kriyayogasadhana explained further in Telugu

     సాధన సశాస్త్రీయము.ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, లేదా ఒక శాస్త్రవేత్త కావలయునన్న 15 20 సంవత్సరముల కఠోర పఠనం అవసరముకదా.  అదేవిధముగా ఆధ్యాత్మిక సాధనకి కూడా కొన్ని సంవత్సరముల కఠోర సాధన అవసరము.ఒక చిన్న రాయి చూపించి దీనిని 10,000 (పదివేలు) మాత్రలు(Magnifying lense) భూతద్దంతో పెద్దది చేస్తే కొండగా అగుపడుతుంది అంటే విద్యార్థికి అర్థం కాదు.  విద్యార్థిని కొండ దగ్గరికి తీసికొని వెళ్ళి చూపిస్తే సరిగా  పరిపూర్ణంగా  అర్థంచేసికుంటాడు. అదేవిధముగా ఆధ్యాత్మిక జ్ఞానము కూడా అంతే.  పరమాత్మని అర్థం చేసికొనటానికి అర్థంగాని శ్లోకములు, విజ్ఞా లేదా పండిత ప్రకర్ష అవసరములేదు.
శ్ + లోక = శ్లోక. నీలోని లోకములను నిశ్శబ్ద పఱచు. నీకు పరమాత్మ తప్పక దర్శనం ఇస్తాడు. ఎక్కువెక్కువ పుస్తకాలు చదివితే నీలోని అహంకారం పెరుగుతుంది. సందేహములు పెరుగును. మామిడిపండు రుచి పుస్తకంలో చదివితే తెలుస్తుందా? కడుపు నిండుతుందా? తిని అర్థంచేసికో. పరమాత్మ విషయమూ అంతే. సాధన చెయ్యి. ప్రసన్నం చెసికో. అర్థం చేసికో.  

సృష్టి - మానవజన్మ
కారణసృష్టి
త్రిగుణాత్మకమైన అవిద్య బ్రహ్మచైతన్యంతో సృజనాత్మకశక్తిని పొందినది. కనుక బ్రహ్మముతో చైతన్యవంతమైన అవిద్యనుండి వరుస క్రమములో ఆకాశం (శబ్దం), ఆకాశం నుండి వాయువు (స్పర్శ), వాయువు నుండి అగ్ని (రూపం), అగ్ని నుండి జలం (రసము), జలం నుండి భూమి (గంధం) పుట్టినవి.

  అవస్థలు

1) జాగ్రతావస్థ : 2) స్వప్నావస్థ : (అవచేతన) 3) సుషుప్తి అవస్థ : (అధిచేతన అవస్థ)

 

   ఓంకారము :

ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ
                   గీత 8-13
ఓంకారం బిందు సంయుక్తం నిత్యం గాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః
ఒక ఫాక్టరీ నుండి ఏదేని వస్తువు ఉత్పన్నమగునపుడు ముందుగా శబ్దము ఉత్పన్నమగును. అదే విధముగా పరమాత్మ చైతన్యమువలన మాయనుండి సృష్టి వ్యక్తీకరించబడుతున్నపుడు అనగా పరమాత్మ ఫాక్టరీ నడుచుచున్నపుడు వ్యక్తీకరించు శబ్దమే ఓంకారము. ఈ ప్రణవనాదము అకార (స్థూల), ఉకార (సూక్ష్మ), మకారముల (కారణ) సంయోగము. సమిష్టి స్థూల, సూక్ష్మ, కారణ, లోకములతో కూడిన జగత్తు భగవత్ ప్రతిరూపమైన ఈ ఓంకారమే.
  
డాక్టర్ చదివిన రాఘవ్ డాక్టర్ రాఘవ్. లా చదివిన రాఘవ్ లాయర్ రాఘవ్, ఇంజనీరింగ్ చదివిన రాఘవ్ ఇంజనీర్ రాఘవ్
బ్రహ్మవిద్ బ్రహ్మైవభవతి అనగా బ్రహ్మజ్ఞానము తెలిసినవాడు బ్రహ్మే.
 భక్తిపుష్పములు ఎమిమిది రకములు
అహింసా ప్రథమోపుష్పః పుష్పమింద్రియనిగ్రహః
 సర్వభూతదయాపుష్పం క్షమాపుష్పం విశేషతః
శాంతిపుష్పంతపఃపుష్పంధ్యానపుష్పంతథైవచ సత్యమష్ఠవిధంపుష్పంవిష్ణోఃప్రీతికరంభవేత్
1) అహింస 2) ఇంద్రియనిగ్రహం 3) సర్వభూతదయ 4) తపస్సు 5) క్షమ 6) శాంతి 7) ధ్యానం 8) సత్యం
అనెడు ఎమిమిది రకముల పుష్పములు భగవంతునికి ప్రీతికరము అయిన పుష్పములు.

 పరమాత్మ తత్త్వము

ప్రతి ఆలోచన, క్రియ, సంకల్పం ప్రారబ్ధకర్మవలన వచ్చునవే. ప్రతి అనుభవము, ప్రతి ఫలితము కర్మ ఫలములే. జీవునివెంట వచ్చేవి కర్మ ఫలములు మాత్రమే కాదు. వాసనా రూపములో నున్న కోరికలు - అనగా సంస్కారములు. ఇవియే కొత్తకర్మలు - అనగా ఆగామి కర్మలు. ఎన్నో జన్మల నుండి పేరుకు పోయిన కర్మలను సంచితకర్మలు అందురు. జ్ఞానాగ్నివలన సంచితము, అకర్తృత్వంవలన ఆగామి, అనుభవించుటవలన ప్రారబ్ధము నశించును. ప్రయత్న బలముతో ప్రారబ్ధ కర్మను అధిగమించ వలయును.
సర్వంఖలు ఇదంబ్రహ్మ.

స్వంత ఇల్లు
ఇంటి నుండి బయలు దేరిన వ్యక్తి తిరిగి తన స్వంత ఇంటికి చేరటముతో (లో) నే సంతోషము పొందుతాడు. అదేవిధముగా ప్రతి జీవి కూడా తన స్వస్థానం అయిన పరమాత్మలోనే సంతోషము పొందుతాడు. పరమాత్మతో ఐక్యం చెందే వరకు ప్రతి జీవి తప్పక సాధన చేయాలి. అన్ని యోగములు కలిసిన క్రియాయోగము సాధనాపరుడికి చాలా ఉత్తమ మైనది.

యోగములు

1) హఠయోగము అనగా ఆసనములు, వ్యాయాయముల ద్వారా శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచటం 2) లయయోగము: ఓం శబ్దాన్ని వినటం మరియు ఓంలో మమేకం అగుట 3) కర్మయోగము: ఫలితమును ఆశించక కర్మ చేయుట 4) మంత్రయోగము: ఆత్మని పరమాత్మతో కలపటానికి చేసే ఉచ్ఛారణలు (Chantings), బీజాక్షరములలో మమేకం అగుట  5) రాజయోగము: ప్రాణాయామ పద్ధతులు - అనగా పతంజలి అష్ఠాంగ యోగ పద్ధతుల ప్రకారము ప్రాణశక్తి నియంత్రణ. అసలు శ్వాసని అస్త్రంగా ఉపయోగించటమే శాస్త్రం. ఆత్మసాక్షాత్కారము పట్ల కలిగే స్వాభావిక ఆకర్షణే భక్తి యోగము.
ప్రాణాయామం ద్వారా ప్రాణ, అపాన వాయువులు మహాముద్ర ద్వారా ఉదాన, వ్యాన వాయువులు స్థిర మగును. జ్యోతిముద్ర ద్వారా ఆత్మ సాక్షాత్కారము లభించును. అంగుష్ఠ ప్రమాణములో నున్న వామనుని, అనగా పురుషుణ్ణి దర్శించు కోవచ్చును. వామన అనగా వరిష్ఠమైన మనస్సు గలవాడు అని అర్థము. క్రియా యోగము చేయుటవలన క్రియలు మేరుదండాన్ని (వెన్నుపూసను) అయస్కాంత వంతము చేయును. అయస్కాంతవంతము అయిన మేరు దండము యాంటినా (Antenna) మాదిరిగా అగును. అయస్కాంతవంతము అయిన మేరు దండము యాంటినా (Antenna) మిగిలిన శరీరములోని శక్తినంతా ఆకర్షించును. ఈ ఆకర్షింప చేసుకొనబడిన శక్తి సుషుమ్న ద్వారము గుండా సహస్రారము లోనికి చేర్చ బడును. ఈ విధముగా చంచల మనస్సు స్థిర భావము చెంది అంతర్ముఖత్వము చెందుచుండును. క్రియా యోగము ద్వారా త్రిగుణాతీత నిష్కామ భావము కలుగును.
షట్చక్రక్రియనే వేదవిధి అందురు. ప్రాణాయామ కర్మ క్రియే కర్మ యోగము. కర్మచేయనిదే జ్ఞానము కలుగదు. ప్రాణాయామ కర్మ క్రియ చేయనిదే భక్తి - అనగా సర్వము అర్పించు భావన ఉత్పన్న మవదు. సర్వము అర్పించు భావన ఉత్పన్నమవనిదే పరమాత్మ మీద మనస్సు లగ్నమవదు. పరమాత్మ మీద మనస్సు లగ్నమవనిదే స్వాభావిక మైన ఆకర్షణ ఉదయించదు.
 చంచల ప్రాణమును ఊర్థ్వమయిన ఆజ్ఞాచక్రములో నిలపడమే ఊర్థ్వరేతస్సు. ప్రాణం, బుద్ధి, మనస్సు, కళ్ళ ద్వారా  ఈ జీవుడు అనగా ఆత్మ, ఈ సంసార జగత్తును చూస్తూ ఉంటుంది. ఈ జీవుడు అనగా ఆత్మ ఈ సంసార జగత్తును పరిత్యాగము చేసి కూటస్థము వైపు దృష్టి మరల్చి, కూటస్థము ద్వారా చూడటము, చెందటము చేస్తూ ఉంటే ఆథ్యాత్మిక జగత్తు సాధ్య మగును.
ఏదీ హఠాత్తుగా జరగదు. 17-20 సంవత్సరముల సమిష్టి పఠనా ఫలితమే ఒక వైద్యునిగానూ, ఒక ఇంజనీరుగానూ, ఒక లాయరుగానూ, ఒక శాస్త్రవేత్తగానూ, ఒక పారిశ్రామికవేత్తగానూ అగుటకు దోహదపడు తున్నది. అలాగే క్రితం లేదా గడచిన జన్మల సమిష్టి కర్మల ఫలితమే జీవుని సుఖదుఃఖముల అనుభవమునకు కారణము. నిశ్చయంగా దైవశక్తి గొప్పదే. కాని పురుషాకారము అనగా కర్మ లేదా ప్రయత్నము చేయనిది ఏదీ సాధ్యపడదు. దైవము విజ్ఞాన సమ్మతముకాదు. కర్మ చేయనిదే జ్ఞానము రాదు.
ప్రాణాయామ కర్మ చేయనిదే ఆత్మ జ్ఞానము కలుగదు. ఈ (ఈక్షణముల నుండి వచ్చు) శ్వర (బాణముల వంటి శ్వాస) అనగా ప్రాణాయామ కర్మ చేస్తున్న యోగియొక్క ప్రకాశ మానమౌ ఆత్మశక్తి సదృశమౌ ఈక్షణములను ఈశ్వర అంటారు. నిశ్చల బ్రహ్మయొక్క ప్రథమ చంచలత్వమే పరాశక్తి. ద్వైతము ఈ పరాశక్తినుండే ప్రారంభము. కూటస్థములో దర్శనము ఇచ్చు ఈ త్రిభుజమునే మహత్ బ్రహ్మ, యోగమాయ, ఆదిశక్తి, మహామాయ, అందురు. యోగి, ప్రాణాయామ కర్మ చేస్తున్న యోగి, ప్రాణము తద్వారా మనస్సు స్థితి వంతము అయినపుడు ఈ త్రిభుజమునే అనగా మహత్ బ్రహ్మ, లేక యోగమాయ, లేక ఆదిశక్తి, లేక మహామాయ లేక మహత్ యోని దర్శనము పొందును. ప్రాణిరూపి అయిన ఆత్మ (జీవుడు) గర్భాదాన సమయములో, ఆ త్రిభుజ యోని మధ్యలో బిందు రూపములో అవస్థితమై యుండును. ఆ బిందువు క్రమశః విస్తారముచెంది అవయవ సహితము అగును. ఈ విధముగా మహత్ బ్రహ్మ యోని నుండి జరిగే సకల భూత సృష్టి అధిక చంచలత్వాన్ని ప్రాప్తించుకొని నానారకముల యోనులు ఉత్పన్నమగును. నానారకముల యోనుల నుండి నానా రకముల మూర్తులు ఉత్పన్నమగును. కానీ సకలమూ ఉత్పన్న మగుటకు మహత్ బ్రహ్మ రూపమైన బ్రహ్మయోనే మూలము. అవిభక్తమైన బ్రహ్మే మహత్ యోని. అదే మాతృ స్థానము. కూటస్థములోని యోని మధ్యలో బిందు లేక అణు రూపములో ఉన్నది ఈ పితా స్వరూపము అయిన పరమాత్మే. ఆ బిందువుయొక్క విస్తార రూపమైన అధిక చంచలత్వము మాధ్యమంగా విస్తారమైన కూటస్థ రూపాంతరంవలన నానారకముల మూర్తులుగా ఉత్పన్నమగునది పరమాత్మయే. ఈవిధముగా తల్లి, తండ్రి మరియు పుత్రుడు/పుత్రిక అన్నీ పరమాత్మయే. విభక్తములుగా ఉన్న నాలుగు వేదములు, సకల దేవతలు, త్రిమూర్తులు అన్నియు ఆ మహత్ బ్రహ్మ రూప పరాశక్తి యోని నుండే ఉత్పన్న మగును. స్థిరబ్రహ్మ ప్రథమ చంచలత్వము ఈ పరాశక్తి అనే శుధ్ధసత్వమాయ. అధిక చంచలత్వము  రజో తమో గుణముల ఉద్భవానికి దారితీయును. అభిన్న ఓంకారమే ఆది వేదము, మూల వేదము, మూల జ్ఞానము. నిశ్చలావస్థ రూప బ్రహ్మకు ముందుగా కనిపించే ఆత్మ సూర్యుడి నుండే ఈ ప్రపంచములోని సర్వమూ ఉత్పన్న మగుచున్నది.

కర్మసిధ్ధాంతము

క్రితం లేదా గడచినజన్మలలోని సమిష్టికర్మలఫలితమే దైవము లేదా విధి. కర్మ లేకుండా దైవము లేదా విధి ఉండదు. కాని దైవము లేకుండా కర్మ  ఉండును. బుధ్ధిఃకర్మాణుసారిణీ.
అదృష్టం అనగా న దృష్టం. అనగా కనబడనిది. పాత కర్మలు అనగా సంచిత కర్మలు న దృష్టం, అనగా కన బడవు. వాటి ఫలితములు మాత్రమే మానవుడు అనుభవించేది. ఒకే అర్హత కలిగి, తెలివి తేటలు కలిగిన ఇద్దరు వ్యక్తులలో ఒకడికి మంచి జీవితము, ఇంకొకడికి దుర్భర దరిద్ర జీవితమునకు కారణము ఈ కనబడని సంచితకర్మల నుండి తెచ్చుకున్న ప్రారబ్ధకర్మఫలితమే. స్థూలదేహము లేనిదే దైవము లేదా దయ్యము. ఈ దేహము లేని కనబడని సంచిత కర్మల నుండి తెచ్చుకున్న కొంత సంచిత కర్మ ఫలితమే ప్రారబ్ధకర్మ. ఈ ప్రారబ్ధ కర్మమే మన ప్రస్తుత, మంచి, చెడు, లేదా మిశ్రితమైన మంచి చెడు, స్థితికి కారణము.
కనుక కటికదరిద్రానికి, అమితఇశ్వర్యానికి కారణము మనము చేసుకున్న, చేసుకుంటున్నకర్మ. ఈ విషయము దృష్టిలో పెట్టుకొని ఆగామికర్మలు అనగా ప్రారబ్ధకర్మ అనుభవిస్తూ భవిష్యత్తులో ఉపయోగపడే (సత్కర్మలు) ఆగామికర్మను నిష్కామముతో దృఢ నిశ్చయముతో చేయవలయును. కనుక జ్ఞానముతో సంచిత, ప్రారబ్ధ, మరియు ఆగామికర్మలు దృఢనిశ్చయముతో దగ్ధము చేయవలయును. మత్తుమందు ఇచ్చి ఆపరేషను (Operation) చేసినయడల నొప్పితెలియదు. అదేవిధముగా ప్రారబ్ధకర్మ జ్ఞానిని అంత తీవ్రముగా బాధించదు. కావున కర్మే ప్రధాన మైనది. క్రితం లేదా గడచిన జన్మల సమిష్టి కర్మల ఫలితమే దైవం లేక విధి. కర్మ ఉంటే దైవము ఉన్నట్లే. గ్రామములో జల్లడపట్టిన ధాన్యము ధాన్యాగారబుట్టలో పోస్తూ ఉంటారు. పోస్తున్న ధాన్యము ఆగామి కర్మ.
ధాన్యంబుట్టలో ఇంతకు ముందే ఉన్న ధాన్యము సంచితకర్మ. ప్రస్తుతము ఖర్చు చేస్తున్నది ప్రారబ్ధకర్మ.  

దేవీదేవతలు

కొన్ని కర్మల ఫలితములు వెంటనేలభ్యమగును. కొన్ని కర్మల ఫలితములు ఆలస్యముగా లభించును. బ్లేడుతో (Blade) చర్మము తెగిన వెనువెంటనే రక్తము చిందును. ప్రతి బాక్టీరియాకి (Bacteria) రోగము కలుగజేయు సమయము (Incubation period) ఆయా బాక్టీరియానిబట్టి ఉండును. ఆ సమయము 7, 14, 21రోజులు కూడా ఉండవచ్చును. ఒక విత్తనము మొలకెత్తుటకు, ఆ తరువాత మొక్క అయి వృక్షము అగుటకు 4 నుండి 9 సంవత్సరములు పట్టవచ్చును. అదే విధముగా ఈ జన్మములో మనము అనుభవించేది, అనుభవిస్తున్నది ప్రారబ్ధ కర్మ మాత్రమే. సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు మనము జ్ఞానము, ధ్యానముతో నశింప జేసికొనవచ్చును. ఎంతవారలైనా ప్రారబ్ధకర్మ మాత్రము అనుభవించి తీరవలసినదే. త్యాగయ్య, రామదాసు, అన్నమాచార్యులు మొదలగు మహాత్ములు అనుభవించినది కేవలము ప్రారబ్ధకర్మ మాత్రమే. కాకపోతే మత్తు మందు ఇచ్చి ఆపరేషను చేస్తే రోగికి నొప్పి తెలియనట్లుగా, యోగికి ఆ ప్రారబ్ధకర్మబాధ అంతగా బాధించదు.
ప్రారబ్ధంభోగతేభుంజాత్ తత్త్వజ్ఞానేన సంచితమ్ ఆగామిద్వివిధం ప్రోక్తమ్ తద్వేష్టి ప్రియవాదినౌ.
స్థూలశరీరము లేని జీవుడినే దేవి, దేవత, దేవుడు, దెయ్యము, పిశాచము అందురు. మనకు అనుకూలముగా పనిచేయు శక్తినే మంచి శక్తి లేదా దేవి లేదా దేవుడు అనెదము. మనకు అనుకూలముగాపనిచేయని లేదా ప్రతికూలమైన శక్తినే చెడ్డ శక్తి లేదా దెయ్యము లేదా పిశాచము అనెదము . కనుక ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, మనస్సు, బుధ్ధి, చెట్టు, పుట్ట అన్నీ దేవి, దేవుడు, దేవతలే. మనకు అనుకూలముగా ఆ పనిచేయు శక్తినే దేవి (స్త్రీ), దేవుడు (పురుషుడు) గా పిలచెదము.

పూర్వజన్మస్మృతి లేక పోవడము అనేది ఆ పరమాత్మ మనకిచ్చిన వరము. ఉదాహరణకి ఒక భార్యాభర్తలకి పూర్వజన్మస్మృతి వలన వారిలో ఒకరు ఇంకొకరిని క్రిందటిజన్మలో హత్యచేశారని తెలిసిందనుకుందాము.  లేదా వారు ఇరువురూ క్రితం జన్మలో సోదర సోదరీమణులు అనుకుందాము. వారు ఈ జన్మలో ఈవిషయము తెలిసి కాపురము చేయగలరా? కనుక పూర్వజన్మస్మృతి లేక పోవడము అనేది ఆ పరమాత్మ మనకిచ్చిన వరము.
కూటస్థ స్థితిని పొందడమే శరణాపన్నస్థితి. పరిమితమైన వస్తువుతో అపరితమైన వస్తువును చూడలేము.
పంచభూతములన్నింటిలోను, ఆ పంచభూతముల నుండి ఉత్పన్న మయ్యే జగత్తులోని సర్వములోనూ పరమాత్మని దర్శించటము అసాధ్యము. అనగా అనేక రూపములు కలిగిన పరమాత్మని దర్శించటానికి సాధకునికికూడా అనేక రూపములుండాలి. సాధకుడు కూటస్థుడైన పరమాత్మని దర్శించటానికి కూటస్థములోనే స్థిరుడై ఉండవలయును. కూటస్థము, కూటస్థుడైన పరమాత్మ రెండునూ అవినాశులే. ప్రాణముయొక్క ప్రథమ చంచలత్వము లేదా ప్రథమ తరంగంనుండి సృష్టి తత్త్వము లోని చివరి ఘనీభూతమైన దేవీ దేవతల తరంగం వరకు వర్తమానమై యున్న 33 కోట్ల దేవీ దేవతలు వారి వారి పరిమితుల ననుసరించి ఉన్నవి. గుణసహితమైన ఈ దేవీ దేవతలను స్తుతులతోనూ, ప్రార్థనలతోను సంతృప్తి పఱచవచ్చు. స్థిరప్రాణము నుండి జన్మించిన ప్రథమ తరంగంలో నుండి ఆవిర్భవించినదే చంచల ప్రాణము. అన్ని తరంగములను అతిక్రమించి మహాస్థిరత్వంతో విలీనమై పోవడానికి చేసే కర్మే ఈ ప్రాణాయామ కర్మ. ఆత్మసూర్యుడు ఒకోసారి బిందురూపములోను, ఒకోసారి సీమారహితమైన అనంతం గానూ, ఒకోసారి సహస్రకోటి సూర్య తేజస్సు తోను, ఒకోసారి స్వచ్ఛమైన మహా శూన్యము గానూ ఉంటాడు.

మూలాధారచక్రమునుండి (భూమినుండి) సహస్రారము (సత్య లోకము) వరకు ఉన్నదే అంతరిక్షము. కుండలిని మూలాధార చక్రములో సర్పాకారముగా బ్రహ్మద్వారాన్ని అనగా సుషుమ్న ద్వారాన్ని మూసి ఉంచి మూడున్నర చుట్టలు చుట్టుకొని నిద్రిస్తున్న శక్తి . ప్రతి వ్యక్తి లోనూ 72 వేల సూక్ష్మ నాడులు ఉన్నవి. అందులో మేరు దండం మధ్యలో ఎడమ ప్రక్కన ఇడ, మేరు దండం మధ్యలో కుడిప్రక్కన పింగళ, మేరు దండం మధ్యలో సుషుమ్న అని మూడు సూక్ష్మనాడులు ఉన్నవి. ఈ ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు సూక్ష్మనాడులు చాలా ముఖ్య మైనవి. ఈ సుషుమ్న లోపల వజ్ర, దాని లోపల చిత్ర, దాని లోపల బ్రహ్మనాడి ఉన్నవి. ఈ సుషుమ్న మూలాధారచక్రము నుండి బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించి యుంటుంది. వజ్ర సూక్ష్మశరీరమునకు కావలిసిన కదలికలకు సంకోచ వ్యాకోచ శక్తుల్ని సమకూరుస్తుంది. వజ్ర స్వాధిస్ఠానచక్రమునుండి పైకి వ్యాపించి ఉండును చిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమములు అనగా చేతనకి సంబంధించినవి అదుపులో ఉంచు కొనును. ఈ మూడు సూక్ష్మ మేరుదండములు అనగా సుషుమ్న, సుషుమ్నలోని వజ్ర, వజ్రలోని చిత్ర అనేమూడూ సహస్రారము లోని సూక్ష్మ మెదడు ద్వారా పని చేయును. భౌతిక శరీరము రక్త, మాంసమయము. సూక్ష్మ శరీరము ప్రాణ లేక తెలివి గల ప్రకాశముతోనూ నిండియుండును.




కారణశరీరము చేతనతో  కూడు కొని యుండును. కారణశరీరము ఆధ్యాత్మికమెదడు కలిగి, బ్రహ్మనాడి అనే ఆధ్యాత్మిక మేరు దండము కలిగియుండును. కేవలము చేతన మాత్రమే కలిగి యుండును. భౌతికశరీరమునకు కావలిసిన శక్తి సూక్ష్మశరీరము అందించును. సూక్ష్మశరీరమునకు కావలిసిన ఆలోచన, గుర్తింపు, భావన, ఇచ్ఛా శక్తులను కారణశరీరము అందించును.

చక్రములు స్థానములు

1) మూలాధారచక్రము: వ్యష్టిలో పాతాళ, సమిష్టి లో భూలోకం అంటారు.
  కుండలిని శక్తి ఈ మూలా ధారములో సర్పాకారముగా మూడున్నర చుట్టలు చుట్టుకొని నిద్రిస్తూ ఉండును. సుషుమ్న ద్వారాన్ని బ్రహ్మద్వారము అందురు. ఈ సుషుమ్న ద్వారాన్ని మూసి ఉంచి నిద్రిస్తున్న ఈ కుండలిని శక్తిని యోగసాధన ద్వారా మేల్కొలిపి అఖండానందము, దివ్య దృష్టి, దివ్య జ్ఞానము  సాధించటమే కుండలిని జాగృతి అందురు. ఆ అఖండానందము అనేది ఈ మేల్కొలిపిన కుండలిని శక్తి సుషుమ్న ద్వారా బ్రహ్మరంధ్రములోనికి మూలాధారము నుండి స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రములు దాటుకుంటూ వెళ్తేనే కలుగుతుంది.
కుండలిని శక్తి మహాభారతములో ద్రౌపదిగాను, రామాయణములో సీతాదేవిగాను, శ్రీబాలాజి వెంకటేశ్వర స్వామి చరిత్రలో శ్రీపద్మావతి దేవిగానూ వ్యవహరించబడుతున్నది. మూలాధారచక్రము మహా భారతములో సహదేవుడుగా వ్యవహరించెదరు. ధ్యాన సాధనకి ప్రతికూలముగా ఉండే శక్తిని అడ్డుకునే దివ్యశక్తిగా అభివర్ణిస్తారు. మూలాధార చక్రములో సుప్తమై (నిద్రించి యున్న) కుండలిని ప్రాణశక్తి స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రముల ద్వారా సహస్రారచక్రము చేరటానికి చేసే ప్రయత్నములే అన్నిసాధనలయొక్క ఉద్దేశ్యములు.  

ద్రౌపది - శ్రీపద్మావతిదేవి (కుండలినిశక్తి)
ద్రౌపది అనగా కుండలినీ ప్రాణశక్తి, ఐదుగురు పాండవులను అనగా సుషుమ్న ద్వారా ఐదు చక్రాలు దాటుకుంటూ కూటస్థముచేరి, కూటస్థమునుండి సుషుమ్నద్వారా సహస్రారము చేరటము, తత్ పశ్చాత్ మహా ప్రకాశములో లయం అగుటయే మహాభారతము.
ఈ కుండలినీ ప్రాణ శక్తినే వాసుకి అందురు. మేరుదండమే మేరు పర్వతము.
మేరు దండమును మధించుట అనగా శ్వాసని అస్త్రంగా అనగా ప్రాణకర్మ ద్వారా సంసారములో ఉండి విషము చిందించుచున్న కుండలినీ ప్రాణశక్తి అనే వాసుకి అనే సర్పాన్ని సుషుమ్న ద్వారము ద్వారా ఐదు చక్రముల గుండా పంపుతున్నపుడు ఈ ఐదు చక్రముల స్వభావ   స్వగుణములను పుణికి పుచ్చు కొని, అనగా గంధ, రుచి, రూప, స్పర్శ, శబ్ద ములు అనే ఐదు తలల సర్పముగా అభివర్ణించ బడును. ఈ ఐదు తలల సర్పము ఆజ్ఞా + లేదా కూటస్థము చేరి, కూటస్థము నుండి సహస్రారము చేరుట తోడనే ఆ ఐదుతలల సర్పముయొక్క విషాన్ని అనగా అహంకారాన్ని, అంతఃకరణని వదిలించటమే శ్రీకృష్ణుడు కాళీయ మర్దనము చేయుట అందురు.

అంతా యోగమే

శివాలయములో శివలింగానికి ఎదురుగా ఉంచే నందియొక్క గూఢార్థము ఈ అష్టాంగయోగమే. నందియొక్క మేరు దండము నిఠారుగా ఉండును. నందియొక్క రెండు కొమ్ములు ఇడ మరియు పింగళ సూక్ష్మ నాడుల ప్రతీకలు. ఆ నందియొక్క రెండు కొమ్ముల మధ్యలో   నిఠారుగా ఉన్న మేరుదండము సుషుమ్న సూక్ష్మ నాడియొక్క ప్రతీక. శివలింగము సహస్రారచక్రమునకు ప్రతీక. ముడ్డి దగ్గర ఒక చేత్తో రాస్తూ, నందియొక్క రెండు కొమ్ముల మధ్య నుండి చూడటము అంటే, సాధనచేసి ముడ్డిదగ్గర మూలధారచక్రములో ఉన్న కుండలిని ప్రాణశక్తిని వెచ్చబరిచి, ఆ కుండలిని ప్రాణశక్తిని నిఠారుగా ఉన్న మేరుదండములోని సుషుమ్నద్వారా సహస్రార చక్రములోనికి పంపమని సూచన. కొన్ని యోగి వేమన పద్యముల   యొక్క గూఢార్థము ఇదే.
చెప్పులోన రాయి చెవులోనిజోరీగ కంటి లోని నలుసు కాలు లోనిముల్లు
ఇంటిలోనిపోరు ఇంతింతకాదయా విశ్వదాభిరామ వినురవేమా.
అంతరార్థం: ఓంకారాన్ని చెప్తూ లోపల జోరీగ మాదిరి రాసుకో. తద్వారా - అనగా ఓంకారాన్ని చెప్తూ లోపల జోరీగ మాదిరి రాసుకుంటూ ఉంటే, లోపలి అజ్ఞానాన్ని కంటావు. ఓంకారాన్ని చెప్తూ లోపల జోరీగ మాదిరి రాసుకుంటూ ఉన్నావు కాబట్టి ఆ కన్న అజ్ఞానము అప్పుడు కాలి పోతుంది.
దేహోదేవలయోప్రోక్తః జీవోదేవోసనాతనః లేని యడల ఈ ఇంటిలో (శరీరములో ) ఉన్న నాగు పాముల లాంటి ఇంద్రియములు నిన్ను ఈ ఇంటిలో (శరీరములో) ఉన్న పరమాత్మని కనబడకుండా మరుగుపఱచును.

2) స్వాధిస్ఠానచక్రము: వ్యష్టిలో మహాతల, సమిష్టి లో భువర్లోకం అంటారు.
3) మణిపూరచక్రము: వ్యష్టిలో తలాతల, సమిష్టిలో స్వర్లోకం అంటారు.
 నాభి వెనకాల ఉండును.  
4) అనాహతచక్రము: వ్యష్టిలో రసాతల, సమిష్టిలో మహర్లోకం అందురు.
5) విశుద్ధ చక్రము: వ్యష్టిలో సుతల, సమిష్టి లో జనలోకం అంటారు.
6) ఆజ్ఞా చక్రము: వ్యష్టిలో వితల, సమిష్టి లో తపోలోకం అంటారు.
7) సహస్రార చక్రం : వ్యష్టిలో అతల, సమిష్టి లో సత్యలోకం అంటారు.
 ఎల్లవేళలా ఉండే సత్యాన్ని శృతి అని, ఆ పరిస్థితులకు సమయమునకు అనుగుణంగా ఉండే సత్యాన్ని స్మృతి అని అందురు. అందులనే సత్యం కూడా వ్యావహారిక సత్యం, ప్రాతిభాసిక సత్యం, పారమార్థిక సత్యం, అని మూడు విధములుగా ఉండును. ఉదాహరణకి సినిమా జరుగుతున్నపుడు సినిమాలో జరిగే విషయములు వ్యావహారిక సత్యం, సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించును అనేది వ్యావహారిక సత్యం, సూర్యుడు అసలు ఉదయించడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది, అందువలన రాత్రింబగళ్ళు ఏర్పడుతూ సూర్యుడు తిరుగు తున్నట్లుగా అనిపించటమే ప్రాతిభాసిక సత్యం. లేని దానిమీద ఆపాదించ బడినది ప్రాతిభాసిక సత్యం.
మసకమసక చీకట్లో ఉన్న త్రాడుని చూచి పాము (సర్పము) అని భ్రమపడి భయపడటము, లేదా తెలిసీ తెలియని వయసులో ఆయా సినిమాలో పాత్రలు అనుభవించే విషయములను సత్యమని భ్రమించుట ప్రాతిభాసిక సత్యం. అన్నివేళలా ఉండే సత్యాన్ని, పారమార్థిక సత్యం అందురు. సినిమా తెర ఎల్లవేళలా అనగా సినిమా జరగనపుడు, జరునపుడు, అయిపోయిన తరువాత కూడా తెల్లగా ఉండుట అనేది పారమార్థికసత్యము.
44 రకముల స్మృతులు ఉన్నవి.
మనుస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, పరాశరస్మృతి, మొదలగునవి ఆయా యుగధర్మములనుబట్టి, కాలమునుబట్టి ఆయా స్మృతులు ఏర్పడినవి. ఉదాహరణకి ఎండాకాలమున ఎక్కువ నీరు త్రాగుట అనేది సహజం, కానీ అదే చలి కాలము ఎక్కువ నీరు త్రాగ కుండుట అనేది సహజం. అన్ని కాలములకు ఒకే ఆరోగ్య ధర్మం పాటించము కదా. అదే విధముగా ఆయా యుగధర్మములను బట్టి, కాలమును బట్టి ఆయా స్మృతులుఏర్పడినవి. కలియుగములో ఆచరించునది పరాశరస్మృతి.
నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి అంటారు. అది ఎప్పుడు? స్త్రీకి చదువు రానప్పుడు, లోకజ్ఞానములేనప్పుడు, తన కాళ్ళ మీద తను నిలబడ గలిగే ఉద్యోగంలేనప్పుడు. స్త్రీ సహజంగా శారీరకంగా దుర్బలురాలు. ఆ మాటకొస్తే చిన్నపిల్లలు, వృద్ధులు కూడా శారీరకంగా దుర్బలులే కదా. అందువలన వారికి తగిన సహాయము చేయలెను. అసలు ఒకరి పై ఒకరు ఆధారపడక ఈ ప్రపంచంలో ఎవరైనా ఉండ గలరా?
అర్థనారీశ్వరుడు
ప్రతి ఆడవ్యక్తిలో ఎక్స్ క్రోమొజోమ్స్ (X chromozomes) ఉంటాయి. వై క్రోమొజోమ్స్ Y chromozomes) ఉంటాయి. అదే విధముగా ప్రతి మగవ్యక్తిలోను ఎక్స్ క్రోమొజోమ్స్ ఉంటాయి. వై క్రోమొజోమ్స్ ఉంటాయి. కనుక ప్రతి వ్యక్తి అర్థనారీశ్వరుడే.
అపుత్రస్య గతిర్నాస్తి
అపుత్రస్య గతిర్నాస్తి అనగా మగ పిల్లలు లేని వారికి ఊర్ద్వ గతులు లేవు అని. అందుకని పుత్రుడు కలిగేటంత వరకు పిల్లల్నికంటునే ఉందురు కొంతమంది. వైద్యశాస్త్రం ప్రకారము, పుట్టే బిడ్డ ఆడా మగా నిర్ణయించడమనేది బీజప్రదాతయైన మగవాడి మీదనే ఆధారపడి ఉండును. అయినా సరే స్త్రీ కారణమని హింసించటము సబబు కాదు కదా.
శ్రీవివేకానంద,శ్రీపరమహంసయోగానంద, ఆది శంకరాచార్యులవారు, మొదలగు వారు వివాహమే చేసుకొనలేదు. వారు పూజనీయులేగదా!
వివాహితులై, దంపతులైనప్పటికీ, శ్రీ శ్రీరామకృష్ణ పరమహంస, పరమపూజనీయ శ్రీ శారదాదేవి అమ్మలకు పిల్లలే లేరు గదా !
కనుక మగపిల్లలు లేనివారికి ఊర్ధ్వగతులు లేవు అనేది సమంజసము గాదు. ఈ అజ్ఞానానికి కారణము ఆధ్యాత్మిక న్యూనతే.
పెద్దచేప చిన్నచేప:
శక్తిని మనం సృష్టించలేము. నాశనం చేయలేము. కాని ఒక శక్తిని ఇంకొక శక్తి క్రింద మార్చ గలము. ఉదా : విద్యుత్ శక్తిని మనం ఫాన్ (table or ceiling fan) సహాయంతో యాంత్రిక శక్తిగా మార్చుకొని గాలిని పొందుతాము. టర్బైన్స్ (Turbines) సహాయముతో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకుంటాము. నదులు సముద్రములలో కలిసి నటుల చిన్నశక్తులు పెద్ద శక్తులతో కలిసి పోతాయి. అందువలన పెద్దచేప చిన్నచేపని మ్రింగటం అంటే పెద్దశక్తి చిన్నశక్తిని కబళించటమే. చివరికి మనంవాడే ఫోస్సిల్ ఫ్యూయల్ (fossil fuel) అనబడే ఈ బొగ్గుక్రూడ్ ఆయిల్  (Crude oil) గూడా ఒకప్పటి జీవులే.

మనస్సు

సర్వేజనాః సుఖినో భవంతు.
అనగా అందరూ సుఖంగా ఉండాలి. ఉన్నది ఒకే ఆకాశము. ఒకే అగ్ని. ఒకే జలము. వివిధ రకములైన ఆకాశములు, అగ్నిలు, జలములు లేవుగదా! మన సౌకర్యము కోసము ప్రకృతి సిద్ధమైన పరమాత్మ ప్రసాదమైన ఈ ఉన్న ఒకే ఆకాశము, ఒకే అగ్ని. ఒకే జలములను ఇంతవరకు నాది, ఇంతవరకు నీది అని విభజించుకొని కలవరబడుచున్నాము.
సుగంధము, దుర్గంధము ఎక్కడ ఉన్ననూ, క్రమంగా ఇంపు కంపులనూ సమానంగా పంచిబెట్టును. ఒక చోట భూకంపం (earth quake), తూఫాన్ (Cyclone), వగైరాలు వస్తే ప్రపంచం మొత్తం దాని  ఫలితములను అనుభవించక తప్పదు. అంతేగాదు, కేంద్రం (epicenter) ఏదైనా, భూకంపం వస్తే విడుదలైన “P” (waves) తరంగములు, “S” తరంగములు లేదా longitudinal waves మరియు horizontal waves సమతుల్యత (state of equilibrium) వచ్చేవరకు భూమిపై పొరలో (crest) సంకోచ వ్యాకోచములు చెందుతూ ఉండును.
అంతే కాదు, ఈ ఖగోళంలో ఏ సెలెస్టియల్ బాడీ (celestial body) అయినా మండినపుడు దాని ప్రభావం ఖగోళం మొత్తం మీద ఉంటుంది. అదేవిధంగా మనస్సు అనేది మొత్తం జగత్తుకు సంబంధించినది. విశ్వమనస్సులో భాగమే వ్యక్తమనస్సు. నీలోని భూకంపం, తూఫాన్, వగైరాలలాంటి మంచి లేదా చెడు ఆలోచనలు వస్తే ఎప్పటికైనా ఏదో ఒకరకముగా జగత్తుమీద వాటి వాటి ప్రభావం తప్పక చూపుతాయి. దీనికి కారణం వ్యక్తమనస్సే. దీనినే Ecological imbalance అందురు.
అయంనిజః పరోవేతి గణణా లఘుచేతసాం ఉదారచరితానాంతు వసుధైకకుటుంబకం
నీవు, నేను, నాది అని లెక్కించటము చిన్న మనస్సుల లక్షణం. ఈ ప్రపంచమే నాది, నా కుటుంబం అనేది పెద్ద మనస్సుల తత్వం.

ఆకర్షణ

పరస్పర ఆకర్షణవలననే ఈ గ్రహములు, వగైరాలు వాటివాటి కక్ష్యల్లో (orbits) తిరుగుచున్నవి. ప్రతి జీవి ఒక శక్తే. మనమందరం ఒకరికి ఒకరు ఆకర్షితులు కావాలన్నా కాకుండా ఉండాలన్నా మనలో ఉన్న ఆ శక్తే కారణము. ఈ శక్తులన్నీ ఒకే శక్తియొక్క వివిధ రూపములే. అందువలననే పరమాత్మయొక్క మాయాశక్తి కి ఆకర్షితులవ్వటానికి కారణము. మగ నిప్పు అని ఆడ నిప్పు లేదా మగ నీరు ఆడ నీరు అని ఉండదు. అదే విధంగా పరమాత్మయొక్క శుద్ధసత్వమాయ అనగా సృష్టి లోని దేవుణ్ణి నీవు ఆడ అనుకొనిన ఆడ లేదా మగ అనుకొనిన మగ. తండ్రి అనుకొనిన తండ్రి లేదా తల్లి అనుకొనిన తల్లి, బిడ్డ అనుకొనిన బిడ్డ. కాని అసలుకి ఆయన నిరాకార, నిర్గుణ, నిర్లింగ, సచ్చిదానందమూర్తి.

ధ్యానము ఎందుకుచేయాలి?

ఆకలి వేసినపుడు ఆహారంకావాలి. అదేవిధంగా శరీర సమతుల్యతకి ధ్యానం అవసరం. ఊహ వచ్చినప్పటినుంచి చచ్చిపోయేంత వరకు, శాంతిసౌఖ్యములకై, కుల మత విచక్షణ, వర్గ భేదం, వర్ణ భేదం, లింగ భేదం లేకుండా అందరూ చేయదగ్గది ధ్యానం. రోజులో ఎంతో కొంత సమయం, ఉదయం, సాయంత్రం, రాత్రి వెచ్చించి  ధ్యాన పద్ధతులు నేర్చుకొని అభ్యసించవలయును.

సృష్టి - ప్రళయం

ఒకటి అనేకం అవటంసృష్టి. అదే Big Bang Theory. . అదే బిందు విస్ఫోటనం. అనేకం మరల ఆ ఒక్కటిలో చేరటం ప్రళయం. నీటిలో పడవ ఉండవచ్చు. పడవలో నీరు ఉండకూడదు. అదే విధంగా సంసారంలో (నీరు) వ్యక్తి (పడవ) ఉండవచ్చు. వ్యక్తి (పడవ) లో సంసారం (నీరు) ఉండకూడదు. రోజూ బిడ్డని త్రిప్పు కొని వచ్చే పనిమనిషి డబ్బు తక్కువ ఇచ్చారని పనిమానివేసిన చందమున, సంసారం మీద అతి మోహం పనికి రాదు. నీవు అద్దె ఇంటిలో ఉంటున్న విధముగా, పరమాత్మ ఇంటిలో అద్దెకి ఉంటున్నట్లుగా భావించవలెను. ఈ ప్రపంచం అనే రంగ స్థలములో (drama stage), పరమాత్మ దర్శకుడి (God as Director) గా నాపాత్ర (Role) నేను పోషించటానికి వచ్చితిని అని భావించి, చక్కగా పరమాత్మ మెచ్చుకునేటట్లుగా పోషించాలి.
సర్వమూ పరమాత్మే
జ్ఞా0తకృత్ యజ్ఞగుహ్యం అన్నః అన్నాదఏవచ
విష్ణుసహస్ర నామం 130
విష్ణు సహస్ర నామంలో పరమాత్మ గురించి అన్నః అన్నాద ఏవ చ అని వస్తుంది.
అన్నము (ఆహారము), పరమాత్మే, అన్నము ఆరగించే వాడు కూడా పరమాత్మే.
అనగా ఆహారము శక్తి, ఆహారమును (ఆశక్తిని) ఆరగించేది కూడా శక్తే.

ఎంతవెచ్చించాలి ధ్యానము కొఱకు?

ఒక్కొక్క గ్రహములో ఒకే వస్తువు వివిధ రకములైన తూనిక తూగును.
దానికి కారణం ఆ గ్రహముయొక్క ఆకర్షణశక్తి. అనగా ఆ గ్రహముయొక్క ఆకర్షణ శక్తిని బట్టి బరువు ఆధారబడును. అటులనే విద్యా విషయములలో ప్రమాణములు గూడా ఆయా దేశ కాల పరిస్థితులను బట్టి హెచ్చు తగ్గులుగా ఉంటూఉంటాయి. అటులనే యుగధర్మములను బట్టి, వారివారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి, తెలివి తేటలు గాని, ధ్యానసిద్ధి గాని ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి ఒక్కొక్కడు 5 లేక 6 సంవత్సరముల వయసు లోనే సంగీత ప్రావీణ్యత, సైకిలు, మోటారుసైకిలు, కారు, వగైరాలు నడిపే ప్రావీణ్యత కలిగి ఉండును. ఈ ప్రావీణ్యత కలిగి ఉండుటకు కారణము వారివారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించియే. అనగా పూర్వ జన్మ కృషి ఫలితములే ఈ జన్మలో వారికి సహాయభూతముగా ఉంటూ ఉన్నవి. ఒక బండ పగలగొట్టటానికి 20దెబ్బలు అవసరమనుకుందాము. ఒకడు 18 దెబ్బలు కొట్టి విసిగి పోవును. మిగిలిన 2 సుత్తి దెబ్బలు కొట్టగానే ఆ బండ పగిలి పోవును. ఆ బండ పగలటానికి కారణము ఆ వ్యక్తియొక్క గొప్పతనము కాదు. ఆ బండ పగలడానికి కారణము దానికి కావలిసిన దెబ్బలు పడటమే. అటులనే క్రిందటి జన్మలలో బాగా కృషి చేసివచ్చిన వ్యక్తి ఈ జన్మలో స్వల్ప కృషితోనే పైకొస్తాడు. క్రిందటి జన్మలలో కృషి చేయని వ్యక్తి ఈజన్మలో ఇఛ్ఛా శక్తితో దృఢ నిశ్చయంతో కృషి చేసిన తప్పక ఫలితం సంక్రమించును. దాన్నే కర్మ అందురు. కనబడనిది కర్మ. ఆ కనబడని కర్మనే దైవం అందురు.
బుద్ధిః కర్మాణుసారిణీ అనుటకు కారణమిదే.
సాధారణ జీవితానికి దూరంగా త్రేతాయుగములో 14 సంవత్సరముల అరణ్యవాసము అనగా యోగసాధన, ద్వాపర యుగములో 12 + 1 = 13 సంవత్సరముల అరణ్యవాసము అనగా యోగసాధన యుగధర్మములను అనుసరించి వచ్చినవే. ఆ అరణ్యవాససమయములో యోగసాధనా ధ్యానమే వారు చేసినది. ప్రస్తుత కలియుగములో ఒక నియమిత కాలమును నిర్ణయించుకొని, ఉదయం, సాయంత్రం, రాత్రి ధ్యాననిమజ్ఞులై ఉండాలి. ఆవిధంగా కనీసం 10, 20, 30 నిమిషములు ఎంత సమయము చిక్కితే అంత, గ్రాహస్థాశ్రమధర్మములు నిర్వర్తించుకుంటూ, వీలు లేదా సమయము చిక్కినపుడల్లా టి. వి. ప్రోగ్రాములు, పోచికూలి ఖబుర్లు మానివేసి లేదా చాలా వరకు తగ్గించి, ధ్యానం చేస్తే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఔన్నత్యాన్ని సాధిస్తాడు మానవుడు. విద్యార్థులలో జ్ఞాపకశక్తి, పఠనాశక్తి, సృజనాత్మకత పెరుగును. పెద్దలయడ గౌరవము కూడా వృద్ధిచెందును. అంతేగాదు. ఉద్రేక పూరక స్వభావము తగ్గి శాంతం, సహనము వృద్ధి చెందును. కనుక ప్రస్తుత ప్రపంచములో ధ్యానం మరింత అవసరం.

మూడవనేత్రం

ధ్యానపరుడైన వ్యక్తికి స్థిరదృష్టి ఏర్పడినపుడు భ్రూమధ్యంలో కూటస్థంలో మూడవ కన్ను తెరుచుకొనును. ఆత్మజ్యోతి దర్శనం అగును. లేదా కుడి చెవులో ఓంకార నాదం వినబడును. ఐదు భుజములు ఉన్న నక్షత్రము సత్ అనగా పరమాత్మ. సృష్టికి అతీతమైన పరమాత్మ నీలం లేదా నలుపు సృష్టిలో ఉన్న భగవంతుడు. లేదా తత్ లేదా శుద్ధ సత్వమాయ. బంగారం రంగు వలయం ఓంకారము.

ఓం జెనెరేటర్ (ఓం)
పసుపు రంగు

సృష్టికి అతీతమైన
పరమాత్మ (సత్)
5 భుజములు కలిగిన
వెండి నక్షత్రం

సృష్టి లోని పరమాత్మ (తత్)
నీలం రంగు కృష్ణ చైతన్యం
 


















శబ్దం ఒక సెకనుకు 1140 అడుగులు ప్రయాణము చేయును. కాంతి కిరణము ఒక సెకనుకు 3 x 10x10x10x10x10x10 మీటర్లు ప్రయాణము చేయును. కనుక శబ్దం వినబడుతే శబ్దంలోను, కాంతి కనబడితే కాంతిలోనూ లయంఅవుతే పరమాత్మ దర్శనం అవుతుంది. ఏదేని పాట వినబడుతున్నపుడు ఆ శబ్దాన్ని అనుసరించి వెడితే ఆ పాట ఎక్కడినుండి వచ్చునో ఆ మూలము (source) తెలియవచ్చును. పరమాత్మ సృష్టిఫాక్టరీ (factory) నుండి  వచ్చే శబ్దమే ఓంకారము. కనుక ఆ ఓంకారశబ్దమును అనుసరించి వెళ్ళిన ఆ ఓంకార శబ్దమునకు మూలమైన పరమాత్మ దర్శనమగును.

మహాభారతము (గొప్ప వెలుగు)

మహాభారతము అనగా గొప్ప వెలుగు. స్థిరధ్యానమునకు ఎన్నో అనుకూల మరియు ప్రతికూల శక్తులు శరీరము లోపల బయట ఎదురగును. బయటి ప్రతికూల శక్తులను నిర్జన ప్రదేశములకు వెళ్ళి నిరోధించవచ్చును. కాని అంతఃశక్తులు నిర్జన ప్రదేశములకు వెళ్ళినంత మాత్రమున మనోఫలకముల నుండి చెరిగిపోవు.  
చంచలప్రాణం స్థిరప్రాణమయితే అది స్థిరమనస్సుకి దారి తీస్తుంది. ఆ నిశ్చలచిత్తము జీవన్ముక్తికి సోపానము. కనుక ప్రతి వ్యక్తి హనుమాన్ అవ్వాలి. హను అనగా చంపటం, మాన్ అనగా మనస్సుని. అనగా మనస్సుని స్థిరం చేయటమే హనుమాన్. మనస్సుని స్థిరం చేసుకొని బ్రహ్మ జ్ఞానముతో పండిపోయిన హనుమాన్ ఎఱ్ఱటి పెదవులు గల వాడయ్యెను. అందుకనే అహంకారం, భయం, సంస్కారాలు, రాగ ద్వేషములు మొత్తంగా అరి కట్టాలి. మహా భారతంలోని పాత్రలన్నీ ఈ అంతఃశక్తుల ప్రతీకలే. అర్జునుడు అనగా సాధకుడు అని అర్థం.


అర్జునుడు అనగా సాధకుడు ముందుగా తనలోని ఈ సాధనలో ముందుకు వెళ్ళగలనా లేదా అనే భయాన్ని అనగా భీష్ముణ్ణి చంపవలెను. భీష్ముడు భయానికి, అహంకారానికి ప్రతీక. విద్య మొదలు పెట్టుటకు ముందుగానే విద్యార్ధి ఉద్యోగం వచ్చునో లేదో అని భయపడి ఆలోచించి చదవకూడదు. ఉద్యోగం రానీ, రాకపోనీ అనేనిర్భయం విద్యార్ధికి అవసరం. ఆ తరువాత సంస్కారాల్ని, తనలో సంస్కారాల ప్రతీక అయిన ద్రోణుణ్ణి చంపాలి. సంస్కారాలు మంచివి అనగా బంగారు సంకెళ్ళు, చెడువి అనగా ఇనపసంకెళ్ళు, రెండూ చంపవలెను. చివరిగా రాగద్వేషాలు అనగా తనలోని కర్ణుణ్ణి చంపవలెను. కర్ణుడు రాగద్వేషాలకి ప్రతీక. ఎవరి ఇంట్లోనైనా వ్యక్తి చనిపోతే మనం అంత బాధపడము. ఆ వ్యక్తితో సన్నిహిత సంబంధము లేదు కనుక మనం అంత బాధపడము. అదే మన ఇంట్లో వ్యక్తి చనిపోతే మిక్కిలి బాధపడతాము. కారణము ఆ వ్యక్తితో ఉన్న సన్నిహిత సంబంధమువలననే. కనుక మనము బాధ పడటానికి, పడకపోవటానికి కారణము కేవలం మోహమే. కనుక సాధకుడు (ఇక్కడ అర్జునుడు), తనలోని భీష్ముణ్ణి (భయాన్ని), ఆతరువాత సంస్కారాల్ని (ద్రోణుణ్ణి), చివరిగా తనలోని రాగద్వేషాలను (కర్ణుణ్ణి) చంపుకోవలయును. అప్పుడు ఆత్మ జ్యోతి దర్శనమగును.
శబ్దము కంటే వెలుగు వేగము గనుక ఆ వెలుగులో లయమైతే గొప్ప వెలుగు (మహా భారతము)  కనబడుతుంది).  
గీత మొదటి శ్లోకము ధర్మ క్షేత్రే కురు క్షేత్రేఅనగా క్షేత్రే క్షేత్రే ధర్మకురు అనగా ప్రతి క్షేత్రంలోనూ ధర్మం అనగా యోగా ధ్యానం చేయమని చెప్పినది.

స్వధర్మ - పరధర్మ

శ్రేయాన్ స్వధర్మోవిగుణ: పరధర్మాత్ అనుష్టితాత్
                                        గీత 3 - 35
బిడ్డకి తల్లి పుట్టినప్పటినుంచి పాలు, సాత్వికాహారం, ఇచ్చి పెంచుతుంది. అంతే గాని, సారాయి, గుట్కా (పొగాకు) సిగరెట్ వగైరాలు ఇచ్చి పెంచదుకదా. ఎందుకంటే ఈ సారాయి, గుట్కా (పొగాకు), సిగరెట్ వగైరాలు సహజమైన ఆహారం కాదు కనుక. అదే విధముగా ఇంద్రియధర్మములు అనుసరించుట అనునది పరధర్మం. కత్తిని కూరగాయలు కోసుకోవటానికి ఉపయోగించటం అనేది అవసరము ధర్మ బద్ధము. కత్తిని హత్య చేయటానికి ఉపయోగించటం అనేది అనవసరము, అధర్మబద్ధము. అదే విధముగా ఇంద్రియములు కూడా ధర్మబద్ధముగా ఉపయోగించుటకు మాత్రమే ఉన్నవి. అధర్మబద్ధముగా ఉపయోగిస్తే వాటి దుష్ఫలితములు జన్మ జన్మకీ అనుభవించక తప్పదు. ఆత్మ ధర్మము పాటిస్తే సత్ఫలితము. ఇంద్రియధర్మము అధర్మంగా ఉపయోగిస్తే దుష్ఫలితము. కనుక ఆత్మధర్మమే అనగా స్వధర్మమే ఆచరిందపగినది. పరధర్మము అనగా ఇంద్రియధర్మము భయావహము.

భగవద్గీత

భగవద్గీత కలియుగమునకు 38 సంవత్సరముల పూర్వము, ద్వాపరయుగాంతమున  బోధించబడినది.
గీత బోధించబడిన సమయములో శ్రీకృష్ణుని వయసు షుమారుగా 87 సంవత్సరములు.
శ్రీకృష్ణుని అవతారకాలము ఉపాధి వయస్సు షుమారుగా 125 సంవత్సరముల 8 నెలలు.
గీతలో మొదటి శ్లోకము మొదటి పాదము మొదటి అక్షరము ర్మక్షేత్రే కురు క్షేత్రే
గీతలో ఆఖరి శ్లోకము ఆఖరి పాదము ధృవా నీతిర్ మతిర్ మ
గీతలో మొదటి శ్లోకము మొదటి పాదము మొదటిఅక్షరము
గీతలో ఆఖరి శ్లోకము ఆఖరి పాదము ఆఖరిఅక్షరము మ.
మొదటి శ్లోకము మొదటి పాదము మొదటి అక్షరము ,
ఆఖరి శ్లోకము ఆఖరి పాదము ఆఖరి అక్షరము
కలిపితే ధమ అనగా ధర్మము అని అర్థం. అనగా గీత మొత్తం ధర్మబోధే.
గీతా ని తిరగరాస్తే తాగీ అనగా త్యాగం అని అర్థం.
మల, విక్షేపణ, ఆవరణ దోషములు త్యాగం చేయమని అర్థం.
18  అనే సంఖ్య గీతలో చాలా ముఖ్యమైనది.
గీతలోని అధ్యాయములు 18
మహాభారత యుద్ధంజరిగినది 18 రోజులు
మొత్తం కౌరవ + పాండవసేన = 11 + 07 = 18 అక్షౌహిణీలు
 మహాభారత పర్వములు 18

అక్షౌహిణీ  అనగా
ఏనుగులు 21870   2+1+8+7+0 = 18
రథములు 21870   2+1+8+7+0 = 18
గుఱ్ఱములు 68610   6 + 8+ 6+ 1+ 0 = 18
నేలమీద యుద్ధ చేసే సైనికులు 109350   1+ 0+ 9+ 3+ 5+ 0 = 18

బ్రహ్మ జ్ఞానులు

దిగంబరోపివాచసాంబరోవాత్వగంబరోపివాచిదంబరస్థః ఉన్మత్తద్వాపిచబాలవద్వాపిశాచవద్వాపిచరత్యవన్యామ్
చిదాకాశమున సదా విహరించు జ్ఞానస్వరూపియగు జీవన్ముక్తుడు దిక్కులే వస్త్రములుగా గలవాడై గాని, వస్త్రధారియై గాని, చర్మధారియై గాని, పిచ్చివానివలె గాని, బాలునివలె గాని, పిశాచమువలె గాని భూమియందు సంచరించుచున్నాడు.
పరా పశ్యంతి ప్రియా, వైఖరి
పరావాక్ మూలచక్రస్థః పశ్యంతి నాభిసంస్థితః హృదిస్థా మధ్యమా జ్ఞేయా వైఖరీ కంఠదేశగా
 పరావాక్కు మూలాధారంలోను, పశ్యంతి వాక్కు మణిపురంలోను, మధ్యమావాక్కు అనాహతచక్రంలోను, విశుద్ధచక్రంలో వైఖరీవాక్కు ఉండును.
భగవాన్ ఆపస్తంభ సూత్రము
అసంగోశబ్దోశరీరో స్పర్శశ్చ మహాన్ శుచిః
అవయవరహితుడైనందుననూ, శబ్దస్పర్శాదిగుణములు లేనందుననూ, సూక్ష్మాతి సూక్ష్మమై యుండుటచేతనూ, తర్కము చేత తెలియబడువాడు కానందుననూ, భగ అనగా ఐశ్వర్యం, బలం, కీర్తి, సంపద, జ్ఞానం, వైరాగ్యం, అనే ఆరు గుణములు ఆపాదించ బడిన వాడునూ అయి భగవంతుడు అని పిలవబడుతున్నాడు.


కృతేతు మానవాధర్మాః త్రేతాయాం గౌతమస్మృతాః ద్వాపరేశంఖలిఖితాః కలౌ పరాశరాఃస్మృతాః
కృతయుగంలో మనుస్మృతి, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపర యుగంలో శంఖస్మృతి, కలియుగంలో పరాశరస్మృతి అనుసరించెదరు.
అంధేతమసి మజ్జంతి పశుభిర్యేయజంతితే హింసానామభవేద్ధర్మో నభూతో నభవిష్యతి.
ఎవరైనా జంతువులను వధించి బలి పూజాది కర్మలు చేయుదురేని, అంధ తమస్సగు నరకములో పడుదురు. ప్రాణి హింస భూత, భవిష్యత్, వర్తమానములలో గూడా మహాచెడ్డ అధర్మమగునే గాని ధర్మము కానే కాదు.

కొన్ని గూడార్థములు

1) వైకుంఠం: పంచభూతములను సమ్మేళనము చేయగల శక్తి గలది.
2) మూషిక వాహనం: నీలోని తామసగుణాన్ని అణగ ద్రొక్కుము లేదా
 విడిచి పెట్టుము.
3) పులివాహనం: నీ లోని అహంకారాన్ని విసర్జించుము.
4) నందివాహనం: జ్ఞానస్వరూపమునకు గుర్తు.
5) హంస: హంస పాలు, నీళ్ళు వేరుచేయునట్లుగా, మంచి, చెడు అర్థం చేసి కొని ప్రవర్తించుము.
ఒక శ్వాస + నిశ్వాస = హంస
6) గరుడ: జ్ఞానారూఢుడివి అవ్వు.
7) భాగవతమ్: భ భక్తి, గ జ్ఞా న, వ వైరాగ్యమ్, త తత్త్వజ్ఞాన, మ్ ముక్తి
8) సింహం: మూడు సంవత్సరములకు ఒకసారి రతిలో పాల్గొనును. కామమును వశములో ఉంచుకొనుము.
9) ఏనుగు: నిశితదృష్టి, శుద్ధ శాఖాహారి, బలమైనది.
10) నారద: నారం జ్ఞా నం దదాతి ఇతి నారద: విస్తారమైన జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, శరీరము లేని  అంతరాత్మ.
పరమాత్మనాటకము. .
కంటిలో నలుపు, తెలుపు రెండూ అవసరమే. కన్ను పూర్తిగా నల్లగా ఉన్ననూ చూడలేము. కన్ను పూర్తిగా తెల్లగా ఉన్ననూ చూడలేము కనుక కంటిలో నలుపు, తెలుపు రెండూ అవసరమే. సంసారంలో దుఖము (నలుపు), సుఖము (తెలుపు) రెండూ అవసరమే. లేకపోతే పరమాత్మ నాటకం రక్తి కట్టదు.
కుంతి కర్ణుడు
యోగేన నాభిందృష్ట్వా అని వ్యాస మహాభారతంలో ఉన్నది.
మహాభారతంలోని పాత్రలు అన్నీ వేదాంతానికి చిహ్నములు. (Esoteric symbols). మహాభారతంలో దూర్వాసమహర్షి (కోపంఎక్కువ) కుంతీదేవికి ఒక మంత్రం ఉపదేశించును. కుంతీదేవి ఈ మంత్రము పని చేయునో లేదో అని పరీక్ష జేయదలుచును.
కుంతీదేవి వైరాగ్యానికి ప్రతీక. వైరాగ్యానికి ప్రతీక అయిన కుంతీదేవి పరీక్ష జేయదలచినది కనుక ఆమె వైరాగ్యము ఆ సమయములో క్షీణించినది. ఆ సమయములో ఆమె మంత్రంతో ప్రార్థించుటవలన సూర్య భగవానుడు అనగా పరమాత్మచైతన్యం సంసార చక్రములలో ప్రధానమైన నాభి వెనకాల ఉన్న మణిపూరచక్రములో చూచును.. వెలుగులేనిది అన్నం వండలేని విధంగా అన్ని పనులూ పరమాత్మ చైతన్యంయొక్క సాక్షీభూతంతోనే చేయబడతాయి. మణిపూరచక్రము ఆత్మనిగ్రహ శక్తికి ప్రతీక. కనుక కుంతీదేవికి ఆత్మనిగ్రహశక్తి క్షీణించును ఆ సమయములో. వైరాగ్యవంతుడైన సాధకునికి ఆత్మనిగ్రహ శక్తి క్షీణించిన యడల రాగద్వేషములకు తావునిచ్చును. కర్ణుడు రాగద్వేషములకు ప్రతీక. కనుక రాగద్వేషములకు ప్రతీక అయిన కర్ణుడు పుట్టెను.
కనుక సాధకుడు సాధన కడు జాగరూకతతో చేయవలయును.

ఆత్మావబోధ

ఆలోచనలు మనకి బైటనుంచి వచ్చును. ఆత్మావబోధ లోపలినుండి వచ్చును. ఒకడు మంచి పుస్తకము చదువుచున్నపుడు, ఆ పుస్తకము, ఆ పుస్తకములోని విషయము, ఆ పుస్తకము చదువుచున్న మనిషి ఒకటి అగును. ఆ సమయములో ఆ గదిలోనికి ఎవరు వచ్చుచున్నారో, ఎవరు బయటికి వెళ్ళుచున్నారో కళ్ళు చూచుచున్నా, చూడక పోయినా గమనించవు. గమనించినా గుర్తించలేవు. అదేవిధముగా పరమాత్మ మీద ఆధారపడి, పరమాత్మతో తాదాత్మ్యం జెందియున్న బ్రహ్మవద్వరీయులు కేవలం పరమాత్మ కొఱకే సంసారంలో ఉండెదరు. అట్టి స్థితిలో వారు ఏమి చేసినా, వ్రాసినా, తింటున్నా, నడుస్తున్నా, పరిగెత్తుతున్నా అంతా ఆ పరమాత్మే అనుకుంటారు. యోగిరాజు, క్రియాయోగ ప్రదాతలు అయిన శ్రీశ్రీలాహిరీమహాశయమహారాజ్ కేవలం శాఖాహారి. ఆయనను ఒక భక్తుడు ఇంటికి పిలిచి భోజనం పెట్టినపుడు చేపలు వండిపెడతాడు. పరమాత్మ చైతన్య  మత్తులో ఎల్లవేళలా ఉండే శ్రీ శ్రీ లాహిరీ మహాశయ మహారాజ్ అనాలోచితంగా తిన్నారు. మరియొక భక్తుడు గూడా వండి పెడితే శ్రీ శ్రీ లాహిరీ మహాశయ మహారాజ్ కోపగించుకొని మందలించారు. మన ఇతి హాసములలో కొన్ని చోట్ల కవి రూపంలోనున్న యోగి తను వ్రాస్తున్న కవితలో సరియైన పదములు తట్టక స్నానము లేదా వాహ్యాళి నుండి తిరిగి వచ్చుసరికి ఆయా పదములు లేదా పాదములు వ్రాసియుండుటను జూసి అశ్చర్యచకితులై అక్కడే ఉన్న భార్య, పిల్లలు, శిష్యులు మొదలగువారిని అడిగితే మీరేగదా ఇప్పుడు వచ్చి వ్రాసి వెళ్ళారు అంటారు. అనగా ఆత్మావబోధవలన తట్టిన పదములను, పాదాలను, తనకు తానుగానే వచ్చి పరమాత్మ చైతన్య మత్తులోఉండి వ్రాసే మహానుభావులకు మామూలు స్థితి వచ్చే సరికి తానే వచ్చి వ్రాసి వెళ్ళానంటే నమ్మలేరు. అనగా ఆత్మావబోధ అంత గొప్పది. ఎందుకంటే అది పరమాత్మ చైతన్యము తప్ప వేరే గాదుగనుక. న్యూటన్ కనిపెట్టిన భూమ్యాకర్షణ సిద్ధాంతం (law of gravity) ఐన్స్టీన్ కనిపెట్టిన తారతమ్య సిద్ధాంతం (theory of relativity) ఆత్మావబోధవలన కలిగినవే.
యోగాయనమ్
శ్రీరాముడు (పరమాత్మ చైతన్యం) దూరంగా ఉన్నప్పుడు, చివరకు ఆదిశేషు (మూలాధారశక్తి) లక్ష్మణుడు కూడా దూరమై, పెద్దనోట్లు ఖర్చు అయిన తరువాత చిల్లర డబ్బులమీద ఆధారపడే వ్యక్తి లాగా, కుండలినీశక్తిని (సీతాదేవి) జటాయువు (జటలు శిరస్సులో ఉంటాయి అనగా శిరస్సులోఉండే ఓజఃశక్తి) రక్షింపజూస్తుంది.  ఆ ఓజఃశక్తి కూడా ఖర్చు అయి నిస్సహాయంగా అనగా రెక్కలు విరిగిన పక్షిలాగా కూలిపోతుంది. అనగా ఆ ఓజఃశక్తి కూడా క్షీణిస్తుంది.  అప్పుడు కుండలినీశక్తి (సీతాదేవి) అహంకారానికి ప్రతీక అయిన రావణుని అధీనంలో ఉండి పరమాత్మకై (శ్రీరామునికై) నిరీక్షించటం సీతాపహరణం కథ.
మంథర (మన్ ధర) అనగా అనిశ్చయాత్మకమైన మనస్సుని ధరించిన కైకేయి (కోరికలు), సు(మంచి) మిత్ర (స్నేహితుడు) మరియు కౌశల్య (మంచి సలహాలు ఇచ్చే)ల సాహచర్యము వలన (కోరికలు అదుపులో ఉంటూ వచ్చాయి.  కాని అనిశ్చయాత్మకమైన మనస్సు (మంథర) వలన నిశ్చయాత్మకమైన బుద్ధి (దశరథ అనగా 10 ఇంద్రియముల నాయకుడు) మాట వినక పరిపూర్ణ పక్వతచెందని సాధకునికి (భరతునికి) పట్టం అనగా అధికారము ఇవ్వమంటుంది. పరమాత్మ శ్రీరాముడు త్రేతాయుగ ధర్మాన్ని అనుసరించి 14 సంవత్సరముల యోగాభ్యాసధ్యానము తరువాత (భరతునికి) దర్శనము ఇస్తానంటాడు. అదే శ్రీరామ అరణ్యవాసము. కైకేయి (కోరికలు) బుద్ధి (దశరథ అనగా 10 ఇంద్రియముల నాయకుడు) మాట వినకపోవటమే దశరథ (బుద్ధి) నిర్యాణము.
మాయ (ప్రకృతి/సీతాదేవి) సాధారణ మానవునికి చావదు. ఇది చూపటమే సీతాదేవి (మాయ/ప్రకృతి) అగ్నిప్రవేశ ఘట్టం.  అగ్ని యథాతథంగా  అయోనిజని (సీతాదేవి/మాయ/ప్రకృతి) అగ్నినుండి బయటికి తీసుకురావటము. ఏ యోనినుండి పుట్టినది కానిది అయోనిజ. అయోనిజ కేవలము పరమాత్మ అధీనము.  పరమాత్మ అధీనములో మాత్రమే మాయ పనిజేస్తుంది.

హిరణ్యకశిపు మరియు హిరణ్యాక్ష వధలలో ఉద్దేశ్యం    అహంకారంతో మ్రగ్గుతున్న సాధకునికి నీవు నరుడివికావు, సింహానివి అని తెలియజెప్పటం. నరుడు సింహావతారమెత్తి అనగా నరసింహావతారం ఎత్తి, సింహ (గట్టి) ప్రయత్నం చేస్తే అహంకారంనుండి బయటికి రాగలవు అని ఉద్భోధించటము హిరణ్యకశిపు మరియు హిరణ్యాక్షవధలలో (స్థూలశరీర  నిర్మూలనము/బ్రహ్మగ్రంథి ఛేదన) ఉద్దేశ్యం. సంసారంలో (నీటిలో) మునిగిపోయి ధ్యానసాధనలో సాధకుని పృథ్వీతత్వాన్ని (మూలాధారం) అనగా ప్రారంభప్రయత్నాన్ని జ్ఞానదంతములతో సంసారం (నీరు) లో నుండి పైకి తీసుకువచ్చి వ(వరిష్ఠమైన) రాహ (రాస్తా లేదా త్రోవ) లోకి తీసుకు వెళ్ళటమే వరాహ అవతార ఉద్దేశ్యం మరియు హిరణ్యాక్ష (సంసారకన్ను) వధ.  
అహంకార కామ మత్తులో ఉన్నరావణుని, కుంభం లాగించి నిద్రమత్తుతో ఉన్న కుంభకర్ణుల (సూక్ష్మశరీర నిర్మూలన/రుద్రగ్రంథి ఛేదన) వధ గావించి ధ్యానసాధనలో ముందుకి పంపించుటయే శ్రీరామావతార ఉద్దేశ్యం. 
మిగిలిన శిశువు లాంటి అమాయకత్వం) ఉన్న శిశుపాలుడు (శిశు అనగా చిన్నపిల్లవాడు), మరియు దంతావక్తృడు (దంతా అనగా దంతాలువచ్చే శిశు అనగా చిన్నపిల్లవాడు) యొక్క వధ (కారణశరీర నిర్మూలన/విష్ణుగ్రంథిఛేదన) లలో శ్రీకృష్ణావతారం ఉద్దేశ్యం.  

ఆఖరి మాట

మానవజన్మ, ముముక్షత్వం, మహాపురుష దర్శనం దుర్లభమైనవి. ఈరోజు కాకపోయినా రేపైనా మనం ఎంత తిరిగినా స్వంత ఇంటికి చేరితేనే హాయి. మన స్వంత ఇల్లు పరమాత్మ. ఇంకొక శరీరంలో అనగా పశు, పక్ష్యాదులలో ఇది సాధ్యము కాదు. దేవతలైనా మానవజన్మ ఎత్తవలసినదే ముక్తికొఱకై. కనుక ధ్యానంచెయ్యండి. ధ్యానంచేయండి.
                                 హరి ఓం తత్ సత్


Comments

Post a Comment

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana