3. అరణ్యకాండ -- రామాయణము

 

3.   అరణ్యకాండ

శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతముగా దండకారణ్య మహారణ్యమును ప్రవేశించెను. అటుపిమ్మట పెక్కు ఆశ్రమములను దర్శించెను.

పుణ్యైశ్చ నియతాహారైః శోభితం పరమర్షిభిః

తద్ బ్రహ్మ భవనప్రఖ్యం బ్రహ్మఘోషనినాదితం                          1

నియమితమగు ఆహారము తీసుకొనువారును, పవిత్రులైన మహర్షులయొక్క సుశోభితములు, సుందరములు అయిన వారి వారి ఆశ్రమములు బ్రహ్మదేవుని నివాసమువలె తెజోవంతములు, వేదధ్వనితో ప్రతిధ్వనించునవియు అయి యున్నవి.

 అత్యంతప్రియుడయిన శ్రీరామ సీత లక్మణులను ఆహ్వానించి తమ తమ పర్ణశాలలకు ఋషులు తీసికొని వెళ్ళిరి. ఆ ఋషులకు జరిగిన విషయము అంతా శ్రీరామ సీత లక్మణులు చెప్పిరి. దానికి ఆ ఋషులు యిట్లనిరి: శ్రీరామా, మేము క్రోధమును వదిలివేసితిమి. రాజు ధర్మమును పరిపాలించువాడును, యశస్వియును, ప్రజలకు శరణ్యుడును, పూజనీయుడును, మాన్యుడును, అందరికీ గురుసమానుడును, అయి ఉండవలయును. మేము  ఇంద్రియములను జయించితిమి. ఇప్పుడు తపస్సే మా ధనము. తమరు మమ్ములను రక్షించవలయును.

వారివద్ద సెలవు తీసుకొని మరునాడు ఉదయమే బయల్దేరి ఆ వనమందు ముందుకు సాగిపోయిరి. మార్గమధ్యమములో అక్కడ వారికి ఒక భయంకరమైన రాక్షసుడు తారసపడెను. నా పేరు విరాధుడు. నేను నరమాంసభాక్షణ చేయుచు ఈ వనమందు తిరుగాడువాడను. బ్రహ్మదేవుని వరముతో నేను ఏ శాస్త్రముతోను చావకుండునట్లు వరమొందితిని. తత్తడుపరి శ్రీరామ లక్మణులు వాడి చేతులు రెండూ నరికివేసిరి. 

తమ్ ప్రేక్ష్య రామః సుభ్రుశమ్ అవధ్యమచలోపమం

భయేష్వ భయదః శ్రీమానిదం వచనమ్  అబ్రవీత్                          2

వధించుటకు వీలుకానివాడును, పర్వతమువలె అచంచలుడును, అయిన విరాధుని తిరిగి తిరిగి చూచెను. భయస్తులకు అభయమును ఒసంగు తమ్ముడు లక్ష్మణునితో శ్రీరాముడు ఇట్లనెను. 

అన్నా, ఆ రాక్షసుడు విరాధుని గోతిలో పూడ్చిబెట్టెదము. తత్తదుపరి ఆగోతిలో పూడ్చిబెట్టబడిన ఆ విరాధునికి శాపవిమోచనము కలిగెను. ఆ మాటలువిని విరాధుడు ఇట్లనెను: నేను కుంబురుడు అను గంధర్వుడ్ని. కుబేరుడు నన్ను శపించెను. కుంబురా, దశరథ కుమారుడయిన శ్రీరాముడు నిన్ను వధించి శాపవిముక్తుడ్ని చేయును. నీవు అప్పుడే స్వర్గ లోకమునకు ఏగెదవు. శ్రీరామా, నీవలన నాకు శాపవిమోచనము కలిగినది.  శ్రీరామా, ఇక్కడినుండి ఒకటిన్నర యోజనముల దూరములో అమిత తేజోవంతుడు, ప్రతాపవంతుడు, ధర్మాత్ముడు, అయిన శరభంగుడు అను మహాముని నివసించుచున్నాడు. అతనివద్దకు వద్దకు వెంటనే వెళ్ళుము. ఆయన నీకు హితము చేకూర్చును.  

శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతముగా తపోధనుడయిన శరబంగుని ఆశ్రమమునకు వెళ్ళెను. అక్కడ వారి పాదములకు ప్రణమిల్లెను. వారి ఆజ్ఞచే అచ్చట ఆ రాత్రి ఉండిరి. శ్రీరామా, నేను తీవ్రతపస్సు చేసి ఇంద్రియములను జయించితిని. శ్రీరామా, మీరు ఇక్కడికి కొద్దిదూరములోనున్న సుతీక్ష్ణుడు అను మహాముని వద్దకు వెళ్ళండి మీకు శుభం చేకూరుతుంది.  

సుతీక్ష్ణుడు, “ఈ వనమందు నివసించు వానప్రస్థులగు పెక్కుమంది రాక్షసులచే వధించబడుచున్నారు. శ్రీరామా, మమ్మల్ని వీరినుండి కాపాడండి” అనెను. అందుకు ప్రతిగా శ్రీరామచంద్రుడు,  “మహాత్ములారా, దుష్టరక్షణ శిష్టరక్షణ కై నా జీవితము అంకితము. మీలాంటి తపస్కులను కాపాడుటయే నా తక్షణ కర్తవ్యము. మీ ప్రయోజనము కొరకే దైవం నన్ను ఇక్కడికి పంపెనేమో” అనెను. సుతీక్ష్ణుడు ఇట్లనెను: శ్రీరామా, నేను మీకొరకే ఎదురుచూస్తున్నాను. అందువలననే ఈ శరీరమును వదిలి ఇంకా దేవలోకమునకు వెళ్ళలేదు.   

ప్రాతః కాలమున లేచి సుతీక్ష్ణుని ఆజ్ఞనుబడిసి, శ్రీరామ, సీత లక్ష్మణులు వనమువైపునకు బయల్దేరిరి. అప్పుడు సీతమ్మ తనభర్తతో ఇట్లనెను.

బుద్ధిర్వైరం నినా హన్తుం రాక్షసాన్ దండకాశ్రితాన్

అపరాధం వినా హన్తుం లోకో వీర న మంస్యతే                                             3

శతృత్వము లేకనే దండకారణ్య రాక్షసులను వధించు ప్రయత్నమూ చేయరాదు. వీరోత్తమా, అపరాథము చేయని  ప్రాణులను వధించకూడదు. దీనిని ప్రపంచవాసులు మంచిదిగా భావించరు.

ధర్మాదర్థః ప్రభవతి ధర్మాత్ ప్రభవతే సుఖం

ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్                               4

ధర్మముచే అర్థము సంప్రాప్తించుచున్నది. ధర్మమువలననే సుఖము కలుగుచున్నది. ధర్మమువలననేమనుజుడు సమస్తము పొందుచున్నాడు. ఈ ప్రపంచమునకు హేతువు  ధర్మమే అయిఉన్నది.

ఆత్మానం నియమై స్తై స్తై కర్షయిత్వా ప్రయత్నతః

ప్రాప్తయే నిపుణైర్ధర్మో న సుఖాల్లభతే సుఖం                                    5 

మనుజుడు తన శరీరమును  అనేక నియమములతో కష్టబెట్టుకొని ప్రయత్న పూర్వకము గా ధర్మమును అనుసరిస్తున్నారు.  ఎందుకంటే సుఖముచేకూడిన సాధనతో  సుఖము నకు హేతువయిన అయిన ధర్మము ప్రాప్తించదు.  

నిత్యం శుచిమతిః సౌమ్య చర ధర్మం తపోవనే

సర్వం తు విదితం తుభ్యం త్రైలోక్యామపి తత్వతః                               6  

సౌమ్యా, మీరు ప్రతిదినము శుద్ధచిట్టులై, వనమందు తపము చేయుము. ధర్మమును ఆచరింపుము. స్వామీ, మీకు తెలియనిది ముల్లోకములలో ఏదియును లేదు.

స్వామీ, నేను చపలత్వముతో మీకీ వాక్యములను నివేదించితిని. యదార్థానికి, మీకు ధర్మమును ఎవరు ఉపదేశించగలరు. మీకు మీరే సమర్థులు. మీరు లక్ష్మణునితో చర్చించి ఏది ఉత్తమమో దానిని ఆచరించుడు. దానికి శ్రీరామచంద్రుడు ఇట్లనెను. ఓ సతీ, దుఃఖిత జనులు నా వద్దకు వచ్చిరి. ప్రజలు వారే స్వయముగా నన్ను శరణువేడిరి.

మయాచైతద్వచః శృత్వా కార్స్త్యేన పరిపాలనం

ఋషీనాం దండకారణ్యే సంశృతం జనకాత్మజే                                    7

జానకీ, దండకారణ్యములోని ఋషుల వచనములను వింటిని. వారిని రక్షించుటకొరకై పూర్ణముగా ప్రతిజ్ఞ పూనితిని.

సంశృత్య చ న శక్ష్యామి జీవమానః ప్రతిశ్రవం

మునీ నా మన్యథా కర్తుం సత్యమిష్టం హి మే సదా            8

నేను మునుల ఎదుట ప్రతిజ్ఞ చేసితిని. అట్టి ప్రతిజ్ఞను నేను జీవించియుండగానే మిథ్య నొనర్చజాలను. ఎందుకంటె సత్యపరిపాలనము నాకు సదా ప్రియమైనది.  

అప్యాహం జీవితం జహ్యాం త్వాం వాసీతే సలక్ష్మణాం

స తు ప్రతిజ్ఞాం సంశృత్య  బ్రాహ్మణేభ్యో విశేషతః                                             9

సీతా, నేను ప్రాణత్యాగము చేయగలను, నిన్ను లక్ష్మణుని త్యాగము చేయగలను. కాని నేను నా ప్రతిజ్ఞను, ముఖ్యముగా బ్రహ్మనిష్ఠులకై నేను చేసిన ప్రతిజ్ఞను భంగమొనర్ప జాలను.

తదవశ్యం మయా కార్యం ఋషీణాం పరిపాలనం

అనుక్తేనాపి వైదేహి ప్రతిజ్ఞాయ కథం పునః                                           10

కనుక జానకీ, ఋషులను రక్షించుట నా యొక్క విద్యుక్తధర్మము. ఋషులు చెప్పకుండానే వారిని రక్షించుట నా ధర్మమూ. అటువంటప్పుడు, వారే స్వయముగా అడిగినప్పుడు, నేను వారిని రక్షించకుండా ఉండగలను.

శ్రీరామచంద్రమూర్తి తన సతీమణి సీతమ్మతో చెప్పి భార్యసమేతముగా లక్ష్మణునితో సహా ఆ రమణీయమయిన వనమందు సంచరించ సాగెను. మునుల ఆశ్రమములయందు  మధ్య మధ్య వసించుచు వారికి పది సంవత్సరములు గాంచెను. శ్రీరాముడు సతి జానకి మరియు సోదరుడు లక్ష్మణునితో తిరిగి సుతీక్ష్ణుని ఆశ్రమమునకు వచ్చెను. ఆయన వినయముగా సుతీక్ష్ణునితో అగస్త్య మహర్షి ఆశ్రమము గురించి అడిగెను. దానికి సంతోషించిన సుతీక్ష్ణుడు ఇక్కడికి దగ్గిరలో అగస్త్య సోదరుని ఆశ్రమము ఉన్నది. అక్కడ ఈ రాత్రి గడిపి రేపు ఉదయము అగస్త్యమహర్షి ఆశ్రమమునకు జనుడు అని సెలవిచ్చెను.

యది బుద్ధిః కృతా ద్రష్టుమగస్త్యం తమ్ మహామునిం

అద్యైవ గమనే బుద్ధిం రోదయస్వ మహామతే                               11

ఓ, బుద్ధిమటీ, మీరు అగస్త్యమహర్షిఆశ్రమమును దర్శయించ నిచ్చగించినచో, నేడే అచటికిబోవ నిశ్చయించుడు.

సుతీక్ష్ణమహాముని వాక్యములు వినినంతనే శ్రీరాముడు సీతా లక్ష్మణునితో ఆయన పాదములకు ప్రణమిల్లి అగస్త్యమహర్షిఆశ్రమమును దర్శయించ ముందుకు జనెను.

తత్తదుపరి అగస్త్యమహర్షి సోదరుని ఆశ్రమమును జేరెను.

శ్రీరాముడు సాయం సంధ్యల నొనర్చి సోదరునితోసహా అగస్త్యమహర్షి సోదరుని పాదములకు ప్రణమిల్లెను. ఆయన యథారీతిని వారిని సత్కరించెను. వారు తమ భార్య సీతమ్మతోను, మరియు తమ్ముడు లక్ష్మణునితోను ఆ రాత్రి అక్కడ గడిపిరి. అటుపిమ్మట అగస్త్యమహర్షి సోదరుని ఆజ్ఞను బడసి అగస్త్యమహర్షి ఆశ్రమమునకు జనెను. శ్రీరాముడు “అగస్త్యుడు పాదము అడుగు పెట్టినచోట రాక్షసులు వారి రాక్షస్వభావమును పరిత్యజించి శాంతముగా తిరుగాడుచున్నారు.  ఆహా ఏమి భాగ్యము మనది అట్టి ఆశ్రమములోనికి అడుగిడుచున్నాము” అనిరి.

అత్ర దేవాః సగంధర్వాః సిద్దాశ్చ పరమర్షయః

అగస్త్యం నియతాహారాః సతతం పర్యుపాసతే                                     12

ఇక్కడ దేవతలు, గంధర్వులు, సిద్దులు, మహర్షులు, అందరూను, నియమిత ఆహారములు తీసుకుంటూ, అగస్త్యమహామునిని ఎల్లవేళలా ఉపాసిస్తున్నారు.

అభివాద్యతు ధర్మాత్మా తస్థౌ రామః కృతాంజలిః

సీతయా సహ వైదేహ్యా తదా రామః సలక్ష్మణః                                    13

అప్పుడు ధర్మాత్ముడు, అందరికీ ప్రీతిగొల్పువాడు, ఉత్తమగుణసంపన్నుడు అయిన శ్రీరాముడు సతి సీతమ్మతో మరియు సోదరుడు లక్ష్మణునితో సహా శరీరమును మరిచి ఆ మహర్షి పాదములకు ప్రణమిల్లెను.

మహర్షి శ్రీరామ సీతా లక్ష్మణులకు ఉచితరీతిని సత్కరించి ఆసనములపై వారిని కూర్చుండబెట్టెను. అగస్త్యమహాముని ఇట్లనెను: శ్రీరామా, వానప్రస్థుడు ముందుగా అగ్నియందు ఆహుతి వేయవలయును. పిమ్మట అతిథికి అర్ఘ్యమును ఇచ్చి సత్కరించవలయును. మీరు లోకమునకంతాను పూజనీయులు, ఆదర్శవంతులు, వందనీయులు. అట్టిమీరు మా ఆశ్రమమునకు వేంచేసియున్నారు. అట్టి శ్లాఘనీయు లయిన మీకు సత్కారముచేయుట మిక్కిలి అభిలషనీయము. ఇట్లు చెప్పి  వారికి ఫల, మూల, ఇత్యాదులతో సత్కరించెను. అప్పుడు అగస్త్యమహాముని వారికి ధనుస్సు రెండు అంబులపొదులను, బాణములు, ఖడ్గమును ఇచ్చెను. అవి ఇచ్చి వారితో ఇట్లనెను: శ్రీరామా ఇక్కడికి రెండు యోజనములదూరములో పంచవటి అను స్థానము ఉన్నది. అక్కడ ఫలములు, కంద మూలములు, హరిణులు, సెలయేరులతో కడు రమణీయము గా, మనోహరముగా ఉండును. అక్కడి ఋషులను, మునులను రక్షించుటకై అక్కడే నివసింపురు.

సంతసించిన సీతా రామ లక్ష్మణులు వారి పాదములకు ప్రణమిల్లి పంచవటి దిశగా జనిరి. మార్గ మద్యములో భయంకరమయిన గృధ్రము అనగా గద్ద కనిపించెను. అది శ్రీరామునితో ఇట్లనెను. “వత్సా, నేను మీ తండ్రి దశరథుని మిత్రుడ్ని. నా పేరు జటాయువు. నేను, నా జ్యేష్ఠ  సోదరుడు సంపాతి వినతానందనుడగు అరుణుని బిడ్డలము. అరుణుని శ్యేని అని అందురు. మీరు అంగీకరించినచో మీకు సహాయకుడుగా ఇక్కడ ఉండెదను. మీరు ఫల, మూలములకై బయటికి పోయినప్పుడు సీతమ్మను నేను కాపాడదెను. ఇది ఘోరమైన రాక్షసులతోను, వన్య మృగములతోను కూడియుండే ప్రదేశము. దానికి శ్రీరాముడు మిక్కిలి సంతోషించెను. కృతజ్ఞతాపూరకముగా మందహాసముజేసెను.  లక్ష్జ్మణా, మనము నివసించుటకై ఒక పర్ణశాలను నిర్మింపుడు. లక్ష్జ్మణుడు వెంటనే ఒక పర్ణశాలను నిర్మించెను. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతముగా వాస్తుశాంతి గావించి, దేవతలకొరకు ఫలములను బలిగా అర్పించి ఆ పర్ణశాలయందు ప్రవేశించెను.

భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ

త్వయా పుత్రేణ ధర్మాత్మాన సంవృత్తః పితామమ                         15

లక్ష్మణా, నీవు నా మనోభావములను తత్ క్షణమే గ్రహింపగలవాడవును, కృతజ్ఞుడవును, ధర్మజ్ఞుడవును, అయిఉన్నావు. ధర్మాత్ముడగు మనతండ్రి నీలో జీవించియున్నాడు.

పిమ్మట ఒక రోజున స్నానమాచరించుటకు పరమరమణీయమగు గోదావరీ నదీ తీరమునకు శ్రీరామ లక్ష్మణులు వెళ్ళిరి. అప్పుడు లక్ష్మణుడు అగ్రజుడయిన శ్రీరామునితో ఇట్లనెను: దశరథుడంతటి ధర్మాత్ముడు భర్తగాను, ఉత్తమప్రవర్తనగల భరతుడు పుతుడుగాను బడసిన కైకేయి అంత క్రూరముగా ఎట్లుండెను?

పినతల్లి నిందను సహించజాలని శ్రీరాముడు ఇట్లనెను.

న తేమ్సా మధ్యమా తాత గర్హితవ్యా కదాచన

తామేక్ష్వాకు నాథస్య భరతస్య కథాం కురు                              16

సోదరా, లక్ష్మణా, నీవు పినతల్లి కైకేయిని నిందించవలడు. ప్రస్తుతము ఇక్ష్వాకువంశ నాథుడయిన భరతుని క్షేమముగురించే దృష్టి పెట్టు.

సీతా రామ లక్ష్మణులు మువ్వురు స్నాన మాచరించి పర్ణశాలకు తిరిగి వచ్చిరి. అప్పుడు రావణాసురిని సోదరి శూర్పణఖ ఆ కుటీరమునకు దగ్గిరలో నిల్చిండియుండెను. శ్రీరామచంద్రుని ముగ్ధ మనోహర రూపమును గాంచి పరవశంయ్యెను. రాక్షసులు ఉండే ఈ అరణ్యమునకు మీరు యెట్లు వచ్చితిరి అని అడిగెను.

నియోగాత్ తు నరెంద్రస్య పితుర్మాతుశ్చ యంత్రితః

ధర్మార్థం ధర్మకాంక్షీ చ వనం వస్తుమిహాగతః                            17 

“మా తండ్రి దశరథ మహారాజు ఆజ్ఞను బడసి, మరియు మా తల్లి కైకేయి యొక్క కోరికతో మేము ఇక్కడికి వచ్చితిమి. మేము ధర్మపాలన కొరకు, మరియు ధర్మ రక్షణకొరకు ఈ వనమందు నివసించుటకు వచ్చితిమి” అని శ్రీరాముడు చెప్పెను.

ఆ మాటలువిని కామపీడితయైన శూర్పణఖ ఇట్లు అనెను. నేను నా ఇచ్ఛారూపమును ధరించు రాక్షసిని. బలపరాక్రమములయందు నేను నాసోదరులకు ఏమాత్రము తక్కువదాననుగాను. నీ మీద గాఢమయిన కోరిక కలిగినది. నేను నిన్ను భర్తగా పొంద దలచి ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చితిని. ఇట్లుపలికి సీతమ్మ మీదమీదకు వచ్చుచున్న ఆ రాక్షసినిచూచి కుపితుడయ్యి లక్ష్మణునితో ఇట్లనెను. “లక్ష్మణా, కౄరకర్మలుచేయు అనార్యుల యడల ఏమాత్రము కరుణచూపరాదు. నీవు ఈ క్షమించరాని ఈ రాక్షిసిని కరూపిణిగా చేయుము” అనెను. అదివిని అన్న ఆదేశముతో శూర్పణఖ ముక్కు చెవులు కోసి కురూపిణిని చేసెను. అప్పుడు శూర్పణఖ సంతాపముతో తన సోదరుడయిన రావణాసురుని వద్దకు విలపిస్తూ వెళ్ళెను. అతడు క్రోధావేశుడై నీవు ఇట్లు అగుటకు కారణమేమి అని అడిగెను.   

ఫలమూలాశనౌ దాంతౌ తాపసు బ్రహ్మచారిణౌ

పుత్రౌ దశరథస్యాసాం భ్రాతరౌ రామలక్ష్మణౌ                             18

ఈ వనమందు ఇద్దరు రాజకుమారులు తాపస బ్రహ్మచారులుగా అడుగిడిరి. వీరు దశరథమహారాజుయొక్క పుత్రులు. వారిపేర్లు శ్రీరామ లక్ష్మణులు. వారివురు సోదరులు. వారు తపస్వులు, బ్రహ్మచర్యమును అవలంభిస్తున్నారు, ఫల మూలాదులే వారి భోజనము.

వారిరువురి మధ్య అద్భుత సౌందర్యవతి యైన స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ వలెనే వారు నన్ను ముక్కు చెవులు కోసి కురూపిణిని చేసిరి.  అదివిని క్రోధితుడయిన రావణాసురుడు పదునాలుగు మంది బలిష్టమైన రాక్షసులను శూర్పణఖతోబాటు సీత శ్రీ రామ లక్ష్మణు లను వధించుటకై పంపెను.

శ్రీరాముడు వారిని వధించుటకై వెళ్తూ లక్ష్మణుని సీతమ్మకు సహాయకుడుగా ఉంచెను. అంతట శీరామచంద్రుడు వారిని వధించెను. పిమ్మట ఖరుడు అనే రాక్షుడు తన తమ్ముడు, మరియు సేనానియగు దూషణుని తోడను, మరియు పదునాలుగువేలమంది రాక్షసులులను తోడ్కని శ్రీరామచంద్రమూర్తి పై యుద్ధమునకు వెళ్ళెను.

చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం

ఏకశ్చ రామో ధర్మాత్మా కథం యుద్ధం భవిష్యతి                           19

పడునాలుగువేలమంది భీకరకార్యములనోనర్చు భయంకరమైన రాక్షసులు ఒక వైపు, మరియొకవైపు ఒంటరిగా శ్రీరామచంద్రుడు? యుద్ధమెట్లు జరుగును?

ఆ భీకర యుద్ధమున త్రిసురుడు అను రాక్షరుడు శ్రీరామచంద్రుని పై భీకర పోరు సల్పేను. వాడి మూడు శిరస్సులను శ్రాముడు ఖండించివైచెను. ఆ తరువాత శ్రీరాముడు పదమూడు బాణములను ఉపయోగించే ఖరుని వధించెను. నాలుగు బానములచే ఖరుని నాలుగు గుర్రములను వదించెను. ఆరుబానములచే ఖరుని సారథిని చస్మ్పెను. ఖరుడు గదతో శ్రీరాముని వైపు రాసాగెను. అప్పుడు శ్రీరాముడు ఇట్లనెను.

ఉద్వేజనీయో భూతానాం నృశంసః పాపకర్మకృత్

త్రయాణామపి లోకానా మీశ్వరోపి న తిష్ఠతి                                   20

కర్మలోక విరుద్ధం తు కుర్వాణం క్షణదాచర

తీక్ష్ణం సర్వజనోహంతి సర్పం దుష్ట మివాగతం                                21  

సమస్త ప్రాణులను బాధించు వాడును, క్రూరుడును, పాపకర్మలు చేయువాడును, అగువాడు ముల్లోకపాలకుడైనను అధికకాలము నిలువలేడు.

లోకకంటకుడు, సర్వజనులను చంపుకుతినేవాడును, అగువానిని ఎదుటబడినంతనే దుష్టసర్పమును వధించునట్లు ప్రజలు వాడిని వధింతురు.

లోభాత్ పాపాని కుర్వాణః కామాద్ వాయో న బుధ్యతే

హృష్టః పశ్యతి తస్యాంతం బ్రాహ్మణీ కరకాదివ                             22

కామముచేగాని, లోభముచేగాని, ప్రేరితుడై పాపము చేయువాడు, దాని పరిణామము తెలిసికొనుటలేదు. అంతేగాక దానిచే సంతోషము పొందుచున్నాడు. అట్టివాడు తనయొక్క వినాశకరమగు పరిణామమునే పొందును.   

న చిరం పాపకర్మాణః క్రూరా లోకజుగుగుప్సితాః

ఐశ్వర్యం ప్రాప్య తిష్ఠంతి శీర్ణమూలా ఇవద్రుమాః                                     23

చేట్టువేరును పురుగు గుల్లచేసినట్లయితే ఆ చెట్టు క్రమంగా ఎండిపోతుంది. అట్లే లోక కంటకుడయిన దుష్టుడు ఐశ్వర్యం పొందవచ్చు. కాని దానియందు చిరకాలము ప్రతిష్ఠుతు డైయుండడు. 

అవశ్యం లభతే కర్తాఫలం పాపస్య కర్మణః

ఘోరం పర్యాగతే కాలే ద్రుమః పుష్పమివార్థవం                               24

చెట్టుకు ఋతువునుబట్టి ఫలములు వచ్చును. అదేవిధముగా సమయము వచ్చి నప్పుడు పాపకర్మలనొనర్చువాడికి దాని ఫలితము అనుభవించకతప్పదు.

నచిరాత్ ప్రాప్యతే లోకే పాపానాం కర్మణాం ఫలం

స నిషాణామివాన్నానాం భుక్తానా క్షణదాచర                                  25

ఓ నిశాచరా, విషముకలిసిన అన్నము భుజించిన అన్నము తిన్నవాడు త్వరలోనే దాని పరిణామము అనుభవిస్తాడు. అదేవిధముగా పాపకర్మల ఫలితముకూడా తప్పక అనుభవించి తీరును.   

అటుపిమ్మట శ్రీరామచంద్రుడు ప్రళయకాలరుద్రునివలె విజృంభించి బాణము సంధించి ఖరుని నేలగూల్చేను. అదిచూసి, మరియు విని జనులు అమితముగా సంతసించిరి.

తమ్ దృష్ట్వా శతృహన్తారం మహర్షీణాం సుఖావహం

బభూవ హృషా వైదేహీ భర్తారం పరిషస్వజే                                    26

అడిజూసి  శతృహంతకుడు, మహర్షులకు సుఖము కలుగజేయువాడును, శ్రీరామచంద్రుని  పరమానందముతో కౌగిలించుకొనేను.

ఆ సమయములో అకంపనుడు అను రాక్షసుడు వెంటనే లంకా పట్టణమునకు బోయి రావణాసురునితో ఇట్లు చెప్పెను. రాజా, జనస్థానమునందలి రాక్షసులందరూ చనిపోయిరి. అదివిని రావణుడు క్రోధముతో ఇట్లు పలికెను: “నాకు కోపము నష్టము  కలిగించిన ఎవ్వడిని నేను వదలను”.

అదివిని శ్రీరాముని పరాక్రమమునుగూర్చి ఆ అకంపనుడు అనే రాక్షసుడు రావణాసురునితో ఈ విధముగా చెప్పెను.

రామో నామ మహాతేజాః శ్రేష్ఠః సర్వధనుష్మతాం 

దివ్యాస్త్రగుణ సంపన్నః పరం ధర్మం గతోయుధి                                 27

మహారాజ, శ్రీరాముడనే పేరుగల ఈ వ్ఫీరుడు సర్వ ధనుర్ధరులన్దరిలోను అత్యంత శ్రేష్టుడు. మహా తేజస్వీ.  దివ్యాస్త్రగుణ సంపన్నుడు. యుద్ధ ధర్మమందు ఆరితేరినవాడు.

నహి రామో దశగ్రీవ శక్యో జేతుం రణేత్వయా

రక్షసాం వాపి లోకేన స్వరః పాపజనైరివ                                                    28

దశకంఠా, పాపాత్ముడు స్వర్గముపై అధికారము పొందజాలడు. అట్లే నీవుకాని, సమస్త రాక్షసులు కాని శ్రీరాముని జయింప అశక్తులు.

రాజా, నీవు ఏదో ఒక ఉపాయముచే శ్రీరాముని మోసగించి అతని భార్యయైన సీతాదేవిని అపహరించుము. సీతమ్మనుండి వేరైన శ్రీరాముడు జీవించజాలడు. అకంపనుని మాటలువిన్న రావణాసురుడిట్లనెను: రేపు ఉదయము విదేహకుమారిని అపహరించెదను. తదుపరి రావణుడు తాటకాపుత్రుడగు మారీచుని కలిసెను. మారీచుడు రావణుని సాదరముగా ఆహ్వానించెను. రావణునికి భక్ష్యములనొసంగి ఇట్లనెను. శ్రీరాముడు నా రాజ్యముయొక్క ఎల్లలను రక్షించు ఖర దూషణాదులను సంహరించెను. అవధ్యమని తలంచబడు జనస్థానమందలి రాక్షసులందరిని సంహరించెను. కావున దానికి ప్రతీకారము గా నేను శ్రీరాముని భార్యను అపహరించెదను. ఇక్కార్యమున నీవు నాకు సహాయము చేయవలయును. అప్పుడు మారీచుడు ఇట్లనెను.

విశుద్ధ వంశాభిజనాగ్రహస్త తెజోమదః సంసిత దోర్విషాణః

ఉదీక్షితుం రావణనేహయుక్తః స సంయుగే రాఘవ గంధహస్తీ                        29

రావణా, రాఘవేంద్రుడగు శ్రీరాముడు గంధయుక్తమగు గజరాజు. దాని గంధము ఆఘ్రాణించి గజరూపులైన యోధులు దూరముగా పారిపోవుదురు. విశుద్ధ వంశమున జన్మించిన ఆ రాఘవుని అతని యుద్ధస్ధలమున చూచుట ఉచితముకాదు. అటువంటిది ఆయనతో యుద్ధమున తలపడుట అనే మాట తలచుటయా?

అసౌ రణాన్తః స్థితి సందివాలో విదగ్ధ రక్షోమృగహా నృసింహః

సుప్తస్త్వయా బోధయితుం న శక్యః శరాంగపూర్ణో నిశితాపి దంష్ట్రః           30

ఆ శ్రీరామచంద్రుడు ఒక మనుష్యరూప సింహము. ఆ సింహము చతురులగు రాక్షసులు అనే మృగములను వధించునటువంటిది. ఆ సింహరాజు బాణములు అనే అంగములచే పరిపూర్ణమైయున్నది. ఖడ్గములే దాని వాడిఅయిన కోరలు. ఆ నిద్రించు సింహమును లేపజాలవు.

చాపాపహారే  భుజవేగ పఙ్కే శరోర్మిమాలే సుమహాహవౌఘే

న రామ పాతాల ముఖేతి ఘోరే ప్రస్కంధితుం రాక్షసరాజ యుక్తం                31

రాక్షసరాజా, శ్రీరాముడు పాతాళము వరకు వ్యాపించిన ఒక మహాసముద్రము. ఆ మహాసముద్రమునందు నివసించు మొసలియే ఆ ధనుస్సు. భుజముల వేగమే బురద. బాణములే తరంగ సమూహములు. గొప్ప యుద్ధమే అగాధమగు జలరాశి.  దాని మహాభయంకర ముఖమున దూకుట నీకెన్నడును సముచితముగాదు.

మారీచుని మాటలు విన్న రావణుడు తన మందిరమునకు తిరిగి వెళ్ళెను. అదిచూసి  శూర్పణఖ రావణునితో ఈ విధమైన కఠోర వాక్కులు పలికెను.

సక్తం గ్రామ్యేషు భోగేషు కామవృత్తం మహీపతిం

లుబ్ధం బహు మన్యన్తే శ్మశానాగ్ని మివ ప్రజాః                                     32  

రాజు భోగములందు ఆసక్తుడై స్వేఛ్చ గాను లోభిగాను ఉండరాదు. అట్లుప్రవర్తించినచో ప్రజలు వాడిని శ్మాశానమునందలి అగ్ని వలే తలంచి నీచముగా చూతురు. 

శ్రీరాముడు ఎన్నో భయంకరకార్యములను చేయువాడు, చేయగలడు, మరియు చేయును. ఒంటరిగానే పదునాలుగువేలమంది రాక్షసులనుజంపెను. ఋషులకు అభయమొసంగెను.   ఖరదూషణులను జంపెను. దండకారణ్యమునందు పెక్కుమంది రాక్షసులను జంపి శాంతిని స్థాపించెను. జనస్థానమును అతడు నాశము చేసివైచెను.

అప్రమత్తశ్చ యో రాజా సర్వజ్ఞో విజితేన్ద్రియః

కృతజ్ఞో ధర్మశీలశ్చ సరాజా తిష్ఠతే చిరం                                             33

ఏ రాజు ఎల్లప్పుడు జాగరూకుడై యుండునో, ఎవడు సర్వజ్ఞుడో, ఇంద్రియాలనువశమందు ఉంచుకోనునో, కృతజ్ఞుడో, ధర్మపరాయణుడో, అట్టిరాజు చిరకాలము రాజ్యమేలును.

నయనాభ్యాం ప్రసుప్తో వా జాగర్తి నయచక్షుసా

వ్యక్తక్రోధ ప్రసాదశ్చ స రాజా పూజ్యతే  జనైః                                34

ఎవడు నిద్రించినను మేలుకోనియుండునో, ఎవని క్రోధము, అనుగ్రహము, రెండింటి ఫలము ప్రకటిమగుచుండునో, అట్టిరాజును ప్రజలు గౌరవించుదురు.

ఏకా కథం చిన్ముక్తాహం పరిభూయ మహాత్మనా

స్త్రీవధం శఙ్కమానేన రామేణ విదితాత్మనాః                            35

మహాత్ముడగు శ్రీరాముడు స్త్రీ వధ జరగకుండు నిమిత్తము నన్ను కేవలము అవమానము చేసి వదలిపెట్టెను.

భ్రాతా చాస్య మహాతేజా గుణతస్తుల్య విక్రమః

అనురక్తశ్చ భక్తశ్చ  లక్ష్నణో నామ వీర్యవాన్                               36

అమర్షీ దుర్జయో జేతా విక్రాంతో బుద్ధిమాన్ బలీ       

రామస్య దక్షిణో బాహుర్నిత్యం ప్రాణో బహిశ్చరః                            37

అతని తమ్ముడు లక్ష్మణుడు. అతడు మహాతేజస్వి. గుణములోను, మరియు పరా క్రమములోను ఆ లక్ష్మణుడు శ్రీరామ సమానుడు. ఆ పరాక్రమశీలుడు అగ్రజునియందు అసమానమైన ప్రేమ భక్తి వాత్సల్యముగలవాడు. ఆయన మహా బుద్ధిమంతుడు. అతని బుద్ధి తీక్ష్ణమైనది. అతడు దుష్టులపై రౌద్రము వహించును. అతడు దుర్జయుడు, విజయవంతుడు, బలపరాక్రమ సంపన్నుడు. అతడు శ్రీరాముని కుడిచెయ్యి. అంతేకాదు లక్ష్మణుడు శ్రీరాముని ప్రాణము.  

రామస్య తు విశాలాక్షీ పూర్ణేందు సదృశాననా

ధర్మపత్నీ ప్రియా నిత్యం భర్తుః ప్రియహితే రతా                           38

శ్రీరాముని శ్రీరాముని నిత్యమూ  వెన్నంటి వుండే సీతమ్మ ఆయన ధర్మపత్ని సీతమ్మ. ఆమె శ్రీరామునికి అత్యంత ప్రియమైనది. ఆమె తన భర్తకు అత్యంత హితము, ప్రియము చేయుటయందు నిత్యతత్పరయైయుండును. ఆమె విశాలనేత్రములు, పూర్ణచంద్రునిలాంటి ఆమె ముఖము ఆమెను అత్యంత మనోహరముగా చేయును.

నైవ దేవీ న గంధర్వీ న యక్షీ న చ న కిం నరీ

తథా రూపా మయా నారీ దృష్ట పూర్వా మహీతలే                     39

దేవతలలోను, గంధర్వులలోను, కిన్నెరులలోను, అంతటి అత్యంత అద్భుత సౌందర్య స్త్రీని  గాంచము. ఈ భూమిమీద అంతటి సౌందర్య స్త్రీని నేను చూడలేదు.

“అట్టి సీతాదేవిని భార్యగా పొందుము” అని శూర్పణఖ పలికెను.  అత్తరి రావణుడు సముద్రము అవతల ఉన్న ఒక పవిత్ర ఆశ్రమమును దర్శించెను. అక్కడ మారీచుడు అను రాక్షసుడు నివసించుచుండెను. నా చెల్లెలు శూర్పణఖను అవమాన పరచి పంపించిన దానికి ప్రతిగా శ్రీరాముని భార్య సీతాదేవిని అపహరించి తీసుకురాదల్చాను. దానికి నీ సహాయము కోరి వచ్చాను. నీవు తెల్లని మచ్చలు ఉన్న బంగారు లేడి రూపమును ధరించి రాముని ఆశ్రమము సమీపములో సంచరించుము.  సీత కోరికపై ఆ బంగారు లేడి పొందు ఉద్దేశ్యముతో ముందుగా రాముడు ఆ లేడి వెంటబడి వెళ్ళును. నీకు సహాయము చెయ్యమని సీతమ్మ లక్ష్మణుని నీ వెనకాల పంపును.  అప్పుడు నేను సీతను అపహరించుకొని పోయెదను. రాముడు సీతా వియోగాముతొ దుర్బలుడగును. అది విని మారీచుడే రావణునితో ఇట్లు పలికెను.

సులభః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః

అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః                                 40

రాజా, ఎప్పుడూ ప్రియవాక్యములను చెప్పువారు, సర్వత్ర సులభముగా దొరుకుదురు. కాని అప్రియము  అయినాను హితకరమైన వాక్యములను చెప్పువారు, వినేవారు, ఇద్దరు దొరుకుట దుర్లభము.

త్వద్విధః కామవృత్తోహి దుఃశీలః పాపమంత్రితః

ఆత్మానం స్వజనం రాష్ట్రం స రాజా హంతి దుర్మతిః                     41

ఓ రాజా, ఎవడు నీ వలే దుఃశీలఃడును, మనస్సుకి తగినట్లు సంచరించువాడును, పాపపూర్ణమగు విచారము గలవాడును, దుర్మతిగలవాడును అయియుండునో, అట్టి రాజు తనయొక్కయు, రాష్ట్రమంతటి యొక్కయు, వినాశకారి అగును.

న చ ధర్మగుణైః హీనః కౌసల్యానందవర్ధనః

న చ తీక్ష్ణోహి భూతానాం సర్వభూత హితేరతః                                  42

కౌసల్యానందనుడైన శ్రీరాముడు ఆనందమును పెంపొందించువాడు. ధర్మ సంబంధములైన గుణములులేనివాడుకాడు. వాడు ఏ ప్రాణికి హానిచేకూర్చడు. వారు సమస్త ప్రాణుల హితముకోరువారు.

న రామః కర్కశస్తాత నావిద్వాన్ నా జితేంద్రియః

అనృతం న శృతం చైవనైవ త్వం వక్తుం అర్హసి                                43

శ్రీరాముడు కౄర స్వభావము లేనివాడు, వారు విద్వాంసులు, జితేంద్రియులు, వారు సదా సత్యవంతులు, వారిగురించి తప్పుడు మాటలు ఎన్నడును చెప్పరాదు.

రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః

రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః                                        44

శ్రీరామచంద్రమూర్తి మూర్తీభవించిన ధర్మస్వరూపులు. సాధుస్వరూపులు.   సత్యపరాక్రమవంతులు. ఇంద్రుడు దేవతలందరికి అధిపతి. అట్లాగే శ్రీరాముడు లోకమునంతటకు అధిపతి. ఇక్కడ ఇంద్రుడు అనగా శుద్ధ మనస్సు.

శరార్చిషమనాధృశ్యం చాపఖడ్గేన్ధనం రణే 

రామాగ్నిం సహసా దీప్తం న ప్రవేష్టుం త్వం అర్హసి                          45

శ్రీరాముడు ప్రజ్వలించు అగ్ని. బాణమే ఆ అగ్నియొక్క జ్వాల. ధనుస్సు మరియు ఖడ్గము దాని ఇంధనము. నీవు యుద్ధములో త్వరపడి దానియందు ప్రవేశించకూడదు.

అకుర్వంతోపి పాపాని శుచయః పాపసంశ్రయాత్

సరసా పైర్వినశ్యంతి మత్స్యా నాగ్రహదే యథా                                    46

ఆచార వ్యవహారములయందు శుద్దులైనవారు, పాపము గాని అపరాథముగాని చేయని వారు, పాపుల సంపర్కముచేసినట్టివారు, సర్పములు ఉన్న సరోవరమునందు నివసించు చేపలు ఆ సర్పములచే చంపబడును. అట్లే ఇతరుల పాపముచే నశించిపోదురు.   

పరదారాభిమర్శాత్ తు నాన్యత్ పాపతరం మహాత్

ప్రమదానాం సహస్రాణి తవ రాజన్ పరిగ్రహే                          47

రాజా, పరస్త్రీ సంపర్గము కంటే మించినట్టి ఇంకొక గొప్ప పాపము ఏదీ ఉండదు.  నీ అంతః పురమందు ఉన్న వేలకొలది స్త్రీలలో ఒకరిని గ్రహించు.

అపిరామ సహస్రాణి భీతః పశ్యామి రావణ

రామభూతమిదం సర్వమరణ్యం ప్రతిభాతి మే                       48

రావణా, నేను భయంతో వేలకొలది నాఎదుట ఉన్నట్లుగా చూచుచున్నాను. ఈ అరణ్యమంతా రామమయంగా నాకు అగుపడుచున్నది.

రామమేవహి పశ్యామి రహితే రాక్షసేస్వరా

దృష్ట్వా స్వప్నగతం రామముద్ భ్రమామి విచేతనః                    49

రాక్షసేస్వరా, నేను ఏకాంతముగా కూర్చొని యున్నప్పుడు శ్రీరామదర్శనమే కలుగుతూ ఉంటుంది. స్వప్నములో శ్రీరాముని చూచిన భ్రమే కలుగుచుండును.

రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ

రత్నానిచ రథాశ్చైవ నిత్రాసం జనయంతి మే                          50

రావణా, నేను రామునిచే యెంత భయపడుతున్నాననగా ‘ర’ కారముతో ప్రారంభమయే పేరు అంటేనే భయపడుచున్నాను. రత్నములు, రథములు లాంటి పదములు నా చెవిని సోకాగానే మహాభయము కలుగుచున్నది.

అహం తస్య ప్రభావజ్ఞో న యుద్ధం తేన తే క్షమం

బలిం వా నముచిం వాపి హన్యాద్ధి రఘునందనః                         51

నేను వారి ప్రభావమును చక్కగా ఎరిగియున్నాను. అందువలన నువ్వు యౌద్ధముచెయుత సమంజసం జాడు. శ్రీరాముడు బలిచాక్రవర్తినిగాని, నముచినిగాని చంపగలదు.

నేను నీకు బంధువును. నీ హితముకొరకై చెప్తున్నాను. వినకపోతే శ్ీరాముని చేతిలో నేడే చత్తువు అని చెప్పెను.

మారీచస్య తు తద్ వాక్యం క్షయం యుక్తం చ రావణః

ఉక్తో న ప్రతిజగ్రాహ మర్తుకామ ఇవౌషధం                                      52

మారీచుని హితవాక్యములు యుక్తముగా ఉన్నవి. అంగీకార యోగ్యములు.  అయినను చావదలచినవాడు ఔషధం తీసికోడు. అందువలన అవి రావణుని చెవికి ఎక్కలేదు.

కాలముచే ప్రేరేపితుడయిన రావణాసురుడు హితమైన మాటలు చెప్పు మారీచుని మాటలు రుచించలేదు. దానికి ప్రతిగా రావణుడు ఇట్లనెను: “ఈ కార్యమున నాకు సహాయము చేయుము.”

నో చేత్ కరోషి మారీచ హన్మి త్వామహ మద్యవై

ఏతత్ కార్యమవశ్యం మే బలాదపి కరిష్యసి

రాజ్ఞో విప్రతి కూలస్థో న జాతు సుఖమేధతే                                           53

మారీచా, నువ్వు నా వాక్యములను తిరస్కరించినచో, నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపివేసేదను. నా పనిని నీవు తప్పక చేయవలయును. నేను బలవంతముగా అయినాను నీచేత ఈ పని తప్పక చేయించెదను. రాజుకు ప్రతికూలముగా చేయువాడు సుఖపడడు.

అదివిని మారీచుడు ఆ రాక్షసరాజు రావణునితో ఇట్లు కఠోరముగా పలికెను.

అమాత్యైః కామవృత్తోహి రాజా కా పథమాశ్రితః

నిగ్రాహ్యః సర్వథా సద్భిః స నిగ్రహ్యో న గృహ్యసే                            54

రాజు స్వేచ్చ్చ్గా గా చెడుమార్గమున పోవునపుడు ఆ రాజుకి సర్వవిధముల హితముజెప్పి నిలవరించవలయును.  కాని ఆ మంత్రులు నిన్ను నిలవరించలేదు.  

మాం నిహత్య తు రామో సావచిరాత్ త్వాం వధిష్యతి

అనేన కృతకృత్యోస్మి మ్రియే చాప్యరిణా హతః                         55

శ్రీరాముడు నన్ను చంపి నిన్ను కూడా అచిరకాలములోనే నిన్ను చంపగలడు. నాకు రెండు విధముల చావు తప్పదు. శ్రీరాముని చేతిలో చావటము వలన కృతకృత్యుడ్ని కాగలను. శ్రీరామునిచే చంపబడుట నాకు ఉత్తమము.

నివార్యమాణస్తు మయా హితైషిణా న మృష్యసే వాక్యమిదం నిశాచర

పరేతకల్పాహి గతా యుషోనరా హితం న గృహ్ణంతి సుహృద్ భిరీరితం    56

నిశాచరా, నేను నీ హితోభిలాషిని. కావున పాపకార్యమునుండి నిరోధించుచున్నాను. కాని నా మాట నీకు నచ్చ లేదు. ఎవడి ఆయువు మూడునో వాడు హితవాక్యములను గ్రహించడు. ఇది నిజము.

అంతట రావణుడు, మారీచుడు ఇరువురును దండకారణ్యమున ప్రవేశించి శ్రీరామచంద్రుని ఆశ్రమమును చూచిరి. మారీచుడు లేడి రూపములో శ్రీరాముని ఆశ్రమము సమీపములో సంచరించుచుండెను. సీతమ్మ పుష్పములు కోసుకుంటూ వారివైపి వచ్చుచుండెను. సీతమ్మ ఆ బంగారులేడిని గాంచెను. అట్టి మృగమును సీతమ్మ ఇంతకు ముందు ఎన్నడు చూడలేదు. సీతమ్మ రామలక్ష్మణులను పిలిచి ఆ మృగమును చూపించెను.

శంఙ్కమానస్తు తమ్ దృష్ట్వా లక్ష్మణో వాక్యమబ్రవీత్

తమేవైనమహం మన్యే మారీచం రాక్షసం మృగం                   57

దానిని చూడగానే లక్ష్మణుని మనస్సులో సందేహము కలిగెను. అగ్రజా, ఈ మృ గారూపమున ఆ మారీచేదే వచ్చ్జియున్నాడని సందేహము.

ఏవం బ్రువాణం కాకుత్థ్సం ప్రతివార్య శుచిష్మితా

ఉవాచ సీతా సంహృష్టా ఛద్మనా హృత చేతనా                         58

మారీచుని మోసముచే విచారణా శక్తి హరించివేయబడినట్టి పవిత్ర మందహాసముతోకూడిన సీత లక్ష్మణుని స్వయముగానే ఆనందముతో శ్రీరామునితో ఇట్లు పలికెను.  

ఆర్యపుత్రాభి రామోసౌ మృగో హరతి మే మనః

ఆనయైనం మహాబాహో క్రీడార్థం నో భవిష్యతి                            59

ఆర్యపుత్రా, ఈ లేడి చాలా అందముగాఉన్నది. ఇది నా మనస్సును చూరగొన్నది. మహాబాహో, మనము ఆడుకొనే నిమిత్తము దానిని తీసొకొని రమ్ము.

భరతస్యార్య పుత్రస్య శ్వశ్రూణాం  మమ చ ప్రభో

మృగరూపమిదం దివ్యం విస్మయం జనయిష్యతి                       60

ప్రభూ, ఈ మృగముయొక్క దివ్యస్వరూపము భరతునకు,మీకు, నా అత్తలకు, అందరికి  ఆశ్చర్యపరచగలదు.

అదివిని, లక్ష్మణా, ఇది మారీచుడే. ఇది రాక్షస మాయయే. అయినప్పటికీ దీనిని తప్పనిసరిగా వధించుదును అని శ్రీరాముడు పలికెను.

ఏతేన నృశంసేన మారీచేనా కృతాత్మనా

వనే విచారితా పూర్వం హింసితా మునిపుంగవాః                                61

ఎందుకంటె అపవిత్ర చిత్తుడును, కౄరకర్మలుచేయువాడును, అగు ఈ మారీచుడు అరణ్యమునండు సంచారము చేయునప్పుడు అనేకమంది శ్రేష్ఠులగు మునులను చంపివేసెను.  

లక్ష్మణా, అస్త్రశస్త్రములు ధరించి సీతమ్మను కాపాడుతుండుము. అగస్త్యునిచే వాతాపి హతమైనట్లు ఇప్పుడు ఈ మారీచుడు నా చేతిలో హతమగును. పిమ్మట ఆ లేడి దూరముగానున్న చెట్లనుండి బయటకి వచ్చెను. మహా పరాక్రమవంతుడయిన శ్రీరాముడు ఆ లేడిని చంప నిశ్చయించెను.  తీవ్రమైన అస్త్రశాస్త్రములతో ఆ లేడిని హతమార్చెను. మారీచుడు భూమిపైబడి గర్జించుచూ ప్రాణము వదలెను. రావణుడు చెప్పిన ఉపాయమునకు అనుకూలముగా హా సీతా, హా లక్ష్నణా, అంటూ శ్రీరాముని గొంతును అనుసరిస్తూ ప్రాణము వదిలెను. ఆ ఆర్తనాదము తన ప్రాణేశ్వరుడు శ్రీరామచంద్రునిగా తలంచి, సీతమ్మను లక్ష్మణుని వెంటనే శ్రీరాముని సమాచారము తెలుసుకొని రమ్మనెను. శ్రేరాముని రక్షించమనెను. లక్ష్మణుడు అది రాముని గొంతు కాదు అని మెల్లకుండెను.

అబ్రవీత్ లక్ష్మణః త్రస్త్రాం సీతం మృగవధూం ఇవ

పన్నగాసుర గంధర్వదేవ దానవ రాక్షసైః

ఆశక్యస్తవ వైదేహి భర్తా జేతుం న సంశయః                                   62

అప్పుడు భయపడిన లేడి వలె భీతిల్లిన సీతమ్మతో లక్ష్మణుడు ఇట్లనెను. అమ్మా, వైదేహీ, మీరు నన్ను విశ్వ్వసిన్చుడు. నాగులుగాని, గంధర్వులుగాని, దేవతలుగాని, దానవులుగాని, రాక్షసులుగాని, వీరందరూ కలిసిఉగాని మీ భర్తను ఓడించలేరు. ఇందులో ఏ మాత్రము సందేహము లేదు.

దానవేషు చ ఘోరేషు న స విద్యేత శోభనే

యోరామ ప్రతియుధ్యేత సమరేవాసవోపమం

అపథ్యః సమరే రామో నైవం త్వాం వక్తుం అర్హసి                                   63

భయంకరమైన దానవులయందు శ్రీరాముని యుద్దమందు ఎడుర్కొనేవారు లేనేలేరు. శ్రీరాముడు ఇంద్రునికంటే పరాక్రమవంతుడు. యుద్దమందు శ్రీరాముడు చంపబడుట అసంభవం. కనుక మీరిట్టివాక్యములను చెప్పుట తగదు.

అమ్మా వైదేహీ, మీ రక్షణా భారమును శ్రీరామచంద్రుడు నాకు అప్పజెప్పెను. కావున మిమ్ములను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళజాలను. లక్ష్మణుని మాటలువిని క్రోధపూరిత అయిన సీతమ్మ ఇట్లనెను. లక్ష్మణా, మీ అగ్రజుడు గొప్ప విపత్తునందు చిక్కుకున్నాడు.  అది మీకు ఇష్టముగా తోచుచున్నట్లుగా నాకు అనిపిస్తున్నది. సీతమ్మ మాటలు జితేంద్రియుడయిన లక్ష్మణునికి జుగుప్సకలిగించెను. గగుర్పాటు కలిగించెను. అమ్మా, నేను ప్రత్యుత్తరమీయజాలను. మీరు నాకు ఆరాధనీయులు. మంచిది నేను ఇప్పుడు శ్రీరాముడు ఉన్నచోటుకి వెళ్తునాను. మీకు శుభమగుగాక. అప్పుడు రావణాసురునికి అవకాశము లభించినది. అతడు సన్యాసి వేషము ధరించెను. అతనిని చూచిన సీతమ్మ తగు అతిథి సత్కారములు చేసెను. అప్పుడు సీతమ్మ మీరు ఎవరు స్వామీ అని అడిగెను. సీతా, ఎవరి పేరు వినంగానే ముల్లోకములు హడాలిపోవునో, అట్టి రాక్షస రాజగు రావణాసురుడ్ని నేనే. దేవీ, నీవు నాకు భార్యవు కమ్ము. అయిదువేలమంది దాస దాసీ జనులు సదా నీ సేవలో నిమగ్నులయి ఉందురు. దానికి క్రోధిత అయిన సీతమ్మ ఇట్లు పలికెను.

మహాగిరిమివాకంప్యం మహేంద్ర సదృశం ప్రం

మహాదధి మివాక్షోభ్యమహం రామమనువ్రతా                                      64

నా పతిదేవుడు శ్రీరాముడు. ఆయన గొప్ప పర్వతములాంటివాడు. అచలుడు. మహేంద్రుని వంటి పరాక్రమశీలుడు. ఆయన మహాసాగరము వంటి ప్రశాంతచిత్తుడు. వారిని ఎవరును సంక్షోభమొనర్పజాలరు. వారిని మనసా, వాచా, కర్మణా అనుసరించుదానను. వారి యందే అనురాగము గలదానను.

త్వం పునరంబుకః సింహీం మామిహేచ్ఛసి దుర్లభాం

నాహం శక్యాత్వయా స్స్రష్టుమాదిత్యస్య ప్రభాయథా                               65

పాపి, నిశాచరా, నీవో నక్కవు, నేను ఆడ సింహాన్ని అనగా సివంగిని. నేను సర్వవిథముల దుర్లభమైయున్నాను. సూర్యుని ప్రభపై ఎవ్వరు చేయివేయజాలరు. అట్లే నీవు నన్ను తాకలేవు.  

యదంతరం సింహసృగాల యోర్వనే యదంతరం స్యన్దనికా సముద్రయోః

సురాగ్ర్య సౌవీరక యోర్యదంతరం తదన్తరం దాశరథే స్తవైవచ             66

వనములోని నక్కకు-సింహమునకు, సముద్రమునకు-పిల్లకాలువకు, అమృతము- అంబళికి ఎంత వ్యత్యాసము గలదో, శ్రీరామునకు నీకు అంత వ్యత్యాసమున్నది.  

యదంతరం కాఞ్చన సీస లోహయోః యదంతరం చందన వారి పఙ్కయోః 

యద రం హస్తి బిడాలయోర్వనే తదన్తరం దాశరథేస్తవైవచ                67

సువర్ణమునకు ఇనుమునకు, చందన జలమునకు బురదనీళ్ళకును, ఏనుగునకు పిల్లికి, ఎంత తేడా కలదో, అంత తేడా నీకును శ్రీరామునికి గలదు.    

యదంతరం వాయస వైనతేయ యోర్యదంతరం మద్గుమయూర యోరపి

యదంతరం హంసకగృధ్ర యోర్వనే తదన్తరం దాశారథే స్తవైవచ                 68  

గరుడపక్షికి కాకికి, నెమలికి నీటికాకికి, హంసకు గ్రద్దకు, యెంత తేడా కలదో నీకును శ్రీరామునకు అంతతేడా ఉన్నది.

అదివిన్న రావణుడు ఇట్లనెను. సీతా, నీవు పిచ్చి దానిలాగా ఉన్నావు. నా మాటలు నీ చెవికి ఎక్కుటలేదు.

ఉద్వాహేయం భుజాభ్యాం తు మేదినీమంబరే స్థితః

ఆపిబేయం సముద్రం చ మృత్యుం హన్యాం రణే స్థితః                         69

నేను ఆకాశమందు నిలబడి ఈ రెండు చేతులతో భూమినంతను లేపి తీసికేళ్ళగలను. సముద్రమును నోటితో త్రాగగలను. యుద్ధములో మృత్యువును చంపగలను.

అప్పుడు ఆ సన్యాసి వేషమును వదలివేసెను. పదితలలు, ఇరువది చేతులతో ప్రత్యక్షమయ్యెను. రాక్షసరాజగు రావణాసురుడు సీతను హరించకొని ఆకాశమార్గమున పోవుచుండెను. సీతమ్మ మనస్సు పరిభ్రమించుచుండెను.. పిచ్చిదానివలె బిగ్గరగా రోదించుచుండెను. ఒక చెట్టుపైనున్న గృధ్రరాజగు జటాయువును చూచెను. దాని శరీరము పర్వత శిఖరమువలె చాలా ఎత్తైనది. జటాయువు ముక్కు చాలా తీక్ష్ణమైనది. జటాయువు రావణుడితో ఇట్లనెను.  

దశగ్రీవస్థితో ధర్మే పురాణే సత్యసంశ్రయః

భ్రాతస్త్వం నిన్దితం కర్మకర్తుం నార్హసి సాంప్రతం

జటాయుర్నామ నామ్నాహం గృధ్రజో మహాబలః                        70

సోదరా, నేను ధర్మముయందు ప్రతిష్ఠితమైయున్నవాడను. ధర్మనిష్ఠాగరిష్ఠుడను. మహా బలవంతుడను అయిన గృధ్రరాజును. నా పేరు జటాయువు. నా ఎదుట నీవు ఈ అధర్మకార్యమును చేయుటకు తగవు.

న తత్ సమాచరేత్ ధీరో యత్ పరేస్య నిగర్హ యేత్

యథాత్మనస్తథా న్యేషాం దారా రక్ష్యా విమర్శనాత్                       71

ధీరుడు ఇతరులు నిందించు పనిని చేయరాదు. పరపురుషుని స్పర్శనుండి తనభార్యను రక్షించునట్లు బుద్ధిమంతుడు ఇతర స్త్రీలను కూడా రక్షించవలయును.

శ్రీరాముడు నీకుగాని, నీరాజ్యమునకుగాని ఎటువంటి హాని చేయనప్పుడు నీవు అతనికి అపరాథము యెట్లు చేయగలవు? సీతమ్మను వదిలిపెట్టుము. లేనియడల శ్రీరాముడు నిన్ను ఇంద్రుని వజ్రాయుధము వృత్రాసురుని ఇంద్రుడు వధించునట్లు వధించగలడు. శ్రీరాముని తీక్ష్ణదృష్టి నిన్ను భస్మమొనర్చగలడు.

స భారః సౌమ్య భర్తవ్యో యో వరం నావసాదయేత్

తదన్నమపి భోక్తవ్యం జీర్యతే యదనామయం                        72

రావణా, మనుజుడు తనను అణగద్రొక్కే బరువు మాత్రమె మోయవలయును. జీర్ణము చేసికోగలిగినత ఆహారము తీసికొనవలయును. లేనియడల ఆ ఆహారము రోగకారకము అవుతుంది.

యత్ కృత్వా న భవేద్ ధర్మో నకీర్తిః న యశో ధృవం

శరీరస్య భవేత్ ఖేదః కస్తత్ కర్మ సమాచరేత్                    73  

ఏ పనులు చేసిన ధర్మము నిలబడదో, కీర్తి పెరగదో, యశస్సు సంప్రాప్తించదో, శరీరమునకు దుఃఖముకలుగునో, అట్టికార్యములను అనుష్టించకూడదు.

రావణా, నీవు నాతొ యుద్ధము చేయుము. పూర్వము ఖరుడి మాదిరి నీవును నాతొ జచ్చెదవు. అప్పుడు జటాయువు మరియు రావణుడి మధ్య భయంకరమైన యుద్ధము జరిగెను. రథము విరుగుటచే రావణుడు క్రిందబడెను. అంతటా ఖడ్గముతో జటాయువు రెండు రెక్కలు, రెండు కాళ్ళను నరికివేసెను. 

స తు తాం రామరామేతి రుదతీం లక్ష్మణేతిచ

జగామాదాయ చాకాశం రావణో రాక్షసేశ్వరః                                74

అదిచూచి రామా, రామా, మరియు లక్మణా అని సీతమ్మ ఏడవదొడంగెను. రావణుడు అట్టి స్థితిలో సీతమ్మను తీసుకొని ఆకాశమార్గమున పోయెను.

రావణుడు సీతను హరించుకొని ఆకాశమార్గమున పోవుచుండెను. ఆమెకు దిక్కుతోచలేదు. మార్గమధ్యమమున అయిదుగురు శ్రేష్టులైన వానరులు ఒక పర్వత శిఖరముమీద కూర్చొని కనబడిరి. వీరు శ్రీరామునికి సమాచారము అందించగలరని తలచి తన బంగారు నగలను, కొంత వస్త్రమును క్రింద మూటగట్టి క్రిందబడవేసెను. రావణుడు పంపాసరోవరమును దాటి లంకాపట్టణమువైపునకు సాగిపోయెను.

అటుపిమ్మట శోకించుచున్న సీతమ్మతో రావణుడు లంకా పట్టణము చేరెను. సీతమ్మను తన అంతఃపురమందు ఉంచెను. రావణుడు ఇట్లనెను: దేవి, నన్ను స్వీకరించుము. నేనే నీకు తగిన భర్తను.

సా తథోక్తా తు వైదేహి నిర్భయా శోకకర్శితా

తృణుమంతరతః కృత్వా రావణం ప్రత్యభాషత                               75

రావణుడు ఇట్లు పలుకగా శోక తప్తయైన సీతమ్మ మధ్యలో ఒక గడ్డిపరకను అడ్డుగా పెట్టుకొని రావణునితో నిర్భయముగా ఇట్లు పలికెను.

న హి  పాపమిదం కర్మ సుఖోదర్కం భవిష్యతి

యాహం నీతా వినాభావం పతి పార్శ్వాత్ త్వయాబలాత్                  76

రావణా, నీవు నన్ను నా పతినుండి వేరుచేసిన పాపము ఊరికినేబోదు. ఇది నీకు భవిష్యత్ లో తప్పక హానికారి గలదు.

స హి దేవర సంయుక్తో మమ భర్తా మహాద్యుతిః

నిర్భయో వీర్యమాశ్రిత్య శూన్యే వసతి దండకే                        77

నా భర్త మహాతేజస్వి. అతడు నా మరిదితో సహా పరాక్రమమునాశ్రయించి నిర్మానుష్యమైన దండకారణ్యమున నిర్భయముగా నివసించుచున్నాడు.  

యదా వినాశో భూతానాం దృశ్యతే కాలచోదితః

తదాకార్యే ప్రమాద్యంతి నరాః కాలవశం గతాః                    78   

కాలమహిమవలన జీవులకు వినాశము సంభవించును. అప్పడు మృత్యువుకు వశ మయిన జీవులు ఇటువంటి దుష్కార్యములను చేయుచుందురు.

క్రీడంతీ రాజహంసేన పద్మషండేషు నిత్యశః

హంసీ సా తృణమధ్యస్తం కథం ద్రక్ష్యేత మద్గుకం                      79

ఎప్పుడున్ను పద్మములయండు రాజహంసలతో క్రీడించు హంసి, తృణములయందు నివసించు జలకాకము వైపు దృష్టిని మరల్చదు.

స తు శాక్యమపక్రోశం పృథివ్యాం దాతుమాత్మనః

ఏవం ఉక్త్వా తు వైదేహి క్రోధాత్ సుపరుషం వచః

రావణ జానకీ తత్ర పునర్నోవాచ కించన                              80  

నీను ఈ భూమి మీద నాకు నిందగాని, కళంకము గాని కలుగజేయు ఏ కార్యమును చేయను. ఈ విధముగా అత్యంత క్రోధముగా రావణునితో పలికి సీతమ్మ మిన్నకుండెను.  ఆమె ఇంకేమి పలుకలేదు.

అదివిని రావణాసురుడు ఆమెతో ఇట్లనెను. జానకి, నీకు నేను పన్నెండు నెలల గడువు ఇస్తున్నాను. ఈ సమయములోపల నా వద్దకు స్వయముగా రానిచో నీ శరీరమును ముక్కలు ముక్కలుగా కోసివైచెదను. ఫలహారము చేసెదను. కుపితుడైన రావణుడు రాక్షస స్త్రీలను సీతమ్మ మనస్సును మార్చుటకు నియోగించెను. సీతమ్మను అశోకవనమునకు తీసికెళ్ళమని చెప్పెను. సీతమ్మను అన్నివిధముల రక్షించుచుండమని కాపలా పెట్టెను. తదుపరి ఇంద్రుడు సీతమ్మతో ఇట్లనెను. అమ్మ, ఈ హవిష్యాన్నమును గైకొనుము. నీకు ఆకలిదప్పులు ఉండవు అని చెప్పెను. ఆవిడ అది భుజియించి మిన్నకుండెను.

అక్కడ మారీచుని వధియించి తిరిగి వెళ్తున్న శ్రీరామునకు మార్గ మధ్యమంలో లక్ష్మణుడు తారసబడెను. అడిచూచి మొదట కఠోరముగాను, తదుపరి మృదువుగాను ఇట్లు పలికెను. లక్ష్మణా, నీవు ఎందులకు వచ్చితివి? జానకి కులాసాయేనా అని అడిగెను.

ఏవముక్తస్తు సౌమిత్రిః లక్ష్మణః శుభ లక్షణః

భూయో దుఃఖ సమావిష్టో దుఃఖితం రామం అబ్రవీత్                           81  

శ్రీరాముడు ఇట్లా ప్రశ్నించంగానే లక్షణయుక్తుడగు లక్ష్మణుడు పరమదుఃఖము చెందెను. దుఃఖమునొందిన లక్ష్మణుడు శోకగ్రస్తుడగు శ్రీరామునితో ఇట్లు పలికెను.

మీ స్వరమును అనుసరిస్తూ,  ‘హా, లక్ష్మణా, నన్ను రక్షింపుము,  తత్తదుపరి హా సీతా అను ఆర్తనాదముతోను మారీచుడు చచ్చెను. భయవిహ్వలయైన సీతమ్మను మిమ్మలకు సహాయము చేయమని నన్ను పంపెను. వెళ్ళుము, వెళ్ళుము అని నన్ను పంపెను.

నేను వదినగారికి విశ్వాసము కలుగ చేయుటకు ఇట్లు చెప్పితిని.

ఆలం విక్లవతాం గంతుం స్వస్తా భవ నిరుత్సుకా

న చాస్తి త్రిషు లోకేషు పుమాన్ యో రాఘవం రాణే                                  82 

జాతోవా జాయమానో వా సంయుగే యః పరాజయేత్

అజేయో రాఘవో యుద్ధే దేవైః శుక్రపురొగమైః                               83

మీరు వ్యాకులపడకుడు. స్వస్థత కలిగియుండుము. చింతను వదిలివేయుము. ముల్లోకములయందు శ్రీరాముడ్ని జయించగలవాడు ఇంతకుముందర పుట్టలేదు. ఇహముందర పుట్టడు. ఇంద్రాదిదేవతలు కూడా ఆయనకు సాటిరారు.

 లక్ష్మణుడు ఇట్లనెను: “నేను ఇంతచెప్పినాను, మోహముచే కప్పబడిన సీతమ్మ కన్నీరు  కారుస్తూ అత్యంత కఠోరమైన మాటలతో నన్ను దుర్భాషలాడినది. మీరు స్వార్థముతో శ్రీరాముని వెంటవచ్చినట్లున్నది. ఎందుకంటె మీ అగ్రజుడు అంతటి కేకలు పెడుతుంటే మిన్నకున్నావు. సీతమ్మ ఇట్లుచెప్పగా రోషముతో నేను విధిలేక ఆశ్రమమును వదిలి వచ్చితిని. ఆమెను వంటరిగా వదిలి వచ్చాను”. లక్ష్మణా, నీవు చాలా పెద్ద పొరపాటు చేశావు, తప్పుచేశావు. వెంటనే శ్రీరాముడు ఆత్రుతతో ఆశ్రమానికి హుటాహుటిన చేరెను. సీతమ్మ ఆ ఆశ్రమములో లేదు. అప్పుడు లక్ష్మణుడు శ్రీరామునితో ఇట్లు పలికెను.

శోకం నిసృజ్యాచ్య ధృతిం భజస్వ సోత్సాహతా చాస్తు విమార్గణేస్యాః

ఉత్సాహవంతో హి నరా న లోకే సీదన్తి కర్మస్వతి దుష్కరేషు         84

ఆర్యా, మీరు శోకమును వదలండి. ధైర్యముతో ఉండండి. సీతమ్మను వెతుకుటకు మనంబున ఉత్సాహము కలియుండుము. ఎందుకంటె ధీరులు మహాదుష్కరమగు కార్యము వచ్చి మీదపడినను దుఃఖవంతులు కాజాలరు.

అగ్రజా, మనము సీతమ్మను వెతుకుటకు నైఋతి దిక్కువైపుకు వెళ్తాము. అట్లు వెళ్లి స్వీతమ్మను గురించి మంచి సమాచారము లభించును. తదుపరి శ్రీరాముని పాదములు ఒత్తుచు లక్ష్మణుడు ఈ ప్రకారముగా పలికెను.

ఆశ్వసిహి నరశ్రేష్ఠ ప్రాణినః కస్య నా పదః

సంస్పృశస్త్య గ్నివద్ రాజన్ క్షణేన వ్యవయాంతి చ               85

నరశ్రేష్ఠా, మీరు ధైర్యము వహింపుడు. రాజా, ఆపత్తులు అగ్నివలె క్షణకాలము సంభవించి మరల క్షణకాలములో అదృశ్యములై పోవును.

లోకస్వభావ యేవైష యయాతి ర్నహూషాత్మజః

గతః శక్రేణ సాలోక్య మనయస్తం సమస్పృశత్                           86

ఈ ప్రపంచములో అందరికి దుఃఖము, శోకము వచ్చును. అది పోవును. యయాతి నహుషుడి పుత్రుడు. అతడు ఇంద్రలోకమును పొందినను అక్కడ కూడా దుఃఖము అతనిని స్పర్శించును. 

మహర్షిః యో వశిష్ఠస్తు యః పితుర్నః పురోహితః

ఆహ్నా పుత్రశతం జంఘే తథైవాస్య పునర్హతం                           87

వశిష్ట మహర్షి మన తండ్రికి పురోహితుడు. ఆయనకు ఒకే దినమున నూరుగురు పుత్రులు కలిగిరి. వారందరూ ఒకేదినమున చంపబడిరి.

యా చేయం జగతో మాతా సర్వలోక నమస్కృతా

అస్యాశ్చ చలనం భూమేర్ దృశ్యతే కోసలేశ్వర                            88      

కోసలేశ్వరా, ఈ విశ్వవందిత అయిన జగన్మాతయగు భూమి కదలుచు ఊగుచూ ఉన్నది.

యౌధర్మౌ జగతో నేత్రౌ యత్ర సర్వం ప్రతిష్ఠితం

ఆదిత్య చంద్రౌ గ్రహణమభ్యు పేతౌ మహాబలౌ                          89

ఎవరు ధర్మ ప్రవర్తకులో, ఎవరు ప్రపంచమునకు నేత్రమువంటి వారో, ఎవరిని ఆధారము చేసికొని ఈ జగత్తు నిలబడియున్నదో, అట్టి శూర్యుడు, చంద్రుడు, రాహువు ద్వారా గ్రహణమును పొందుచున్నారు.

సుమహాన్త్యపి భూతాని దేవాశ్చ పురుషర్షభ 

న దైవస్య ప్రముఞ్ఛంతి సర్వభూతాని దేహినః                                     90 

పురుషశ్రేష్ఠా, గొప్పగొప్ప మనుజులు, దేవతలు కూడా ప్రాబ్ధకర్మనుంది విముక్తులుకారు. ఇంకా తక్కిన సామాన్య ప్రాణుల సంగతి చెప్పవలయునా?

శక్రాదిష్వపి దేవేషు వర్తమానౌ నయాన యౌ

శ్రూయతే నరశార్దూల న త్వం శోచితుమర్హసి                                 91

ఇంద్రుడు మొదలయిన దేవతలు నీతి అవినీతి వలన సుఖము దుఃఖము పొందుదురని  వినియున్నాము. కావున మీరు దుఃఖపడవలదు.

త్వద్ విధా నహి శోచంతి సతతం సర్వదర్శనాః

సుమహత్స్వపి కృచ్ఛ్రేషు రామ నిర్విణ్ణ దర్శనాః                           92

శ్రీరామా, మీరు సర్వజ్ఞులు.  అట్టిమీరు విపత్తులు సంభవించినప్పుడు దుఖపడరు. వారు తమ విచారణాశక్తిని కోల్పోరు.   

తత్వతొహి నరశ్రేష్ఠ బుధ్యా సమనుచిన్తయ

బుద్ధ్యా యుక్తా మహాప్రాజ్ఞా విజానంతి శుభాశుభే                             93

నరశ్రేష్ఠా, మీరు బుద్ధిచే తాత్విక చిన్తనచేయుడు. ఏమి చేయవలయును, ఏమి చేయకూడదు. ఏది ఉచితము, ఏది అనుచితము. ఎందుకంటె, బుద్ధియుక్తుడగు  జ్ఞానియే శుభా ఆశుభాములగూర్చి తప్పక ఎరిగియుండును.

మామేవం హి పురావీరత్వమేవ బహుశోక్తవాన్

అనుశిష్యాద్ధి కోను త్వామపి సాక్షాద్ బృహస్పతిః                    94

శ్రీరామచంద్రా, అగ్రజా, పూర్వము మీరు అనేకమార్లు ఈ విధమైన సాంత్వన మాటలను నాకు చెప్పిరి. ఇప్పుడు మీకు ఎవరు నేర్పగలరు?  సాక్షాత్ బృహస్పతి కూడా మీకు నేర్పలేరు.

త్వద్ విధా బుద్ధి సంపన్నా మహాత్మానో నరర్షభాః

ఆపత్సు నప్రకంపంతే వాయు వేగైరివా చలాః                          95  

మీవంటి ధీమంతులు, మహాత్ములు, నరశ్రేష్ఠులు, ఆపత్తులందు చలింపరు. వాయువేగముచే పర్వతము చలింపదు.  

తదుపరి వారిరువురును కొంతదూరమేగిన పిదప రక్తసిక్తుడై క్రిందపడిఉన్న జటాయువు కనిపించెను. లక్ష్మణుడు లేకుండజూచి సీతమ్మను రావణుడు ఎత్తుకొనిపోవుచుండెను. అప్పుడు నేను అతనితో యుద్ధము చేసితిని. రావణుడు నన్ను చావుదెబ్బ కొట్టి సీతమ్మను ఎత్తుకొని వెళ్ళెను. రావణుడు దక్షిణ దిక్కుగా వెళ్ళెను.   

న చ త్వయా వ్యథా కార్యా జనకస్య సుతం ప్రతి

వైదేహ్యా రంస్యసే క్షిప్రం హత్వా తమ్  రణమూర్ధని                               96

పుత్రో విశ్రవసః సాక్షాద్ భ్రాతా వై శ్రవణస్యచ

ఇత్యుక్త్వా దుర్లభాన్ ప్రాణాన్ ముమోచ పతగేశ్వరః                               97

కావున సీతమ్మకొరకు దుఖపడవలదు. యుద్ధముద్వారా ఆ రాక్షసుడిని సంహరింపుము. శీఘ్రముగా విదేహ రాజకుమారిని పొంది ఆనందముగా విహరింపుము. రావణుడు సాక్షాత్ విశ్రవసుని కుమారుడు. కుబేరుని తమ్ముడు. ఈ ప్రకారముగా చెప్పి జటాయువు ప్రాణము వదిలెను. శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనెను.

అనేకవార్షికోయస్తు చిరకాల సముత్థితః

సోయమద్య హతః శేతేకాలోహి దురతిక్రమః                                98

ఈ జటాయువు వస్సు చాలా పెద్దది. ఇతను చిరకాలము తన అభ్యున్నతిలో ఉన్నాడు. కాని నేడు వార్ధక్యమునండు ఈ రాక్షసునిచే వధింపబడి భూమిపైపడియుడి యన్నాడు. ఆ హా, కాలమును అతిక్రమించుట సర్వులకును కష్టమే.  

సర్వత్ర ఖలు దృశ్యంతే సాధవో ధర్మచారిణః

శూరాః శరణ్యాః సౌమిత్రే తిర్యగ్యోనిగతేష్వసి                                   99

శూరులు, శరణగతపరాయణులు, ధర్మాచరణబద్దులు, అగు వారు సర్వత్ర కానుపించుతునెఉంటారు. పశుపక్ష్యాది జన్మలయందు కూడా అట్టివారు ఉందురు

పిమ్మట అన్నదమ్ములిద్దరూ క్రౌంచారణ్యమును దాటి మతంగముని ఆశ్రమ సమీపమునకు చేరిరి. అక్కడ అంధకారముతోగూడిన ఒక గుహను చూచిరి.  దాని సమీపములో విశాలదేహముగల రాక్షసిని చూచిరి.  దానిపేరు అయోముఖి. అది లక్ష్మణుని కావలించుకొని తనను భార్యగా గైకొనమని అడిగెను. అంతట లక్ష్మణుడు దాని మొక్కు చెవులు కోసివైచెను. అదిపెద్దగా అరచుచు పారిపోయెను. అక్కడినుండి శ్రీరామలక్ష్మణులిరువురు వడి వడిగా అడుగులు వేస్తూ ఒక అరణ్యమున ప్రవెశించిరి. అక్కడ ఒక భయంకరమైన రాక్షసుని చూచిరి. అతనికి మొండెము మాత్రమె ఉండెను. వాడి పొట్టయందు తల ఉండెను.  వాడిపేరు కబంధుడు. వాడు రామలక్ష్మణులిరువురిని వధించుటకు ముందరికి వచ్చుచుండెను.

కాలస్య సుమహద్ వీర్యం సర్వభూతేషు లక్ష్మణ 

త్వం చ మాం చ నరవ్యాఘ్ర వ్యసనైః పశ్యమోహితౌ

నహి భారోస్తి దైవస్య సర్వభూతేషు లక్ష్మణ                                      101   

నరశ్రేష్ఠుడవగు లక్ష్మణా, కాలము తనమహిమను ప్రభావమును ప్రజలందరి మీద చూపించును. చూడుము—నీవు నేను కాలముచే అనేకసంకటములచే మోహితులగుచున్నాము. లక్ష్నణా, కాలమునకు లేక దైవమునకు సమస్తప్రాణులపైన శాశన మొనర్చుట భారమేమియు కాదు.

తదుపరి ఆ రాజకుమారులిరువురు ఖడ్గములతో ఆ కబంధుడి రెండుచేతులు నరికి వేసిరి. క్రిందపడిపోయి రక్తములో కొట్టుకుంటున్న ఆ రాక్షసుడు, “మీరెవరు? అని రామ లక్ష్మణులను ప్రశ్నించెను.  తమవృత్తాంతమును తెలిపి, వాడిని ఒక గోతిలో పడవైచి నిప్పంటించిరి.  అప్పుడు మహాతేజోవంతమైన కాంతితో కబంధుడు రామలక్ష్మణులతో ఇట్లనెను.

శృణురాఘవ తత్వేన యథా సీతం అవాప్స్యసి

రామ షడ్యుక్తయో లోకే యాభిః సర్వం విమృశ్యతే

పరిమృష్టో దశాంతేన దశాభాగేన సేవ్యతే                                102 

రఘునందనా, నీవు సీతనెట్లు పొందగలవో, బాగా చెప్తున్నాను, వినుము. ఓ, రామా, లోకమున ఆరు యుక్తులు కలవు. వానిచే రాజులు  సమస్తము పొందుచున్నారు. అవి—సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైధీభావము, సమాశ్రయము అనునవి.  ఎవ్వడు దుర్దశాగ్రస్తుడైయుండునో, మరియొక దుర్దశాగ్రస్తుడైన ఇంకొకనిచే సహాయమును పొందును. 

శ్రీరామా, సుగ్రీవుడు అను వానరుడు కలదు. అతని అగ్రజుడు వాలి. వాడు దుర్బుద్ధితో కోపగించి తమ్ముడు సుగీరువుని ఇంటినుండి వెడలు గొట్టేను. మనస్వియగు సుగ్ర్రీవుడు నలుగురు వానరులతో కలిసి పంపా సరోవరము వరకు వ్యాపించియున్న ఋష్యమూక పర్వతముపై నివసించుచున్నాడు.

గచ్ఛ వీఘ్రమితో వీర సుగ్రీవం తమ్ మహాబలం

వయశ్యం తమ్ కురు క్షిప్ర మితో గత్వాద్య రాఘవ                              103

తదుపరి శ్రీరామలక్ష్మణులు కబంధుడు చెప్పిన పంపాసరోవరమార్గమును జేపట్టి ప్రయాణమై వెళ్ళిరి. పంపా పుష్కరిణీ పడమటి తీరమును చేరిరి  వారు అచట శబరి యొక్క రమణీయ ఆశ్రమమును చేరిరి.  శబరీ పెద్దతపస్విని. రామలక్ష్మణులు వచ్చుట చూచి ఆమె చేతులు జోడించుకొని నిలబడిరి. బుద్దిమంతులైన రామలక్ష్మణులు ఇరువురు శబరి పాదములకు ప్రణమిల్లిరి.

తామువాచ తతో రామః శ్రమణీం ధర్మ సంస్థితాం

కచ్చిత్తే నిర్జితా విఘ్నాః కచ్చిత్తే వర్ధతే తపః

కచ్చిత్తే నియతః కోప ఆహారశ్చ తపోధనే                                    104

అప్పుడు, శ్రీరాముడు ధర్మపరాయణియగు ఆ తపస్వినితో ఇట్లుపలికెను. తపోధనీ, నీవు విఘ్నములన్నిటిపైనను విజయమును పొందితివా? నీ తపస్సు తపస్సుఅభివృద్ధి చెందినదా? నీవు కోపమును జయించితివా? ఆహారనియమములను పాటించుచుంటివా?

 శ్రీరాముడు ఇట్లు ప్రశ్నింప సిద్దురాలును, తస్వినియు, వృద్ధయు, సిద్దులతో కూడినదియు అగు శబరి ఇట్లు పలికెను.  శ్రీరామా,   నీవు మహాత్ముడవు.  నీ ఇష్టమైన  ఫలములను సమకూర్చితిని. ఆరగింపుము. శ్రీరాముడు శబరితో ఇట్లనెను. సాధ్వీ, నీ ఇచ్ఛానుసారము అభీష్టపూర్వకముగా ఆనంద లోకములకు వెళ్ళవచ్చును. అంతట దివ్యపుష్పములను, దివ్యగంధములతో శబరి స్వర్గలోకమునకు జనెను.

శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనెను.

దృష్టో మయాశ్రమః సౌమ్య బహ్వాశ్చర్యః కృతాత్మనాం

విశ్వస్త మృగశార్డూలో నానా విహగ సేవితః                                   105   

లక్ష్మణా, ఆ పుణ్యాత్ములైన మహర్షుల ఆశ్రమమును చూచితిని. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయములు ఉన్నవి. ఇక్కడ లేళ్ళు, నెమళ్ళు, క్రూరజంతువులు పరస్పరస్నేహభావముతో మెలుగుతూ ఉండును. అనేకరకములైన పక్షులు ఈ ఆశ్రమమునుండి సేవించుచుండును.

అక్కడినుండి బయల్దేరి రామలక్ష్మణులిరువురు పంపాసరోవర తీరమునకు వచ్చిరి.

Comments

  1. Astrologer Master Rudra Ji is the best astrologer in New York who was practicing Vedic Astrologer for the past many years.
    famous astrologer in new york

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana