వాల్మీకి రామాయణము introduction



వాల్మీకి రామాయణము
రామశబ్దము
రా శబ్దో విశ్వవచనో మశ్చాపీశ్వర వాచకః      రా = ప్రపంచము,  మ= ఈశ్వరుడు.
ర = పరమాత్మ     ఆ = ప్రకృతి     మ = జీవుడు.
ర కారము అగ్నిబీజము, పాపవినాషిని.
ఆ కారము సూర్యబీజము, అజ్ఞానము అను చీకటిని పోగొట్టును.
మ కారము  చంద్ర బీజము, ఆనందము శాంతి కలుగజేయును.
ఓంకారమునకు రామనామమునకు బేదము లేదు. రెండింటికీ తారకము అని పేరు.
రకారేణ నిజం భక్తం భవాబ్దేః పరిరక్షతి
ఆ కారేణాతి సౌఖ్యం హాయ్ స్వభక్తస్య కరోతి యత్
మనోరథాన్మకారేణ దదాతి స్వజనస్య యత్ 
కారము భక్తులను సంసారసముద్రమునుండి రక్షించును. కారము భక్తులకు సౌఖ్యమునిచ్చును. కారము భక్తుల మనోరథములను తీర్చును. 
రమయతి ఇతి రామః   ఆనందింపజేయువాడు రాముడు.

వాల్మీకి రామాయణము
వాల్మీకి రచియించిన రామాయణ ఇతిహాసము 24 వేల శ్లోకములతో కూడియున్న మహాగ్రంథము.  ఎన్నో సద్బోధలు, ధర్మములు, నీతివచనములు, మరియు జ్ఞానము  వగైరా ఈ ఉద్గ్రంథములో ఉటంకించబడినవి. ఇన్ని వేలశ్లోకములలో కొన్ని ముఖ్యమయిన శ్లోకములను తీసికొని వాటికి ప్రకటనార్థము కాకుండా యోగార్థము తెలియబరిచబడినది.
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం
కవిత్వము అను కొమ్మమీదనెక్కి రామ రామఅనే మధురమయిన అక్షరములను గానముచేయు వాల్మీకి మహర్షి అను కోకిలకు నమస్కారము.  
వేదమువలె రామాయణము జనులకు పూజ్యము, మరియు మార్గ దర్శకముగాను అలరారుచున్నది.
రామో విగ్రహవాన్ ధర్మః.  మూర్తీభవించిన ధర్మమే రాముడు. ప్రతి ఇంటను రాముని పటములే. ప్రతి ఊరియందునూ రామసప్తాహములే, సీతారామ కల్యాణములే. రామనామము మన నిత్య జీవితముతో ముడిపడియున్నది.
రామాయణము ఆధ్యాత్మిక వాఙ్మయమునందు ప్రముఖమయినది.  ఇది ధర్మశాస్త్రము.  ఒక కుటుంబమునందు సభ్యులు ఎటుల మెలగవలయునో,  పరస్పరము ఎటుల ఆదరించుకొనవలయునో,  సంఘమునందు ఎటుల ప్రవర్తించవలయునో రామాయణము లో తేటతెల్లము చేస్తుంది. శీలసాధనలో, ధర్మప్రవర్తనలో, నిత్యవ్యవహారములో, దైనందిన కార్యక్రమములలో, జనులు వారివారి ప్రవర్తనను చక్కదిద్దుకొనుటలో  రామాయణము ఆదర్శప్రాయము.
మహాతపస్వియగు వాల్మీకి తన సాధనద్వారా శుద్ధజ్ఞానమును పొంది ఈ రామాయణమును రచియించెను.  మన శరీరములోని సకారాత్మక శక్తులకు మరియు నకారాత్మక శక్తులకు నిత్యమూ సంఘర్షణ  జరుచూ ఉండును.  సకారాత్మక శక్తులను దేవతలు అని,  మరియు నకారాత్మక శక్తులను రాక్షసులు అని పిలుచుకొనుట పరిపాటి. సదా పరమాత్మవయిపు ఆకర్షితమగు శుద్ధ ఆత్మ (శ్రీరాముడు)కు, అధర్మము, ఇంద్రియలోలత్వమునకు ఆటపట్టు అయిన అహంకారము (రావణాసురునికి)నకు జరిగిన తీవ్ర పోరు (క్రియాయోగా సాధన) లో అధర్మము వీగిపోయి ధర్మమునకు విజయము వరించుట అతి సుందరముగా చిత్రీకరించబడినది.
ప్రతి మనిషికి మోక్షకాంక్ష తప్పక ఉండును.  శుద్ధచిత్తము, శుద్ధ మనస్సు, శుద్ధ ఆత్మామూడు ఒక్కటే. అద్దము మలినముగానున్న ముఖము కనపడదు. అదేవిధముగా ఈ శుద్ధచిత్తము, శుద్ధ మనస్సు, మరియు శుద్ధ ఆత్మా అవసరము. నిరతిశాయానంద స్థితికి చేరు మానవుడు చిత్తశుద్ధిని ఇంద్రియనిగ్రహమును ధర్మాచరణము మరియు సత్ప్రవర్తనను తప్పక కలిగి ఉండవలయును. 
దేశ సౌభాగ్యమునకు వ్యక్తి బాగు అవసరము.   ఒక అగర్ బత్తి వెలిగించినచో ఆ సుగంధము ఇంకొకడికి చేరగూడదని తలుపులు బిగించుకొని కూర్చున్నను చుట్టు ప్రక్కలవారు ఆ సుగంధమును తప్పక అనుభవించెదరు.   అదే విధముగా వ్యక్తి బాగుపడితే సంఘము, మరియు దేశము తప్పక బాగుపడును.
జన్తూనాం నరజన్మ దుర్లభం. మనిషి జన్మము చాలా దుర్లభమయినది.  ఓడ చిల్లి పడకమునుపే తీరముచేరుత ఎంత అవసరమో, ఈ మానవ జీవితమూ భగ్నము కాకా పూర్వమే భవసాగరము దాటి పరమాత్మను చేరవలయును.
శ్రీరాముడు రావణవధచేసిన తదుపరి అయోధ్య చేరి అశ్వమేధ యాగమును చేసెను. ఇక్కడ శ్రీరాముడు అనేది పరమాత్మ స్థితి,   రావణవధ అనగా అహంకారమును సమూలముగా కూకటివ్రేళ్ళతో పెకలించివేయుట, అశ్వ మేధము అనగా ఇంద్రియములను మధించుట.
రామాయణ స్వరూపము:
రామాయణ గ్రంథము తపః స్వాధ్యాయ నిరతం అనే శ్లోకముతో ప్రారంభమగును.  అనగా గాయత్రీమంత్రముయొక్క కారాక్షరముతో ప్రారంభమగును. అట్లా ప్రతి వెయ్యి అక్షరములకు ఒకసారి చొప్పున 24 పర్యాయములు ప్రత్యక్షమగుచుండును. ఇక్కడ గణనించవలసిన విషయము ఏమిటంటే గాయత్రీమంత్రములో మొత్తము 24 అక్షరములు గలవు.
చతుర్వింశతి సహస్రాణి శ్లోకానాం ఉక్తవాన్ ఋషిః
తథా శతాన్పంచ షట్ కాండాని తథోత్తరం
రామాయణమునందు 24 వేల శ్లోకములు ఉన్నవి.   500 సర్గలు ఉన్నవి.  ఏడు కండలు ఉన్నవి. అవి: 1)బాలకాండ,  2) అయోధ్యాకాండ, 3) అరణ్యకాండ,  4) కిష్కింధాకాండ, 5) సుందరా కాండ, 6) యుద్ధకాండ, మరియు 7) ఉత్తరాకాండ.

రామాయణము క్లుప్తముగా:
కోసలదేశమునకు రాజు దశరథుడు. వారికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య కౌసల్య, రెండవభార్య కైకేయి, మూడవభార్య సుమిత్ర. వారికి చాలాకాలము వరకు సంతానము కలుగలేదు.  వారి గురువు వశిష్టుడు. గురువు సలహామేరకు పుత్రకామేష్టి యాగమును చేసెను. తత్ ఫలితముగా నలుగురు పుత్రులు కలిగురి.
మొదటి భార్య కౌసల్యకు శ్రీరాముడు, రెండవభార్య కైకేయికి భరతుడు, మూడవభార్య సుమిత్రకి లక్ష్మణ, శత్రుఘ్నులు అని ఇద్దరు పుత్రులు కలిగిరి.  ఒక రోజున విశ్వామిత్ర మహర్షి దశరథుని ఆస్థానమునకు వచ్చెను. ఆయన ఒక యాగము చేయ తలచెను.  కాని దుష్టశక్తులు ఆ యాగమును భగ్నము చేయుచుండిరి. యాగాసంరక్షనార్థము శ్రీరాముని పంపమని కోరెను.  గురువు వశిష్టుని సలహా మేరకు శ్రీరాముని విశ్వామిత్ర మహర్షి వెంట పంపుటకు సమ్మతించెను.  అగ్రజుడు శ్రీరాముని అనుసరించి అనుజుడు లక్ష్మణుడు కూడా వెంటవెళ్ళెను.
మార్గమధ్యములో తాటకిఅను రాక్షసిని శ్రీరాముడు సంహరించెను. విశ్వామిత్రుడు సంతోషించి వివిధములయిన అస్త్ర శాస్త్రములను ఒసంగెను. యాగమును ద్వంసము చేయుటకు వచ్చిన మారీచుడుఅనే రాక్షసును మీద మానవాస్త్రమును ప్రయోగించెను. అతడు నూరు యోజనములదూరము విసిరివేయబడుతాడు. ఆ   తరువాత వచ్చిన సుబాహువు అనే రాక్షసుని ఆగ్నేయాస్త్రముచే సంహరించెను.
అటుపిమ్మట శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్రునివెంట మిథిలాపట్టణమునకు వెళ్తారు. మార్గమధ్యములో గౌతముని భార్య అహల్య శాపగ్రస్తము చెంది రాయిగా పడిఉంటుంది.  శ్రీరాముని పాదము శోకి అనగా తగిలి ఆ రాయి తిరిగి  నాతి అనగా స్త్రీ గా మారుతుంది.
అక్కడినుండి విశ్వామిత్రుడు, శ్రీరాముడు, లక్ష్మణుడు ఆ ముగ్గురు కలిసి మిథిలా నగరమునకు వెళ్తారు.  శివధనుస్సును విరిచినవారికితన కూతురు జానకిని ఇచ్చి వివాహము చేస్తానంటాడు జనక మహారాజు.  శివధనస్సునును విరిచి సీతమ్మను వివాహమాడతాడు శ్రీరామచంద్రుడు. అంతేకాదు, భరతుడు మాండవిని, లక్ష్మణుడు ఊర్మిళను, మరియు శత్రుఘ్నుడు శ్రుతకీర్తిని వివాహమాడతారు.
శ్రీరామచంద్రుడు, భరతుడు, లక్ష్మణుడు,  శత్రుఘ్నుడు వారివారి భార్యలతో, మరియు విశ్వామిత్ర మహర్షితో అయోధ్యకి తిరిగి రాదొడగిరి.  త్రోవలో పరశురాముడు ఎదురయ్యెను. తన శక్తిని శ్రీరామునికి ఇచ్చుటకై తన ధనస్సును ఎత్తమని సవాలు చేసెను. ఆ పరశురామ ధనుస్సును ఎత్తి ఆయన శక్తిని  ఆ ధనుస్సు ద్వారా తీసుకొనెను.
దశరథుడు తన జ్యేష్ఠపుత్రుడు శ్రీరామునికి పట్టాభిషేకము చేయ నిశ్చయించెను.   కైకేయి యొక్క దాసి మంథర. మంథర కైకేయిని రెచ్చగొట్టి దశరథుని తన రెండు వరములు ఇవ్వమని అడగమనెను.
కైక వాగ్దానము చేసిన రెండు వరములను దశరథుని కోరెను.  మొదటి వరము క్రింద శ్రీరాముడు పదునాలుగు సంవత్సరములు వనవాసము చేయవలెనని కోరెను.  రెండవ వరము క్రింద భరతుడు రాజ్యమున పట్టాభిషిక్తుడ్ని  చేయవలెనని కోరెను.  ఖిన్న వదనముతో వేరొక మార్గములేక  దశరథుడు అంగీకరించెను.
శ్రీరాముడు నార వస్త్రములు ధరించి అరణ్యమునకు బయలుదేరెను.  శ్రీరాముడుఉన్న ప్రదేశమె నాకు అయోధ్య అని సీతమ్మ, ‘అన్న పాదములే నాకు గతిఅని లక్ష్మణుడు శ్రీరాముని వెంట బయలుదేరి వెళ్ళిరి.  గుహుడు వారిని నది దాటించెను. సీతారామ లక్షణులు ముగ్గురూ భరద్వాజ ముని ఆశ్రమునకు ఏగిరి.  అక్కడినుండి చిత్రకూటమునందు ఉన్న వాల్మీకి మహర్షి ఆశ్రమమును దర్శించిరి.  పశ్చాత్ ఆ చిత్ర కూటమునందే ఒక ఏకాంత ప్రదేశమునందు  పర్ణశాలను నిర్మించుకొనిరి. ఆ మువ్వురు చిత్రకూటమునందు ప్రశాంతముగా కాలము గడుపుచుండిరి.
శ్రీరాముడు వనవాసమునకేగిన తదుపరి ఆ పుత్రవియోగమును తట్టుకోలేక రామా రామా అంటూ ప్రాణములు విడుస్తాడు.   మామగారింటిలోనున్న భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చెను.  శ్రీరాముని వనవాస వృత్తాంతమువిని దుఃఖించెను. తల్లి కైకేయిని మందలించెను. సేనాసమేతుడై అరణ్యమునకు వెళ్ళెను.   మార్గములో గుహుని కలిసెను. భరద్వాజుని ఆశ్రమమునకు వెళ్ళెను. ఆయన ఆతిథ్యమును స్వీకరించెను.  పిమ్మట శ్రీరామచంద్రుని కలిసి అయోధ్యకు తిరిగి రమ్మనెను. రాజ్యమును స్వీకరించమని పరిపరివిధముల వేడుకొనెను.  శ్రీరాముడు సత్యపరాక్రమశీలుడు. పితృ ఆజ్ఞా పాలకుడు. అందువలన ససేమిరా రానుఅనెను. భరతుని సముదాయించెను.
భరతుని ప్రార్థనను ఆలకించి, ‘పదునాలుగు సంవత్సరముల వనవాసము పిదప ఒక్క క్షణముకూడా ఆలశ్యము చేయకుండా అయోధ్య చేరేదానని వాగ్దానము చేసెను. అంతవరకూ తనకు ప్రతీకగా తన పాదుకలను ఇచ్చి పంపించెను. ఆ పాదుకలను  శ్రీరామచంద్రుని ప్రతినిధి రూపముగా, మరియు అవియే రాజ్యమును పాలించుచున్నట్లుగా భావించుచు భక్తితో శ్రీరాముని రాకకై భక్తితో నిరీక్షించుచుండెను  భరతుడు.
శ్రీరాముడు కొంతకాలము అయిన తదుపరి అత్రిమహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను. ఆయనను దర్శించెను.  అనేకమంది మహర్షుల ఆశ్రమమునకు వెళ్ళెను. వారిని దర్శించెను.  తదుపరి శ్రీరాముడు విరాధుడు అనే రాక్షసుని సంహరించెను.  అక్కడినుండి సుతీక్షనుడి ఆశ్రమమునకు చేరెను.  అక్కడినుండి అగస్త్యుడి సోదరుని ఆశ్రమమునకు చేరెను. అటు పిమ్మట అగస్త్యమహర్షి  ఆశ్రమమునకు చేరెను.  ఆ మహర్షి శ్రీరామ చంద్రునికి గొప్ప ధనుస్సు, అంబులపొది, బాణములు, ఖడ్గమును ఇచ్చెను.
శ్రీరాముడు పంచవటి అను స్థానమును చేరెను. మార్గమధ్యములో జటాయువు అనే పక్షి తో స్నేహము చేసెను.  వారు ఒకరికి ఒకరు సహాయము చేసికొనుచుండిరి. అక్కడ పర్ణశాలను నిర్మించుకొనెను. సుఖముగా నివసించసాగెను.
రావణాసురుని సోదరి శూర్పణఖ.  ఆవిడ పంచవటి పరిసర ప్రాంతములో తిరుగాడుతూ శ్రీరాముని చూచెను.  ఆయన సౌందర్యమునకు ముగ్దురాలయ్యెను. కామపీడిత అయి శ్రీరాముని కోరెను. దానికి ఆయన కుపితుడయ్యెను.  అప్పుడు శూర్పణఖ లక్ష్మణుడి వెంటపడెను.  శ్రీరాముని ఆజ్ఞమేరకు లక్ష్మణుడు ఆవిడ ముక్కు, చెవులను కోసివేసి పంపించెను. తన పరాభావమును సోదరుడు ఖరునితో చెప్పెను.  ఆ ఖరుడు తన 14 వేల రాక్షసులతో యుద్ధమునకు వచ్చెను. ఆ తరువాత ఖరుడు మొదలయిన రాక్షసులను శ్రీరామచంద్రుడు వధియించెను. ఈ వార్త విని కుపితుడయ్యి రావణాసురుడు మారీచుని పంపెను.  రావణాసురుడు లంకాధిపతి.
మారీచుడు బంగారు లేడి రూపమును దాల్చెను. ఆ లేడి సౌందర్యానికి సీత ముచ్చట పడెను. అది తనకు కావలెనుఅని కోరగా శ్రీరామచంద్రుడు ఆ లేడిని వెంబడించెను.  దానిమీద బాణము వేసెను.  ఆ లేడి  ఓ లక్ష్మణా, ఓ సీతా   అని శ్రీరాముని స్వరమును అనుసరించుచూ మరణించెను. శ్రీరామునికి ఎదో ప్రమాదము సంభావించెనని తన మరిది లక్ష్మణుని శ్రీరాముని వెతికి తెమ్మనెను.  శ్రీరామునికి ఏమీ అవ్వదు అని చెప్పెను. సీతమ్మ లక్ష్మణుని శీలమును శంకించెను.  లక్ష్మణుడు బాధతో వెళ్తూ, ఆ పర్ణశాలచుట్టూ ఇసకతో ఒక గీత గీసెను. సీతమ్మను ఆ గీత దాటి బయటకి  రావద్దని చెప్పెను. దీనినే లక్ష్మణరేఖ అంటారు.
పర్ణశాలలో సీత ఒంటరిగా ఉండుటను గమనించాడు రావణాసురుడు. సాధువు వేషము ధరించి భిక్షాం దేహీఅంటూ వస్తాడు.  లక్ష్మణరేఖని గమనిస్తాడు. లక్ష్మణరేఖ దాటివచ్చి భిక్షము వేయమంటాడు. భిక్షము వేస్తున్న సీతమ్మను లంకకు బలవంతముగా  తన విమానములో ఆకాశామార్గమున తీసికెళ్తాడు రావణుడు. మార్గమధ్యములో శ్రీరాముని స్నేహితుడయిన పక్షి జటాయువు అడ్డుపడి ఎదుర్కొంటాడు. రావణాసురుడు జటాయువు రెక్కలు నరికి ఆ పక్షిని తీవ్రముగా గాయ పరుస్తాడు. సీతమ్మ   తన చీరను కొద్దిగా చింపి ఆ వస్త్రములో కొన్ని ఆభరణములను చుట్టి  కిష్కింధ సమీపములో పడవేస్తుంది.  సీతమ్మను వెదుకుతూ వెళ్తున్న శ్రీరామ లక్ష్మణులకు మార్గములో రెక్కలు తెగి రక్తసిక్తముగా పడియున్న జటాయువు కనబడతాడు. అతనిద్వారా రావణాసురుడు సీతమ్మను అపహరించి తీసికెళ్ళిన వృత్తాంతము తెలిసికుంటాడు.  జటాయువు మరణిస్తాడు. జటాయువుకు అంత్యక్రియలు నిర్వర్తించి ముందుకు  కదలుతారు శ్రీరామ లక్ష్మణులు.
మార్గములో కబంధుడు అనే రాక్షసుని సంహరిస్తాడు. అతనిద్వారా వానరుల రాజయిన సుగ్రీవుని వృత్తాంతము తెలిసికుంటాడు. పంపాసరోవర మార్గమును అనుసరించి పోవుచూ, మార్గములో శబరిని దర్శిస్తారు. ఆ శబరి వారిద్దరికీ తను రుచిచూచి బాగున్న ఫలములను వారికిస్తుంది. అవి ప్రేమ ఆప్యాయములతో ఆరగిస్తారు.  ముందుకేగి ఋష్యమూకపర్వతం సమీపమునకు చేరతారు.
అక్కడ హనుమంతుడు కనబడుతాడు. ఆయన ద్వారా సుగ్రీవుని కలుస్తారు శ్రీరామ లక్ష్మణులు. వారితో స్నేహము ఏర్పడుతుంది. సీత వదలిన ఆభరణములను సుగ్రీవుడు శ్రీరామునికి చూపిస్తాడు.  సుగ్రీవుని అగ్రజుడు వాలి. ఆయన అనుజుని భార్యని చెరబట్టెను.
ఆ వాలి సుగ్రీవుడు ఇద్దరూ ఒకే పోలికలో ఉంటారు. అంతేకాదు, వాలికి ఒక వరమున్నది. ఎదుటి వాడి బలములో సగము వాలికి వసుంది.  అనగావాలి యుద్ధము చేయునప్పుడు ఒకటిన్నర బలము, ఎదుటివాడికి వాడి బలములో సగము బలము మాత్రమె మిగులు తుంది.   శ్రీరాముడు సుగ్రీవునికి మేడలో పూలదండ వేసికొని వాలితో గదాయుద్ధము చేయమని చెప్తాడు.  వాలి ఒక వానరము. అది ఒక పశువు జాతికి చెందినది.  పశువు ను వెనకనుండి చంపవచ్చు.  శ్రీరాముడు వాలిని చెట్టు వెనకాల ఉండి, బాణమువేసి చంపుతాడు.
సుగ్రీవుడు వానరులనందరను పిలిచి సీతను వెదుకుటకై నలుదెసల పంపుతాడు.  హనుమంతుని, మరియు అంగదుడిని దక్షిణదిక్కుకు పంపుతాడు. వారు సముద్ర తీరమును చేరుకుంటారు. జటాయువు యొక్క అన్న సంపాతి. ఆయన ద్వారా సీత జాడను తెలిసికుంటారు. లంకకు తీసికెళ్ళాడని చెప్తాడు.  నూరుయోజనముల దూరం గల సముద్రమును ఎవరు దాటగాలరా అని వానరులు ఆలోచిస్తూ ఉంటారు.   అప్పుడు జాంబవంతుడు ఏంటో శక్తి సామర్త్యములు గల హనుమంతుడు మాత్రమె దీనికి తగినవాడు అని చెప్తాడు. వానరులంతా  హనుమంతుడ్ని పొగడగా ఆయన దాటుటకు సిద్ధమగుతాడు. 
వెంటనే హనుమంతుడు సముద్రమును దాటి లంకాపురిని చేరుకొనేను.  లంఖిణీ అనే  రాక్షసి లంకాపురమునకు రక్షకురాలు. అది ఆయనను అడ్డగిస్తుంది. దానిని చంపివేస్తాడు. లంకయందు ఎక్కడెక్కడో వెదకుతాడు. సీత జాడ తెలియదు. అయినాను పట్టు విడవకుండా ఆఖరికి అశోకవన వాటికయందు సీతమ్మను కనుగొంటాడు.   తను శ్రీరామచంద్రుని బంటుని నేను అనిచెప్తాడు. గుర్తుగా శ్రీరామచంద్రుడిచ్చిన అంగుళీకమును చూపిస్తాడు. ఆమెకు ధైర్యోత్సాహములను కలుగజేస్తాడు. శ్రీరామునికి చూపుటకు నిదర్శనముగా ఆమెనుంది చూడామణిని తీసికుంటాడు.
అక్కడినుండి హనుమంతుడు అశోకవనమండలి చెట్లు చేమలు ద్వంసం చేస్తాడు. అడ్డుపడిన రాక్షలందరినీ సంహరిస్తాడు. ఆఖరికి రావణాసురుని పుత్రుడు అయిన అక్షయకుమారునికూడా వధిస్తాడు.  అప్పుడు రావణాసురుని ఇంకొక పుత్రుడు అయిన ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రము వేసి బంధిస్తాడు. తండ్రి వద్దకు తెసికొని వెళ్తాడు.  రావణుడు ఆయనను సంహరించమని భటులకు ఆజ్ఞ ఇస్తాడు.  అతని ఇంకొక సోదరుడయిన విభీషణుడు  దూతను చంపుట తప్పు అని,  ఏదయినా శిక్ష వేసిపంపమని అంటాడు.  అందుకు రావణుడు, కోతికి తోక ముఖ్యము, అందువలన ఆ తోకకి నిప్పు అంటించి వదలమంటాడు. ఆ రాక్షసులు అటులనే తోకకి నిప్పు అంటిస్తారు.  హనుమంతుడు ఆ లంకా పట్టణమంతా నిప్పు అంటిస్తాడు.  సముద్రములో తోక ముంచి చల్లబరుస్తాడు. ఆ తరువాత శ్రీరామునిచేరి సీత వృత్తాంతమంతా చెప్తాడు. సీతమ్మ ఇచ్చిన చూడామణిని శ్రీరామునికిస్తాడు. హనుమంతుని కార్యదక్షతకు, మరియు సేవానిరతికి చాలా సంతోషిస్తాడు.
విభీషణుడు రావణాసురుని ఇంకొక సోదరుడు.  విభీషణుడు అన్నతో పరాయివాని భార్య సీతమ్మను చెరబట్టుట ధర్మ విరుద్ధముఅని చెప్తాడు. ఆ అమ్మను శ్రీరామునికి తిరిగి ఇచ్చేయ్యమంటాడు. దానికి కుపితుడయ్యి రావణాసురుడు  తన సోదరుడు విభీషణుని లంకనుండి వెళ్ళగొడతాడు.  విభీషణుడు శ్రీరామునిచేరి శరణు వేడుతాడు.  ఆయనను తన పక్షములో చేర్చుకుంటాడు.
నలుడు లంక మీద వారధిని నిర్మించుటకు నియుక్తమవుతాడు. వానర సైన్యముతో లంకాపురము చేరుతాడు. అంగదుని రాయబారిగా పంపుతాడు. రావణుడు ససేమిరా ఒప్పుకోడు. యుద్ధమునకే సన్నిద్ధుడవుతాడు. అప్పుడు ఇరు సైన్యములకు ఘోరమయి న  రామ రావణ యుద్ధము జరుగుతుంది.  
రావణుని సేనానాయకులలో ఒకడయిన విరూపాక్షుడ్ని లక్ష్మణుడు సంహరిస్తాడు. యజ్ఞకోపుడు, అగ్నికేతువు, రశ్మి కేతువు, సుప్తఘ్నుడు, అనువారిని శ్రీరాముడు సంహరిస్తాడు. ఇంద్రజిత్తు రామలక్ష్మణులపై నాగబంధమును వేస్తాడు. గరుడాయుధముతో  దానిని ఛేదిస్తాడు. ఆ తరువాత ధూమ్రాక్షుడు, వజ్రదంష్ట్రుడు, అకంపనుడు, ప్రహస్తుడు, కుంభకర్ణుడు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు, మహోదరుడు, త్రిశురుడు, మహాపార్ష్యుడు అను రాక్షసులు సంహరించబడుతారు.
రావణాసురుని పుత్రుడు ఇంద్రజిత్తు మేఘములచాటుకు వెళ్లి రామలక్ష్మణులపై యుద్ధము చేసి వారిని మూర్ఛితులను చేస్తాడు.  జాంబవంతుని సలహామేరకు హనుమంతుడు హిమాలయ పర్వతములపైకి వెళ్లి సంజీవని పర్వతం పెకిలించుకు వస్తాడు.  సంజీవని మూలికవలన వారు మూర్ఛనుండి మేలుకొని స్వస్తులవుతారు. మరల హనుమంతుడు ఆ శిఖరమును తీసికెళ్ళి యథాతథంగా ప్రతిష్ఠించి వస్తాడు. 
పశ్చాత్ జరిగిన యుద్దమందు, కుంభకర్ణుడి పుత్రులయిన కుంభ నికుంభులు,  యూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంఘుడు, కంపనుడు,  మకరాక్షుడు, అను నాయకులు సంహరించబడుతారు.
పిమ్మట లక్ష్మణుడు రావణుడి కుమారుడు ఇంద్రజిత్తుని సంహరించుతాడు.  సుగ్రీవుడు  విరూపాక్షుని, మహోదరుని సంహరించుతాడు.  అంగదుడు మహాపార్శ్వుని సంహరించు తాడు. అప్పుడు కుపితుడయిన రావణుడు తన భయంకరమయిన శక్తి ఆయుధమును ప్రయోగించి లక్ష్మణుడిని మూర్ఛితుడ్ని  చేస్తాడు.  శ్రీరాముడు తనకి ప్రతిగా ఇంకొక అస్త్రము వేసి ఆ శక్తిని తీసేస్తాడు. సుషేణుని సూచనమేరకు మహోదయ పర్వత శిఖరమును పెకిలించుకు వస్తాడు హనుమంతుడు. అందలి ఔషధులను పెరికి నూరి లక్ష్మణుని నాసికవడ్డ ఉంచి ఆరోగ్యవంతుడ్ని చేస్తాడు.
అటుపిమ్మట రావణునకు శ్రీరామునకు భీకరమయిన యుద్ధము జరిగెను. ఆ సమయములో అగస్త్య మహర్షి శ్రీరామునకు ఆదిత్యహృదయము చెప్పెను. దానిని మూడుసార్లు జపించెను.  శ్రీరాముడు బ్రహ్మాస్త్రము వేసి  రావణుని సంహరిస్తాడు.
అనంతరము విభీషణునకు శ్రీ లంకకు రాజ్యాభిషేకము గావిస్తాడు. శ్రీరాముని సూచన మేరకు సీతమ్మను తీసికొని వస్తారు. పరాయి ఇంట్లో ఉన్న స్త్రీ మీద ప్రజల సందేహము నివృత్తిచేయుటకా అన్నట్లుగా సీతమ్మ అగ్నిప్రవేశము చేస్తుంది.
కర్మణా మనసా వాచా యథా నాతిచరామ్యహం
రాఘవం సర్వ ధర్మంజ్ఞ తథా మాం పాతు పావకః 
కర్మచేతను,  మనస్సుచేతను, వాక్కుచేతను, సర్వధర్మజ్ఞుడగు శ్రీరామునిచేతను నేను అతిక్రమించనిచో  అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక.
అగ్నిదేవుడు సీతమ్మను సురక్షితముగా బయటికి తీసికోస్తాడు. సీతమ్మ పాపరహిత, అగ్ని లాంటిదని చెప్తాడు. యుద్ధమున చనిపోయిన వానరులందరినీ  ఇంద్రుడి సహాయముతో పునరుజ్జీవులను చేస్తాడు. తదుపరి శ్రీరాముడు పుష్పకవిమానమును అధిరోహించి సకుటుంబ సపరివార సమేతముగా అయోధ్యకు బయలుదేరుతారు. మార్గములో భరద్వాజ ముని ఆశ్రమమునకు వెళ్లి ఆయనకు ప్రణమిల్లుతాడు.  హనుమంతుని పంపి గుహునికి, భరతునికి తన రాకగురించి తెలియజేస్తాడు. భరతుడు పరమానంద భరతుడు అవుతాడు. ప్రజా సమేతముగా వెళ్లి శ్రీరామునికి సాష్టాంగనమస్కారం చేస్తాడు. అనదరూ కలిసి అయోధ్యకు వస్తారు. సుగ్రీవుడు, హనుమంతుడు, విభీషణుడు అందరినీ శ్రీరాముడు  సముచితరూపమున సత్కరిస్తాడు.  శ్రీరాముని పట్టాభిషేకము పరమానందకరముగా జరుగుతుంది.
రామాయణము నుండి నేర్చుకొనవలసిన ధర్మము:
సుఖదుఃఖములు, లాభనష్టములు, జనన మరణములు, ఉత్పత్తి వినాశములు, ఇత్యాదివి దైవసంకల్పమే. అందువలననే నాకు రాజ్యప్రాప్తి జరుగుతున్నదని సంతోషము కాని, విఘాతము జరిగినదని  దుఃఖము కాని నాకు లేదు.  ఇట్టి తాత్వికబుద్ధిచే మనస్సును స్థిరము పఱచుకొనవలయును.
కేవలము కామమును అనుసరించవలయును. లేనియడల దశరథునివాలే శీఘ్రముగ ఆపట్టునండు పడిపోవును. నాస్తికుల సహవాసము చేయకూడదు. వారు అజ్ఞాన తార్కికులు.  వారే పండితులని తలచుదురు.
గురుజనులకు, పెద్దలకు, తపస్వులకు, దేవతలకు, అతిథులకు, పవిత్ర వృక్షములకు, నమస్కరించవలయును.
నాస్తికత్వము, అసత్యభాషణము, కోపము, సోమరితనము, దీర్ఘసూత్రత్వము, జ్ఞానుల సాంగత్యము లేకుండుట, అలసత్వము, ఇంద్రియములకు లోబడుట, రాజ్యకార్యములను ఒంటరిగా విచారించుట, మూర్ఖుల సలహా స్వీకరించుట, నిశ్చయింపబడిన కార్యములను శీఘ్రముగా ప్రారంభింపకుండుట, గుప్తమంత్రనములను సురక్షితముగానుంచక ప్రకటించుట, శుభకార్యములను, పుణ్యకార్యములను అనుష్ఠింపకుండుట, శత్రువులందరి పైనను ఒకేసారి దండెత్తుట, --అను ఈ 14 దోషములను పరిత్యజించవలయును.  రుచికరమగు భోజనము ఒంటరిగా తినకూడదు. పదిమందితో పంచుకొని తినవలయును.
పదార్థ సంగ్రహము ఆఖరికి వినాశమే అగును. లౌకిక ఉన్నతుల అంతము పతనమే. సంయోగము అంతము వియోగమే. 
సర్వే క్షయంతా నిచయాః పతనాంతాః సముచ్ఛృయాః
సంయోగా విప్రయోగాంతా మరణాంతం చ జీవితం
ప్రపంచాములోని వస్తువులన్నిటియొక్క అంతము వినాశమైయున్నది. ఉత్థానస్థితియొక్క అంతము పతనము. సంయోగము యొక్క అంతమువియోగము. జీవితముయొక్క అంతము మరణము.
తస్మాత్ పుత్రేషు దారేషు మిత్రేషు చ ధనేశుచ
నాతి ప్రసఙ్గః కర్తవ్యో విప్రయోగోహి తైర్ధ్రువం 
అందువలన పుత్రా, స్త్రీ, మిత్ర, ధనములందు విశేషమయిన ఆసక్తిని చూపగూడదు. ఎందుకంటే వానితో వియోగము తప్పక కలువగలదు.
అవశ్యమేవ లభతే ఫలం పాపస్య కర్మణః
భారతః పర్యాగతే కాలే కర్తా నాస్త్యత్ర సంశయః
సమయము వచ్చినప్పుడు కర్తకు తన పాపకర్మయొక్క ఫలము తప్పక లభించును.
శుభకృత్ శుభమాప్నోతి పాపక్రుత్ పాపమశ్నుతే
విభీషణః సుఖం ప్రాప్తస్త్వం ప్రాప్తః పాపమీదృశం 
శుభకర్మలు చేసేవారికి ఉత్తమఫలములు పొందుతారు.  పాపకర్మనొనర్చు వారు దుఃఖము పొందుతారు.  విభీషణుడు శుభకర్మలు చేసేను. కనుక వారికి సుఖము పొందెను. రావణుడు పాపకార్యములు చేసెను. అందువలన  దుఃఖము పొందెను.
పవిత్ర గంగా తీరమున ఏకాంతప్రదేశములందును, వనప్రదేశములందును, ఆశ్రమములను ఏర్పాటుచేసికొని ఎందఱో మహానుభావులు కందమూలములను, ఫలాదులను తిని, దృశ్య వ్యామోహములనుండి దృష్టిని మరల్చి, ఆధ్యాత్మ విచారణ యందు నిమగ్నులై కాలము గడిపిరి.
రామాయణములో మొదలగు ఆశ్రమముల పరిచయము లభించుచున్నది.  విశ్వామిత్రుని సిద్దాశ్రమము, భరద్వాజుని ఆశ్రమము, వాల్మీకి ఆశ్రమము, శరభంగుని ఆశ్రమము, సుతీక్షుణునిఆశ్రమము, అగస్త్యసోదరుని ఆశ్రమము, అగస్త్యసోదరుని ఆశ్రమము, అగస్త్యాశ్రమము,  శబరి ఆశ్రమము.
శోకో నాశయతే  ధైర్యం శోకో నాశయతే శ్రుతం
శోకో నాశయతే సర్వం నాస్తి శోక సమో రిపుః
శోకము ధైర్యము నశింప చేయును. శోకము శాస్త్ర జ్ఞానము మరచునట్లు చేయును. శోకము సమస్తము నష్టపరచును. కావున శోకమునాకు సమమయిన శత్రువు మరియొకడు లేడు.
గురులాఘవ మర్తానారంభే కర్మణాం ఫలం
దోషం వా యో నజావాతిస బాల ఇతిహోచ్యతే
కర్మలను చేయవలయును. ఆ కర్మవలన కలిగే లాభ నష్టములను తెలియని వాడు బాలుడే అని చెప్పవలయును.
యథా కాష్ఠం చ కాష్ఠం చ సమేయాతాం మహార్ణవే 
సమేత్యాతు వ్యపెయాతాం కాలమాసాద్య కంచన
ఏవం భార్యాశ్చ పుత్రాశ్చ జ్ఞాతయశ్చ వసూనిచ
సమేత్య వ్యవధావంతి ధ్రువో హ్యేషాం వినాభావః
మహాసముద్రమున కొట్టుకొని పోవుచున్న కట్టెపుల్లలు ఒక్కొక్కప్పుడు కలియును. ఒక్కొక్కప్పుడు విదిపోవును. అదేవిధముగా స్త్రీ, పుత్రా, కటుంబ, ధనములు ఒక్కొక్కప్పుడు చెంతకు వచ్చును. ఒక్కొక్కప్పుడు విదిపోవును. ఇది తప్పనిసరి.
మనసా కర్మణా వాచా చక్షుషా చ సమాచరేత్
శ్రేయోలోకస్య చరతో నద్వేష్టి నచ లిప్యతే
మనస్సు చేతను, వాక్కుచేతను,  క్రియచేతను,  దృష్టిచేతను,  జనులకు మంచినే చేయవలయును. ఎవ్వరియందును ద్వేషము ఉండరాదు.  అటువంటివాడు పాపముచే అంటబడడు.  


వశిష్ట మహర్షి :
వశిష్టో బ్రహ్మణో సుతః  వశిష్ట మహర్షి  బ్రహ్మదేవుని పుత్రుడు.
స్వధర్మం ప్రతిపద్యస్వ నాధర్మం వోఢుమర్హసి మీరు మీ ధర్మమును పాలించండి. అధర్మమును నెత్తిమీద పెట్టుకొనకూడదు.  
దిగ్బలం క్షత్రియబలం బ్రహ్మతేజోబలంఏకేన
బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతాని మే
క్షత్రియబలము నాకు దికారమగుగాక. బ్రహ్మతెజముచే లభించు బలమే బలము. అది వాస్తవబలము. ఒక్క బ్రహ్మదండము నా అస్త్రములన్నిటినీ నాశనము చేయగలదు. 
విశ్వామిత్రుడు
శతానందుడు జనకుని పురిహితుడు. ఆయన శ్రీరామునితో విశ్వామిత్రుని గురించి ఇట్లనెను.
ఏష రామ మునిశ్రేష్ఠ ఏష విగ్రహవాం తపః
ఏష ధర్మః పరో నిత్యం నీర్యస్యైష పరాయణం
ఓ రామ, ఈ విశ్వామిత్రుడు మునులన్దరిలోను శ్రేష్ఠుడు. మూర్తీభవించిన తపస్సు, మూర్తీభవించిన సాక్షాత్ నిగ్రహము, మరియు పరాక్రమముయొక్క నిధి. 
వాల్మీకి
మునయశ్చ మహాత్మానో వనంత్యస్మిన్ శిలోచ్చయే
అయం వాసో భవేత్తాత వయమత్ర వసేమహి
ఈ చిత్రకూటమునందున్న పర్వతముపై మహాత్ములగు మునులు అనేకమందు నివసించుచున్నారు.  ఇది మనకు యోగ్యమయిన నివాస స్థానముగా ఉన్నది. మనము ఇచటనే నివసించెదము.
అగస్త్యుడు
అత్ర దేవాశ్చ యక్షాశ్చ నాగాశ్చ సతగైః సహ
వసంతి నియతాహారా ధర్మమారాధయిష్ణవః
అగస్త్యుడు మహాతపస్వి. అగస్త్యుని సిద్దాశ్రమములో దేవతలు, యక్షులు, నాగులు, పక్షులు, నియమితమయిన ఆహారమును తీసికుంటారు. ధర్మమును ఆరాదిస్తారు.
భరద్వాజుడు
సంశితవ్రతమేకాగ్రం తపనా లబ్ధచక్షుశం
భరద్వాజుడు మహాతపస్వి. గంగా యమునా సంగమ సమీపమున వారిఆశ్రమము గలదు. ఆయన తన తపః ప్రభావముచే త్రికాలములను గూర్చిన దివ్యదృష్టిని బడసినవారును, ఏకాగ్రచిత్తులును తీవ్రవ్రతధారియు అయిఉండెను.
రామప్రవ్రాజనం హ్యేతత్ సుఖోదర్కం భవిష్యతి.
శ్రీరాముని ఈ వనవాసము భవిష్యత్ నందు చాలా ఆనందదాయకముగా నుండును  అని భరద్వాజుడు భరతునితో అనెను.


Comments

  1. T-Mobile's latest supplier of metal - iTanium-arts
    T-Mobile's latest supplier titanium watch band of metal oxide will how much is titanium worth launch 바카라 사이트 its next titanium rod in femur complications 2019 ford fusion hybrid titanium a new addition to the T-Mobile line up as it releases its own T-Mobile

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana