భానుః రాత్రౌ చుబుక సమర్పితజానుః
కరతలభిక్ష స్తరుతలవాసః తదపి నముంచతి ఆశాపసః 
ఎదురుగా చలిమంట వేసికుంటాడు, వీపు మీద సూర్యకిరణములు పడేలా కూర్చుంటాడు. రాత్రిళ్ళు మోకాళ్ళకి గడ్డం ఆనించుకొని కూర్చుంటాడు. తన అరచేతులు దొప్పలుగా చేసికొని తింటాడు. చెట్టునీడన పడియుంటాడు. అయినప్పటికీ ఆశలు మాత్రము వదలడు.
శ్లోక 17: (సురేశ్వరాచార్య  కృత)
కురుతే గంగా సాగరగమనం వ్రత పరిపాలన మథవా దానం
జ్ఞానవిహీనః సర్వమతేన ముక్తిం న భజతి జన్మ శతేన
తీర్థయాత్రలు చేస్తాడు.  గంగ సాగరములో కలిసే చోటుకి వెళ్తాడు. పూజలు నోములు వ్రతములు దానధర్మములు చేస్తాడు. కాని ఎన్ని జన్మలెత్తినా ఆత్మ జ్ఞానము పొందని జ్ఞాన విహీనుడు ముక్తిని పొందలేదు. ఇదియే సర్వమతజ్ఞానము, బ్రహ్మ జ్ఞానము.  
శ్లోక 18: (నిత్యానంద కృత)
సురమందిర తరు మూల నివాసః శయ్యా భూతలమజినం వాసః
సర్వపరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః 
ఆలయ మందిరములలో నివసిస్తాడు, చెట్ల మొదళ్లలో నివసిస్తాడు, కటికనేలమీద నిద్రిస్తాడు. చర్మమును వస్త్రముగా ధరిస్తాడు. దేనినీ అనగా భోగమును స్వీకరించడు. అన్ని భోగములను విడిచిన అట్టి త్యాగికి సుఖము లభించదా? తప్పక లభించును.  
శ్లోక 19: (ఆనందగిరి కృత)
యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః
యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ 
వాడు యోగిగా జీవించవచ్చు. భోగిగా జీవించవచ్చు.  అందరితోను కలిసి మెలిసి జీవించవచ్చు. లేదా ఒంటరిగా అందరికీ దూరముగా జీవించవచ్చు.  కాని ఎవడయితే తన మనస్సును దృష్టిని బ్రహ్మమునందే నిలిపి జీవిస్తాడో వాడే ఆనందిస్తాడు. ఆనందిస్తాడు. ఇది  ముమ్మాటికీ సత్యము.  
శ్లోక 20: (ధృఢభక్త కృత)
భగవద్గీతా కించిదధీత గంగా జలలవ కణికా పీత్వా
సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్య యమేవ న చర్చ
భ = భక్తి,  గ = జ్ఞాన,  వ =వైరాగ్య అనగా వైవిధ్యమయిన రాగ్యము అనగా మోహము, త= తత్ (అది) త్వం(నీవు) అసి(అయిఉన్నావు)  అనే తత్వ జ్ఞానము.
భగవద్గీత కొంచెమయినను అధ్యయనము చేసినవారు,  గంగా జలము అనగా శుద్ధ జ్ఞాన జలము కొంచేమయినను త్రాగినవారు, స్వల్పమయినను కూటస్థములో ఆ ఓం శబ్దములో విలీనమయినవారు, అట్టివారిని యముడు అనగా చావు బాధించదు(డు).
శ్లోక 21: (నిత్యనాథ కృత)
పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే
మళ్ళీ మళ్ళీ జన్మించడం, మళ్ళీ మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భములో పడిఉండడంఈ నిత్యమయిన జనన మరణ  సంసార చక్రమునుండి బయట పడటం అసాధ్యము. ఓ పరమాత్మా, మమ్ములను దయచేసి రక్షించు.
శ్లోక 22: (నిత్యనాథ కృత)
రథ్యా చర్పట విరచిత కంథః పుణ్యాపుణ్య వివర్జిత పంథః  
యోగీ యోగ నియూజిత చిత్తో రమతే బాలోన్మత్తవదేవ
దారిలో దొరికిన గుడ్డపీలికలను బొంతగా చేసికొని కప్పుకున్న వాడై,  పుణ్యా అపుణ్యములను  వర్జించనివాడై, నిరంతరమూ యోగామునందే మనస్సును దృష్టిని నిలిపిన యోగి పుంగవుడు బాలునిమాదిరి పిచ్చివానిలాగా తన ఆనందములో తనలో తాను రమిస్తూ ఉంటాడు.
శ్లోక 23: (సురేంద్ర కృత)
కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కో మే తాతః
ఇతి పరభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం
నీవు ఎవరు? నేనెవరు? నేను ఎక్కడినుండి వచ్చాను? నా తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు? ఈ విధముగా విచారణ చెయ్యి. ఈ ప్రపంచం సార విహీన మయినది. ఈ ప్రపంచము ఒక స్వప్నము లాంటిది అని విడిచిపెట్టు.  
శ్లోక 24: (మేథాతితిర  కృత)
త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణుః
భవ సమచిత్తః సర్వత్ర త్వం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం 
నీలోను నాలోనూ ఉన్నది ఏకమయిన విశ్వా వ్యాపక చైతన్యమే. నీలో సహిష్ణుత లేదు కనక వ్యర్థముగా నాపై కోపగించు కుంటున్నావు. అంతటా అన్నివేళలా సమ బుద్ధిని కలిగి యుండు. నీ చిరకాల వాంఛ అయిన  బ్రహ్మత్వమును తప్పక పొందుతావు.
శ్లోక 25: (మేథాతితిర  కృత)
శత్రౌమిత్రే పుత్రే బంధౌ మాకురు యత్నం విగ్రహ సంధౌ
సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ భేదా జ్ఞానం
 శతృవు, మితృడు, పుతృడు, బంధువు వీరిపట్ల శతృత్వమో లేక మితృత్వమో చేసే ప్రయత్నము వదిలిపెట్టు. అందరిలోనూ ఉన్నది ఆత్మే అని గ్రహించి భేదభావాని అన్ని సందర్భములలోను విడిచిపెట్టు.
శ్లోక 26: (భారతి వంశ కృత)
కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం భావయ కోహం
ఆత్మ జ్ఞాన విహీనా మూఢాః తే పచ్యంతే నరక నిగూఢః
కామము (కోరిక), లోభము, క్రోధము, మొహం, అన్నితిటినీ విడిచిపెట్టు.  ఆ పరమాత్మ నేనే అని గ్రహిస్తావు.  ఆత్మజ్ఞాన విహీనులు ఈ జనన మరణ సంసార చక్రము అనే నరకములోబడి హిన్సించబడుతారు.
శ్లోక 27: (శ్రీ సుమిత్ర  కృత)
గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం
నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం
భగవద్గీత విష్ణు సహస్ర నామములు గానం చేయాలి. ఎల్లప్పుడూ పరమాత్మ రూపమయిన ఓంకారమును ధ్యానించాలి. సజ్జనసాంగత్యములో మనస్సును నిలపాలి. దీనజనులకు ధన సహాయము అనగా దానము చేయాలి.  
శ్లోక 28:
సుఖతః క్రియతే రామాభోగః పశ్చాత్ హంత శరీరే రోగః
యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం
సుఖమును పొందుటకు స్త్రీ పురుషులు రతి కార్యక్రమములో నిమగ్న మవుతారు.
దానికి ఫలితము శరీరము రోగముల పాలగుతుంది. ఆఖరికి మరణము తప్పదు. అయినప్పటికీ పాప కార్యములను మానవుడు చేయకుండా వదలడు.
శ్లోక 29:
అర్థమనర్థం భావయ నిత్యం నాస్తే తతః సుఖలేశః సత్యం
పుత్రాదపి ధన భాజాం భేతిః సర్వత్రైషా విహితా రీతిః
ధనము దుఃఖ హేతువని గుర్తుపెట్టుకో.  దానివలన కొంచెము కూడా సుఖము లేదు అనేది సత్యము. ధనవంతునికి తన పుత్రుడు వలన కూడా భయమే. అన్ని చోట్ల ధనము పధ్ధతి ఇంతే.
శ్లోక 30:
ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేకవిచారం
జాప్యసమేత సమాధి విధానం కురు అవధానం మహదవధానం
శ్వాస నియంత్రణ (ప్రాణాయామము)చేయటము, ఇంద్రియ ఉపసంహరణ (ప్రత్యాహారం), నిత్యవస్తువేది అనిత్యవస్తువేది అని నిరంతరం బుద్ధితో విచారించడం, జపముతో కూడుకున్న ధ్యాన నిష్ఠను సాగించి సర్వ సంకల్పములను విడిచి పెట్టడం అనే సాధనలను జాగ్రత్తగా అనుష్ఠించు.
శ్లోక 31
గురుచరణాంభుజ నిర్భరభక్తః సంసారాదచిరార్భవ ముక్త:
సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం 
గురుచరణ కమలములనే సర్వస్వముగా భావించిన ఓ భక్తుడా, నీ ఇంద్రియముల ను, మనస్సును నిగ్రహించు. ఈ చావు పుట్టుకలతో కూడిన సంసార సాగరం నుండి ముక్తుడవవ్వు. నీ హృదయములో నిలవైయున్న పరమాత్మ సాక్షాత్కారము పొందు.
శ్లోక 32:
మూఢః కశ్చన వైయాకరణో డుకృన్కరణాధ్యయన దురిణః
శ్రీ మత్ శంకర భగవత్ శిష్యై బోధిత ఆసిచ్చోధితకరణః
వ్యాకరణ నియమాలను పఠిస్తూ తనను తాను కోల్పోయి మూఢుడయిన ముసలి బ్రాహ్మణుడు శ్రీ మత్ శంకర భగవత్ పాదుల వారి బోధనలతో వాస్తవము తెలిసికున్నాడు.  
శ్లోక 33:

భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే
నామస్మరణాత్ అన్యముపాయం నహి పశ్యామో భవతరణే 
భజించు గోవిందుని! భజించు గోవిందుని! ఓ మూఢుడా  గోవిందుడినే భజించు. సంసార సాగరాన్ని దాటడానికి గోవింద నామస్మరణకి మించినది లేదు.


||
ఇతి భజగోవిందం సంపూర్ణం ||

 






Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana