క్రియాయోగము

   





పరమాత్మే ఆదిపురుషుడు. పరాప్రకృతిని కలిగియున్నాడు. పరాప్రకృతియే రాధ.ప్రత్యేకముగా కనబడు ప్రతి జీవాత్మయు ఆ పరమాత్మే.
కర్మను అనుసరించి జన్మ వచ్చును. గ్రహ రాశులు మనిషికి తన కర్మ ప్రకారము అంగీకృతమయినప్పుడు, సూక్ష్మశరీరము మాతృయోనియందు ప్రవేశించి, స్థూలశరీర నిర్మాణమునకు ఉపయుక్తమగును.
మరణము అనగా స్థూలసూక్మశరీరములు రెండును జన్మ కారణమయిన ప్రారబ్ధకర్మ పూర్తిఅగుటతో విడిపోవుట.
మానవుడు సజీవముగా ఉన్నప్పుడే చైతన్య స్ఫూర్తితో శరీరమును ఆత్మను వేరుచేయు స్థితికి చేరుకున్నచో మరణము బాధించదు.  కాని ఇట్టి స్థితికి చేరుకొనుటకు క్రమము తప్పని దృఢమైన నిశ్చయముతో చేయు ధ్యానము అవసరము. సద్గురువు కృపవలన మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, మరియు ఆజ్ఞా చక్రములున్న మేరుదండమును శుద్ధము చేసి సాధకునిలోని సహజముగనున్న అనంతమయిన శక్తిని ప్రజ్వరిల్లజేయవలయును. దీనివలన సాధకునికి 1)జ్యోతిదర్శనము, 2)శబ్దము, మరియు 3) ప్రకంపనములు కలుగును.అప్పుడు కుండలినీ శక్తి ఉత్తెజించబడి ఆరుచక్రములలోను పరిభ్రమించబడి మెదడునకు చేరును. అప్పుడు సాధకుడు దైవశక్తియుతుడు అగును.    
క్రియాయోగములో మహాముద్ర, క్రియ, మరియు జ్యోతి ముద్రఅని మూడు ముఖ్య విషయములు, హంస, ఓం, మొదలగు ఉపప్రక్రియలు ఉంటాయి.
మహాముద్ర మేరుదండమును సరిచేయుటకు, ఆయస్కాంతీకరణము చేయుటకు ఉపయోగ పడుతుంది.  
 మితాహారము వలననూ, రోగము లేకుండానూ, ఉన్నప్పుడు, మరియు సౌరశక్తి వలననూ పొందగలిగే ఒక సంవత్సర శక్తిని, శారీరక మరియు మానసిక మార్పులను, సాధకుడు ప్రాణశక్తిని మేరు బ్రహ్మదండి చుట్టి వచ్చే ఒక క్రియ ద్వారా సాధించవచ్చు.
ఇదా పింగళ మరియు సుషుమ్నాల కలయికని లేదా కూటస్థ చైతన్యమును కేంద్రీకరించి జ్యోతి దర్శనమునకు ఉపయోగకారి జ్యోతిముద్ర.
హఠయోగము అనగా సూర్యచంద్రుల కలయిక. దీనినే ప్రాణ అపాన వాయువుల కలయిక అంటారు. హఠయోగములో ప్రాణాయామము, ఆసనములు, బంధములు, మరియు ముద్రల ద్వారా శరీరము వశములో ఉండును.
రాజయోగము అనగా మనస్సును వశపరచుకొనుట. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానము మరియు సమాధి అను ఎనిమిది అంగములు గలది. ప్రత్యాహారము అనగా ఇంద్రియములను వశపరచుకొనుట. ధారణ అనగా ఏకాగ్రత. ప్రాణాయామము రాజయోగములో ప్రధానమయినది. దీనివలన హృదయ స్పందన, నాడీ స్పందన, మనస్సు, మరియు ప్రాణశక్తి వశమునండు ఉండును.
మంత్రయోగములోని శబ్దములు ఆత్మ పరమాత్మల కలయికకి దోహదపడును.
లయయోగము అనగా పూర్తిగా మనస్సును వస్తువుమీద లగ్నము చేయుట. క్రియాయోగ సాధనమయిన ఒక పధ్ధతి ద్వారా మనస్సు ఓంకార శబ్దమున లయమగును.
జపయోగముకూడా క్రియాయోగము యొక్క అంతర్భాగమే. క్రియాయోగము అన్నియోగముల సారము.
క్రియాయోగముద్వారా షట్ చక్రములయందు నిక్షిప్తమైయున్న గ్రహములయొక్క నక్షత్రములయొక్క దుష్ఫలితములనుండి విముక్తుడగుటకు దారి లభ్యమగును.
క్రియాయోగము – జ్యోతిష్యము
ఒక్కొక్క చక్రము ఒక్కొక్క గ్రహమునకు ప్రతీక. రాహు కేతువులు ఛాయా గ్రహములు. వాటికి ప్రత్యెక స్థానములు లేవు.
మూలాధార – శనిస్థానము
స్వాధిష్ఠాన –గురుస్థానము
మణిపుర – కుజస్థానము
అనాహత –  చంద్రస్థానము
విశుద్ధఆజ్ఞా    శుక్రస్థానము
ఆజ్ఞా చక్రము బుధస్థానము
సహస్రారము    రవిస్థానము
మన శరీరములో 72,000 సూక్ష్మనాడులు ఉన్నవి. వాటిలో ఇడా పింగళ సుషుమ్న అనే మూడు సూక్ష్మనాడులు ముఖ్యమైనవి. ఇడా సూక్ష్మనాడి మేరుదండమునకు ఎడమప్రక్కన,  పింగళ సూక్ష్మనాడి మేరుదండమునకు కుడిప్రక్కన, మరియు సుషుమ్న సూక్ష్మనాడి మేరుదండములో ఈ రెండింటి మధ్యలోనూ ఉపస్థితమయి ఉన్నవి. ఇడా పింగళ సుషుమ్న అనే మూడు సూక్ష్మనాడులు మూలాధారమునుండి ఆజ్ఞా చక్రము అనగా కూటస్థము వఱకు కలిసి ఉంటాయి. ఆజ్ఞా చక్రము అనగా కూటస్థమునుండి సహస్రార చక్రము వఱకు సుషుమ్న సూక్ష్మనాడి మాత్రమె ముందుకు సాగును.
ఇడా సూక్ష్మనాడి నకారాత్మక క్రియలకు(negative), పింగళ సూక్ష్మనాడి సకారాత్మక క్రియలకు(Positive), మరియు సుషుమ్న సూక్ష్మనాడి  తటస్థ(Neutral) క్రియలకు ప్రతీకలు.
సాధకుని లక్ష్యముమూలాధారచక్రము క్రింద ఉన్న కుండలినీశక్తిని తన సాధనతో సుషుమ్న సూక్ష్మనాడిద్వారా  సహస్రారచక్రమునకు చేర్చుట. అందుకు విరుద్ధముగా ఇడా సూక్ష్మనాడివయిపు గానీ లేదా పింగళ సూక్ష్మనాడి వయిపు గానీ కుండలినీశక్తిని పంపగూడదు. పంపినయడల  ధ్యానసమయమున సాధకుడు విపరీతస్వభావమును పొందును. ఉదాహరణకి అనాహత చక్రమున ఇడా సూక్ష్మనాడివయిపు కుండలినీశక్తి నడిచిన ద్వేషము, పింగళ సూక్ష్మనాడివయిపు కుండలినీశక్తి నడిచిన అతిప్రేమ లేదా మోహము, సాధకుడు పొందును. కుండలినీశక్తి అనాహత చక్రమున సుషుమ్న సూక్ష్మ నాడిద్వారా నడిచిన ద్వేషము గాని లేదా అతిప్రేమ లేదా మోహము, సాధకుడు పొందడు. తటస్థముగా ఉండును.     
      

సూర్యనాడి--చంద్రనాడి

చంద్రనాడి ఎడమ ముక్కులోనూ, సూర్యనాడి కుడిముక్కులోనూ ఉండును. ఈ నాడులను స్వరములు అని కూడా అందురు.
ఆది మంగళ గురు(కృష్ణపక్షము) మరియు శని(ఉదయము) వారములలో సూర్యనాడి ఉండటము యుక్తము.
సోమ బుధ గురు(శుక్లపక్షము) శుక్ర మరియు శని(రాత్రి) వారములలో చంద్రనాడి ఉండటము యుక్తము.
లేనియడల వ్యతిరేక ఫలితములు అనగా గృహ కలహములు కార్యహాని వ్యర్ధప్రయాణములు మరియు అనారోగ్యములు కలగవచ్చును.
యోగదండము ఎడమ చంకలో పెట్టుకొని గట్టిగా వత్తితే లేదా చదునైన బల్లమీద లేదా నేలమీద ఎడమ చేతిమీద పడుకున్నను కూడా కుడిముక్కునకు స్వరము/నాడిమారును. అనగా చంద్రనాడినుండి సూర్యనాడికి స్వరము మారును.
అదేవిధముగా యోగదండము కుడి చంకలో పెట్టుకొని గట్టిగా వత్తితే లేదా చదునైన బల్లమీద లేదా నేలమీద కుడి చేతిమీద పడుకున్నను కూడా ఎడమ ముక్కునకు స్వరము/నాడి మారును. అనగా సూర్యనాడి నుండి చంద్రనాడికి స్వరము మారును.
వ్యష్టిలోని కుండలినీశక్తిని సమిష్టిలో మాయ అందురు. ఋషులు కుండలినీశక్తి ఈ సృష్టి స్థితి లయలకు కారణమని కనిపెట్టారు. ప్రతిచరాచర అణువులోనూ ఈశక్తి ఉన్నది. 
ప్రతి జీవకణములోనూ ప్రాణశక్తి జెనెసు రూపములో నిక్షిప్తమై ఉన్నది. ఈ జెనె క్రోమోజోమ్లో ఉన్నది. ప్రాణశక్తి కలిగిన జెనెసు వంశపారంపర్యముగా వచ్చే లక్షణములను మోసే వాహికలు. ఈక్రోమోజోములో DNA అనే మాలిక్యూలు అతి ముఖ్యమైనది. ఈ అతి ముఖ్యమైన డి ఎన్ ఎ. లో ఉండే ఆరు రకాల ఆమ్లములను సమన్వయపరిస్తే వ్యాధి ముసలితనములనుండి విముక్తులము అవ్వచ్చు.
మనుష్యులందరిలోనూ 99.9%జెనెస్ ఒకేరీతిలో ఉంటాయి.ఈమిగిలిన 0.01% వైవిధ్యమైన జెనెస్ వలననే వివిధ రకములైన లక్షణములు కలిగిన వ్యక్తుల పుట్టుకకు కారణము.
క్రియాయోగము దైనందిన కార్యక్రమములకు దాదాపు 40వేల ప్రొటీన్స్ అవసరము. ప్రొటీన్సు వృద్ధిచేసికొని తద్వారా వ్యాధి ముసలితనములను త్వరగా దగ్గిరకి చేరనీయకుండా క్రియాయోగము సహాయ పడుతుంది. జీవకణములకు వాటి సంబంధిత కాలేయము లేదా ఊపిరితిత్తులులాంటి అవయవములకు సమన్వయత లోపించడమే రోగములకు కారణము.  జెనెసు మాత్రమే వీటిని తిరిగి ఆరొగ్యవంతము చేయగలవు. అవసరము మేరకు ఈ జెనెసుకి కావలిసిన ప్రేరణని ఇవ్వటము ఇవ్వకపోవటము తద్వారా రోగగ్రస్థ జీవకణములకు వాటి సంబంధిత కాలేయము లేదా ఊపిరితిత్తులు లాంటి అవయవములకు సమన్వయత కలగచేయటము క్రియాయోగముద్వారా సుసాధ్యము.
 హైడ్రొజెను బాంబు అనేది ఫ్యూజను అనే పద్ధతి మీద ఆధార పడిచేసినది. బాహ్య కుంభకము హైడ్రొజెను బాంబు అనగా ఫ్యూజను లాంటిది. రోగగ్రస్థ జీవకణములను బాహ్య కుంభకము ద్వారా తగ్గించవచ్చు. ఆటంబాంబు అనేది ఫిజను అనే పద్ధతిమీద ఆధారపడి చేసినది.
అంతః కుంభకము ఆటంబాంబు అనగా ఫిజను లాంటిది. ఆరోగ్యమైన జీవకణములను అంతః కుంభకము ద్వారా వృద్ధి చేయవచ్చు. ఫ్యూజను (హైడ్రొజెను బాంబు) అనగా బాహ్య కుంభకములో జీవకణమును బయటనే వదిలి శక్తి పుట్టించబడుతుంది.   ఫిజను (ఆటంబాంబ్) అనగా అంతః కుంభకముతో జీవకణమును కూటస్థములోని ఆజ్ఞా(+)చక్రములో కుదించి శక్తి పుట్టించ బడుతుంది. 
ప్రతి జీవకణము మనిషి ప్రతిరూపమే. ప్రతి జీవకణము లోపల జెనె, జెనెలోపల క్రోమొజోమ్,  క్రోమొజోమ్ లోపల డి ఎన్ ఎ ఉంటుంది.  డి ఎన్ ఎ మాలిక్యూల్  జీవకణము లో అతి ముఖ్యమైనది. ప్రతి జీవకణము కూడా పోషక పదార్థములను, జెనెసు మరియు యన్జైమ్సు(enzymes)   మొదలగు వాటిని నిర్మించ గలదు. జెనెసు వంశ పారంపర్య లక్షణములను తెలియచెప్తుంది. హార్మోన్సు అనేవి ఈ జెనేసుకి అవసరమైన ప్రేరణ కలగచేసి శరీర ఆరోగ్యమునకు దోహద పడతాయి. వేలసంఖ్యలో ఉన్న వ్యాధి కారకమైన జెనెసులో కేవలము 100కు దాదాపుగా ఇప్పటికి కనుగొనటమైనది. మిగిలిన వ్యాధి కారకమైన జెనెసును కనుగొనటకు చాలా సమయము పట్టవచ్చు. యోగాభ్యాసములోని చక్రధ్యానము చక్రములలో బీజాక్షర ధ్యానము క్రియాయోగము మొదలగు వాటిద్వారా నిత్యము శరీరమునకు కావలిసిన 40-50 వేల పోషక పదార్థములను వృద్ధి చేసికొని చిరకాలము ఆరోగ్యముగా ఆనందముగా నిత్య యౌవ్వనములో ఉండవచ్చు.   ఇంద్రియములను అవసరానికి మించి ఉపయోగించటము ద్వారా జీవకణములో ఉండే తియ్యటి సోమరసమును మనిషి అనుభవించ జాలడు. 
ప్రతి జీవకణములోనూ ఆరు ఆమ్లములు (Deoxy adenylic, guanylic, Ribosy & cytedylic acids, thymidylic & phosphoric acids) మరియు తియ్యదనము అనేవి ఉంటాయి. చక్రములలో ఓంకార ధ్యానము చేస్తూ చివరికి సహస్రారములో ఓంకార ధ్యానముతో ఖేచరీలో స్థిరపడు యోగికి ఆ తియ్యదనము అనగా సోమరస అనుభూతి తప్పక పొందుతాడు. ఈ సోమరసము సూక్ష్మము ద్వారా భౌతిక శరీరము లోనికి ప్రవేశించి ఆధ్యాత్మిక ఆనందముతో పాటు మానసిక మరియు భౌతిక ఆరోగ్య ఆనందములను కలగచేస్తుంది.
ఇడానాడిని గంగ పింగళని యమున సుషుమ్నని సరస్వతి అంటారు. ఈ మూడు నాడులు ఆజ్ఞా చక్రము దగ్గిర కలవటమే త్రివేణీ సంగమము. అటుపిమ్మట ఆజ్ఞా చక్రములోని జీవాత్మ లేక ప్రాణశక్తి లేక కుండలినీశక్తి బ్రహ్మరంధ్రములోని పరమాత్మను కేవలము సుషుమ్న ద్వారా చేరుకోవటమే సమాధిస్థితి.
కూటస్థములోని ఆజ్ఞా(+)చక్రము వఱకు పూరకము చేసి అనగా గాలిని పీల్చి ఆ పీల్చిన గాలిని మూలాధార చక్రము ద్వారా పూర్తిగా రేచకము చేసి వదిలివేస్తే విద్యుదయస్కాంత శక్తి పుడుతుంది. ఈశ్వరప్రణిధామమునకు అనగా పరిపూర్ణముగా అంకితమగుటకు అర్థింపునకు లేదా ప్రార్థనకు ఇంద్రియములు, ఇంద్రియములకు సహాయముగా ప్రాణములను, ఇడ పింగళ మరియు సుషుమ్నలను అభిషేకపు నీరుగా, అంతఃకరణను దీపముగా, ఆరుచక్రములను పూవులుగా, అగ్నితత్వము(మణిపురచక్రము)ను సుగంధము (అగర్బత్తి)గా,  ఆనందమును నైవేద్యముగా అర్పించ వలయును.
చక్రధ్యానము చేయుటవలన మూలాధారములోని  కౄరత్వము ద్వేషము దొంగతనస్వభావము తొలిగిపోవును.
స్వాధిష్ఠానములోని సందేహ పూరిత మనస్సు తొలిగిపోవును.
మణిపురలోని కౄరత్వము ద్వేషము ఎదుటివాడి కంటె ఎలాగైనా గొప్పగా ఉండాలనే అర్థరహిత పట్టుదల తొలిగిపోవును.
అనాహత లోని ఉద్వేగ పూరితమైన మనస్సు తన మతమె గొప్పదన్న భావన ప్రతీకారవాంఛ తొలిగిపోవును.
విశుద్ధలోని లోభత్వము అతివాగుడు మరియు తొలిగిపోవును.
ఆజ్ఞాలోని అహంభావము తొందరపాటు గుణములు తొలిగిపోవును.
కర్మఫలములను ఈశ్వరునికి అర్పించుటయే ఈశ్వరప్రణిధానము.
శరీర వ్యాయామము, మనోనిగ్రహము మరియు ఓంకార ధ్యానము కలిపి క్రియాయోగము.                    
క్రియాయోగము ఒక భౌతిక మానసిక విధానము. క్రియా యోగాభ్యాసము వలన సాధకుని శరీరములోని రక్తము కర్బనమును కోల్పోయి ప్రాణశక్తితో శక్తివంతమగును. బుర్రలోని జీవకణములు ధన ధృవములు. మిగిలిన శరీరమంతటిలోని జీవకణములు ఋణ ధృవములు. ప్రాణశక్తితో శక్తివంతమయిన రక్తములో జీవకణ నాశనము తగ్గును. తద్వారా హృదయమునకు పని తగ్గి విశ్రాంతి దొరుకుతుంది.
రాజ యోగములో శ్వాస దిగ్బంధనకు ప్రాముఖ్యత ఎక్కువ. అదే క్రియా యోగములో శ్వాస నియంత్రణేకాక మేరుదండము (వెన్నెముక)ను అయస్కాంతీకరణము చేసి తద్వారా ప్రాణశక్తిని సహస్రారమునకు చేర్చటమునకు ప్రాముఖ్యత ఇవ్వటం ద్వారా బుర్ర, బుర్రలోని నరములకు విశ్రాంతి మరియు శక్తి చేకూరుతుంది. శ్వాసకి జాగృతి లేదు. శక్తి మాత్రమే ఉన్నది. అదే ప్రాణశక్తికి జాగృతి మరియు శక్తి రెండూ ఉన్నవి.
తస్యవాచకఃప్రణవః.....పతంజలి...1...27
ధ్యానములో వినిపించే ఓంకార నాదమే భగవంతుని నామధేయము.
తస్మిన్సతిశ్వాసప్రశ్వాసయోఃగతివిచ్ఛేదఃప్రాణాయామః  పతంజలి249
ఆసన సిద్ధి తదుపరి ఉఛ్వాస నిశ్వాసాల గతినిరోధమైన ప్రాణాయామం సిద్ధిస్తుంది.  అనగా ముక్తినిస్తుంది. సాధకుడికి తన సాధన ద్వారా ఓంకారం వినగలుగుతాడు.
తద్వారా దివ్యక్షేత్రాలతో అనుబంధం ఏర్పడుతుంది. సవికల్ప సమాధిస్థితిలో చేతన విశ్వాత్మలో లీనమగుతున్న అనుభవంతోపాటు ప్రాణశక్తి ఉపసంహరించబడుట, శరీరం బిగుసుకుపోవుట అంతా తెలుస్తూనే ఉంటుంది. నిర్వికల్పసమాధిస్థితిలో విశ్వాత్మలో లీనమగుతున్న అనుభవమేకాక సాధారణ లౌకిక వ్యవహారములు చేస్తున్నా ఆ అనుభవమును పోగొట్టుకోడు.
  మూలాధారమునుండి కూటస్థములోని ఆజ్ఞా(+)చక్రము వఱకు ప్రతి చక్రమునకు ఇరువైపులా రెండేసి రాశుల చొప్పున 12 రాశులు ఉన్నవి. క్రియాయోగి తన ప్రాణశక్తిని ఆరుచక్రములలో మూలాధారమునుండి కూటస్థమునకు, కూటస్థమునుండి మూలాధారమునకు త్రిప్పుతూ తద్వారా ఆత్మసూర్యుని ఈ ఆరు చక్రములలో ఇరువైపులా రెండేసి రాశుల చొప్పున ఉన్న 12 రాశులలో దర్శిస్తూ ప్రతి చుట్టుకూ (మూలాధారమునుండి కూటస్థమునకు కూటస్థమునుండి మూలాధారమునకు కలిపి ఒక చుట్టు) ఒక సంవత్సరము చొప్పున కర్మని దగ్ధంచేసికుంటాడు. సూర్యుడు ప్రతి మాసమునకు ఒక రాశి చొప్పున 12 రాశులలో 12 మాసములు సంచరించును. సూర్యుడు రాశులలో సంచరించుటను సంక్రమణము అందురు. ఈ సూర్య సంక్రమణములు పన్నిండింటిలో రెండు సూర్య సంక్రమణములు ముఖ్యమైనవి. అవి సూర్యుడు మకర రాశిలో సంచరించు మకర సంక్రమణము, కర్కాటకరాశిలో సంచరించు కర్కాటక సంక్రమణము. ఈ మకర సంక్రమణమునే మకర సంక్రాంతి అందురు. ఈ మకర సంక్రాంతినుండే ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభం. ఈ కర్కాటక సంక్రమణమునుండే దక్షిణాయణ పుణ్యకాలము ప్రారంభం. సూర్యుడు 12 రాశులలో 12 మాసములు సంచరించుటతో ఒక సంవత్సర ప్రారబ్ధ కర్మను అనుభవంచినట్లు లెక్క. మన సంచిత కర్మని దగ్ధం చేసికొనుటకు 10 లక్షల ఆరోగ్యకరమైన జీవితం అవసరము. అదిదుస్సాధ్యం. ఈ దుస్సాధ్యం సుసాధ్యం చేసేదే క్రియాయోగం.
హైద్రాబాదునుండి ఢిల్లీకి విమానములో వెళ్ళుటకు రెండు గంటలే పట్టును. అదే ఇంకొక వాహనము అయిన ఎక్కువ సమయము పట్టవచ్చు. క్రియాయోగం విమానములో ప్రయాణించటము లాంటిది. కేవలము ఒక్క జీవిత కాలములోనే పట్టుదలగల క్రియాయోగి 10 లక్షల క్రియలు చేసికొని జీవ బ్రహ్మైక్యము పొందవచ్చు. రోజుకు 1000 క్రియల చొప్పున మూడు సంవత్సరములలో 10 లక్షల సంవత్సరాల ప్రగతిని క్రియాయోగి సాధించగలడు. సాధారణముగా 6 12 18 24 30 36 42 లేదా 48 సంవత్సరములలో ఒక పద్ధతి ప్రకారము క్రియలు మరియు ధ్యానము చేస్తే 10 లక్షల సంవత్సరాల ప్రగతిని క్రియాయోగి సాధించగలడు. ఒకవేళ సంపూర్ణ ప్రగతిని సాధించకుండానే క్రియాయోగి మరణిస్తే తనతోపాటే క్రియాయోగ సాధనా ఫలితాన్ని తీసికెల్తాడు. క్రియాయోగి జీవితం అతని సంచిత కర్మలతో ప్రభావితం కాదు. అది పూర్తిగా ఆత్మచూపే మార్గదర్శకత్వంలోనే కొనసాగుతుంది. క్రియాయోగం మిత భోజనముతోను, పూర్తిగా ఏకాంతములోను చేయవలయును.
క్రియాయోగములో (1) హఠయోగము (శక్తిపూరకఅభ్యాసములు) (2) లయ యోగము (సోహం మరియు ఓం ప్రక్రియలు), 3) కర్మ యోగము (సేవ), 4) మంత్ర యోగము (చక్రములలో బీజాక్షర ఉఛ్ఛారణ), (5) రాజ యోగము (ప్రాణాయామ పద్ధతులు) ఉండును.
కనుబొమ్మల మధ్య ప్రదేశమును కూటస్థము లేక ఆజ్ఞా(+) అంటారు. ఈ కూటస్థము ధన ధృవము. మూలాధార చక్రము ఋణ ధృవము. ఈ ఋణ ధృవము అనగా మూలాధార చక్రమునుండి ధన ధృవము అనగా కూటస్థము వఱకు, తిరిగి కూటస్థమునుండి మూలాధార చక్రము వఱకు ప్రాణశక్తిని త్రిప్పటము వలన మేరుదండము (వెన్నెముక) శక్తివంతమైన ఐస్కాంతమగును. తద్వారా మూలాధారమునుండి కంఠములోని విశుద్ధ వఱకు ఉన్న కరెంట్లు అన్నీ కూడా అయస్కాంతీకరణ చెందిన మేరు దండము ద్వారా బ్రహ్మరంధ్రములోని సహస్రారచక్రము లోనికి చేర్చబడి సాధకుడు అనంతమైన ఆనందాన్ని పొందుతాడు. దీనికి తోడు కొన్ని ముద్రలుకూడా ప్రాణాయామముతోబాటు చేయుటవలన మేరు దండము మరింత శక్తివంతమగును.
శక్తి మరియు జాగృతి రెండూ ఉన్నదే ప్రాణశక్తి. ప్రాణ వాయువులో ఒక్క శక్తి మాత్రమే ఉండును. శరీరము మరియు మనస్సు రెండిటి రుగ్మతలనూ క్రియాయోగము రూపు మాపుతుంది. క్రియాయోగములో కొన్ని ప్రక్రియలు మంత్రములు, హఠయోగ అభ్యాసములు యమ నియమ ఆసన మొదలగు అష్టాంగ యోగ పద్ధతులు మరియు ప్రాణాయామ పద్ధతులుంటాయి. ఈ క్రియాయోగ అభ్యాసముద్వారా శరీరము మరియు మనస్సు రెండూ సాంత్వన చెందటమేకాక మన స్వాధీనములోనికి వస్తాయి. తద్వారా కుండలినీ జాగృతిచెంది సాధకుని శుద్ధ చేతనా స్థితికి చేర్చుతుంది.
స్వామి వివేకానంద అన్నట్లుగా మన అసలైన స్థితి శుద్ధచేతనా స్థితియే. మనస్సు శ్వాస ప్రాణశక్తి మరియు కామము అనే నాలిగింటినీ అదుపులో ఉంచ గలుగుతే మన అసలైన స్థితి శుద్ధ చేతనా స్థితిని పొందగలుగుతాము.
ఇడా నాడి మానసిక వ్యవహారాన్ని పింగళా నాడి భౌతిక వ్యవహారాన్ని సుషుమ్నా నాడి మానసిక భౌతిక వ్యవహారములు రెండింటినీ సమన్వయ పఱచటానికి ఉపయోగిస్తాయి.
చక్రములు అనుసంధాన పెట్టెలు. అస్థిర శ్వాస అస్థిర మనస్సుకి కారణము. కాముడు రాముడు అవ్వాలన్నా తృష్ణ  కృష్ణ అవ్వాలన్నా శవం శివం అవ్వాలన్నా ప్రాణాయామమే ఏకైక మార్గము.
మనస్సు అనేది ఎనిమిదవ సంవత్సరము నుండి ఏర్పడుతుంది. అంతకు ముందు వఱకు ఆత్మయొక్క సలహా మీదనే జీవితము ఆనందముగా గడుస్తూఉంటుంది.అందుకనే పిల్లలు దేవుళ్ళు అనేది.
నతస్యరోగో నజరా నమృత్యు ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం
రోగము ముసలితనము మరణము వీడి సాధకుడు యోగాగ్నితో ప్రజ్వరిల్లిపోవాలి.

గ్రంధులుచక్రములు   

గ్రంధులు 1) ఎక్సోక్రిన్ 2) ఎండోక్రిను అని రెండు విధములు.
ఈ గ్రంధులు ఉత్పత్తి చేసే హార్మోన్సు అనేవి సంబంధిత అవయవముల మీద పనిచేస్తూ ఆయా అవయములు శరీరములో(తో) మనకి ఉపయోగకరమైన పనులను చేయించుటకు మరియు శరీరమును ఆరొగ్యకరముగా ఉంచుటకు తోడ్పడతాయి.
మూత్రపిండముల పైన ఉన్న ఎడ్రినలు ఎండోక్రిను గ్రంథి సక్రమముగా పనిచేయుటకు స్వాధిస్ఠాన చక్రము సక్రమముగా ఉండాలి. తద్వారా అతి మూత్రము మూత్ర పిండములలో రాళ్ళు వగైరాలు ఉండవు.
మణిపూర చక్రము సక్రమముగా ఉంటే ఇన్సులిను మరియు గ్లూకగాను హార్మోన్సు పద్ధతిలో పాన్క్రియాసు విడుదల చేసి మధుమేహము లేకుండా చేయును.
చక్రధ్యానము:--
సాధకుడు పద్మాసనములోకాని, వజ్రాసనములోకాని, సుఖాసనము లోకాని, ధ్యానము చేయాలి. కొంచెం ఎత్తుగాఉన్న బల్లమీద కూర్చోవాలి. పాదములు నేలకి ఆనేటట్లు కూర్చోవాలి. పాదములు నేరుగా నేలకి త్రాకకూడదు. పాదములకు మేజోళ్లు వేసికొని కూర్చో వాలి. మేరుదండమును నిఠారుగా ఉంచుకొని, కూటస్థములో దృష్టిఉంచి ఉత్తరదిక్కు లేదా తూర్పుదిక్కునుగాని చూస్తూ అధిచేత నా వస్థలో మెడను వెనక్కివంచి, కూర్చోవాలి. 
ఇప్పుడు ఒక్కొక్క చక్రములో గురుముఖతః క్రియాయోగము నేర్చుకొని  ధ్యానముచేస్తూ సహస్రారమువరకూ వెళ్ళాలి.
ఒకశ్వాస, ఒకనిశ్వాస, కలిపి ఒకహంస అవుతుంది. సాధారణముగా మనిషి రోజుకి 21,600 హంసలు అనగా ఒకనిమిషమునకు 15 హంసలు చేస్తాడు. 15 హంసలకి ఎక్కువ హంసలుజేస్తే రోగి, తక్కువ చేస్తే యోగి, 15 చేస్తే భోగి, అంటారు.
తాబేలు రోజుకి15 హంసలు చేస్తుంది. అందువలన ఎవరూ చంపకుండా ఉంటే 1000 సంవత్సరములు బ్రతుకుతుంది. సాధకుడు ఆవిధముగా ప్రాణాయామ ప్రక్రియద్వారా తన జీవితసమయమును పెంచుకుంటాడు. తద్వారా ఆరోగ్యముగాఉంటాడు. పరమాత్మతో అనుసంథానం పొందుతాడు.      
కులములు:--
మనిషి మేరుదండములో ఉన్న చక్రములు జంక్షన్ బాక్సెస్ (Junction boxes) లాంటివి. పరమాత్మచైతన్యము సహస్రారములో ప్రవేశించి కూటస్థములోని ఆజ్ఞాచక్రముద్వారా మేరుదండములోని విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్ఠాన మరియు మూలాధార అనే జంక్షన్ బాక్సెస్ (Junction boxes) ద్వారా శరీరములోని నరకేంద్రములకు, నరనరములకు, అవయవములకు వలసినప్రమాణములో పరమాత్మ చేతన అందించబడుతుంది.
ఈమేరుదండములోని విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్ఠాన మరియు మూలాధార అనే చక్రములను కులములు అంటారు. సాధకుడు తనసాధనలో మూలాధారమును ఆనుకొని తలక్రిందకి యుండి తోక పైచక్రములలోయుండి  నిద్రావస్థలోయున్న కుండలినీ శక్తిని జాగృతి పరుస్తాడు.
ఆజాగృతిచెందిన కుండలినీశక్తి ఏ చక్రమువరకు చేరితే అంత ముందుకి వెళ్తాడు తన సాధనలో.
అసలు యోగసాధనయే చేయక  నిద్రావస్థలోయున్న కుండలినీశక్తి ని కలిగియున్న మనిషి శూద్రుని క్రింద మరియు కలియుగములో ఉన్నట్లు లెక్క. వాడి హృదయము నల్లగాయున్నట్లు పరిగణిస్తారు.
జాగృతిజెందిన కుండలినీశక్తి మూలాదారమును స్పృశిస్తే ఆసాధకుడు తనను పరమాత్మతో అనుసంధానం పొందనీయక అడ్డుకునే అంతఃశ తృవులను ఎదుర్కొనే క్షత్రియుడుగాను, కలియుగములోయున్నను,   స్పందనా హృదయము కలిగియున్నట్లు పరిగణిస్తారు.`
జాగృతిజెందిన కుండలినీశక్తి స్వాధిష్ఠానమును స్పృశిస్తే ఆసాధకుడు పునర్జన్మనెత్తిన వైశ్యుడుగాను, ద్వాపరయుగములోయున్నట్లు,   శ్రద్ధా హృదయము కలిగియున్నట్లు పరిగణిస్తారు.
జాగృతిజెందిన కుండలినీశక్తి మణిపురచక్రమును స్పృశిస్తే ఆసాధ కుడు వేదపారయణజేసే విప్రుడుగాను, త్రేతాయుగములో యున్నట్లు,   స్థిరహృదయము కలిగియున్నట్లు పరిగణిస్తారు.           
జాగృతిజెందిన కుండలినీశక్తి అనాహత,చక్రమును స్పృశిస్తే ఆసాధ కుడు బ్రహ్మజ్ఞానమునకు అర్హుడైన బ్రాహ్మణుడుగాను, కృతయుగ ములోయున్నట్లు,  స్వచ్ఛమైన హృదయము కలిగియున్నట్లు పరిగణిస్తారు. 
ఈవిధముగా శూద్ర, క్షత్రియ, వైశ్య, విప్ర, బ్రాహ్మణ కులములు వారి వారి సాధనా ప్రగతినిబట్టి నిర్ణయించారు.
యోగసాధననుబట్టికాక జన్మనుబట్టి కులము నిర్ణయించ బడుటవలన అవి కాలక్రమేణ అనేకానేక కులములుగానేర్పడి దేశముయొక్క ఐక్యతకు, బధ్రతకు ముప్పు వాటిల్లుతున్నది.
మూలాధారచక్రము ముక్కుకు, స్వాధిష్ఠానచక్రము నాలుకకు, మణిపురచక్రము కన్నుకు, అనాహతచక్రము చర్మమునకు, విశుద్ధచక్రము చెవ్వుకు ప్రతీకలు.
మనస్సు ఈ ఇంద్రియములతో కూడినంతవరకు తన అసలు ఆనందము ఏమిటో తెలిసుకోలేదు. సాధకుడు తన మస్సును ఈ ఇంద్రియములనుండి మరల్చి అంతర్ముఖమై, పరమాత్మతో అనుసంధానము పొందుతున్నప్పుడు మనస్సుకు తను పోగొట్టుకున్న, పోగొట్టుకుంటున్న, అసలైన ఆనందమును పరిపూర్ణముగా అర్థముచెసికొని పశ్చాత్తాప పడుతుంది.
శరీరమును ఇంద్రియములతో అనుసంధించేది ప్రాణశక్తే.. క్రియాయోగములో ఈ ఐదు ఇంద్రియములనుండి సాధకుడు ప్రాణశక్తిని మరియు మనస్సును ఉపసంహరిస్తాడు. ఉపసంహరించు ట అనగా నియంత్రించుట. 
శ్వాసని నియంత్రించుట వలన హృదయము మరియు ప్రాణశక్తి తమంతటతామే నియంత్రించబడతాయి.  హృదయనియంత్రణ ఇంద్రియ నియంత్రణకి దారి తీయును. ఇది అంతా ఒక గణిత సమీకరణములాంటిది.  కానీ బలవంతముగా అశాస్త్రీయమైన పద్ధతులతో శ్వాసను బలవంతముగా ఊపిరితిత్తులలో ఆపగూడదు. సద్గురుముఖతా ఈ క్రియాయోగమును అభ్యసించవలయును. మానసికధ్యానముద్వారా మనస్సును నియంత్రించుటకు చాలా సమయము పడుతుంది. కానీ క్రియాయోగము విమానము మాదిరి చాలా శీఘ్రముగా శ్వాసనియంత్రణద్వారా మనస్సును స్థిరముచేసి అంతర్ముఖం అగుటకు దోహదపడుతుంది.
మూత్రపిండములు: ఇవి రక్తములోని మలిన పదార్థములను అనవసరమైన రసాయన పదార్థములను వడకడుతుంది.
హృదయం: ఇది ప్రాణవాయువు(Oxygen)తో కూడిన  రక్తమును శరీరము మొత్తమునకు పంపుతుంది. శరీరములోని నరములన్నిటికీ ప్రాణవాయువుతో కూడిన  రక్తమును పంచి తిరిగి ఆ ప్రాణవాయువు లేనిరక్తము హృదయములోనికి చేరును. ప్రాణవాయువులేనిరక్తము ఊపిరితిత్తులలోనికి ప్రాణవాయువుకొరకు  పంపబడును. ఊపిరి తిత్తులలో బొగ్గుపులుసువాయువును(co2) తీసివేసికొని  ప్రాణవాయువును చేర్చుకొని  తిరిగి హృదయము లోనికి చేరును. 
ఊపిరితిత్తులు: ఇవి గాలిని శరీరము లోనికి తీసికొనేటట్లుచేసి దానిలోని బొగ్గుపులుసువాయువును(co2) తీసివేయును. ఇట్లా గాలిని లోనికి తీసికొని బొగ్గుపులుసు వాయువును తీసివేయుటను శ్వాసపీల్చుకోవటం అంటారు.
హృదయమును నియంత్రించుటకు, 1) బొగ్గుపులుసు వాయువు  తక్కువ చేయుటకు ఎక్కువ ఫలా(ఫలములు)హారము మరియు   2) క్రియా యోగాభ్యాసము అవసరము. దీనివలన రక్తము శుద్ధపడి  బొగ్గుపులుసు వాయువుతో కూడిన రక్తము ఊపిరితిత్తులలోనికి శుద్ధికోసరము పంపవలసిన అవసరము హృదయమునకు తగ్గు తుంది. హృదయము క్రమశః స్థిరమగును. దానికి పనితగ్గి విశ్రాంతి కలుగును. ప్రాణశక్తి ఇంద్రియములనుండి ఉపసంహరించబడును. ఇంద్రియములనుండి చిన్నమెదడులోని మనస్సుకు  సంకేతములు అందవు. మనస్సుచలించదు. పరమాత్మమీదే మనస్సు లగ్న మగును. ఈ విధముగా తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొన్న మాదిరిగా సాధకుడు మనస్సుయొక్క  ఇంద్రియ ములనే అవయవములను ఉపసంహరించకొనగలుగుతాడు.
చక్రములలో ఓంకారోచ్ఛారణ శ్రద్ధతో చేయుటవలన ఆయా చక్రము లలోని సూక్ష్మ శక్తులుకూడా  సాధకునకు సహాయము చేస్తాయి.   
క్రియాయోగ అభ్యాసమువలన బయటికి వెళ్ళే శక్తి ఇంద్రియములలో వృధా అవదు. ఆ శక్తులన్నీమేరుదండస్థిత చక్రములలోని సూక్ష్మ శక్తులతో కలుస్తాయి. అప్పుడు సాధకుని శరీరము మరియు మెదడు (cerebrum) లోని కణములు విద్యుదయస్కాంతశక్తితో నిండి ఆధ్యాత్మి క అమృతముగా మార్పుచెందుతాయి. మెదడులోని కణములు స్వల్పంగా అభివృద్ధిచెందుటకు కనీసము పన్నెండుసంవత్సరాల ఆరోగ్యకరమయిన జీవితము అవసరము. పూర్తిగా అభివృద్ధి చెంది పరమాత్మ చేతనగా వ్యక్తీకరించుటకు  పదిలక్షల సంవత్సరాల స్వాభావికమైన, ప్రాకృతిక మార్పులు, ఆరోగ్యకరమయిన జీవితము అవసరము. దీనిని క్రియాయోగము సులభతరము చేస్తుంది. 

క్రియా యోగము ఎవరైనా అభ్యసించవచ్చు. ఈ అభ్యాసముద్వారా సాధకుడు తన మనస్సును ఇంద్రియవిషయములనుండి నిగ్రహించు కోగలుగుతాడు. ఇంద్రియములనుండి ప్రాణశక్తిని ఉపసంహరించుకొని   మనస్సు, బుద్ధి రెండింటినీ ఇంద్రియములనుండి నిగ్రహించు కోగలుగుతాడు. మనో,బుద్ధి,చిత్త,అహంకారములను, మేరుదండము లోని మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత మరియు విశుద్ధ చక్రములద్వారా ఆరవ చక్రమయిన మెడుల్లా కేంద్రములోని ఆజ్ఞాచక్రములోనికి తీసికెళ్ళగలుగుతాడు.. ఈఆజ్ఞాచక్రము భ్రూమధ్య ములోని మూడవకన్నుకు అయస్కాంతపు ఆకర్షణతో కలిపి ఉంటుంది. ఈమూడవకన్ను పెద్దమెదడు(Cerebrum) కేంద్రము లోని సహస్రారచక్రమునకు కలిపిఉంటుంది.  ఆక్కడ  క్రియాయోగి తన మనో, బుద్ధి, చిత్తములను ఆత్మాగ్నిలో కరిగించి తనను శుద్దాత్మగా గ్రహిస్తాడు.
భౌతికమైన కన్ను తన ముందరి ప్రదేశమును మాత్రమే చూడ గలుగుతుంది.  మూడవకన్ను సూక్ష్మ, కారణలోకములనన్నింటినీ చూపగలదు. మూడవకన్నులోనికి మనస్సును ప్రవేశింప చేయ గలిగిన క్రియాయోగి ముందుగా తన సూక్ష్మ శరీరమును చూస్తాడు. ఆ తరువాత మొత్తము సూక్ష్మలోకమును, ఆలోకములోని తన శరీరముకూడా ఒక భాగముగా చూస్తాడు. మూడవకన్నులోనికి ప్రవేశించకుండా, తన ప్రాణశక్తిని, చేతనను మేరుదండములోనికి, దానిలోని చక్రములలోనికి ప్రవేశింపజేయలేడు. ఆ తరువాత ముక్తి పొందుతాడు సాధకుడు.    
ఈ విధముగా క్రియాయోగము అనేది శ్రీకృష్ణపరమాత్మ శ్రీమద్భగవద్గీతలో అర్జునుడి ద్వారా అందజేశాడు.
సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క మాసము చొప్పున 12రాశులలో  12 నెలలు సంచరించును. అనగా ఒక సంవత్సరము అన్నిరాశులు చుట్టివచ్చుటకుబట్టును. అప్పుడు ఒకసంవత్సరము ప్రారబ్ధకర్మ అను భవించినట్లు లెక్క.
మన సంచితకర్మను దగ్ధం చేసికొనుటకు 10 లక్షల ఆరోగ్యకరమైన జీవితము అవసరము. అది దుస్సాధ్యము. ఆ దుస్సాధ్యమును సుసాధ్యము చేసేదే క్రియాయోగము. అన్నిటికంటే వేగముగా వెళ్ళే విమాన వాహనములాంటిది క్రియాయోగము.
పట్టుదలగల క్రియాయోగి ఒక్క జీవితకాలములోనే 10 లక్షల క్రియలను చేసికొని జీవబ్రహ్మైక్యము పొందవచ్చు. రోజుకు 1000 క్రియల చొప్పున కేవలము 3సంవత్సరములలోపలె, 10 లక్షల సంవత్సరముల ప్రగతిని సాధించగలడు. సాధారణముగా, 6,12,18, 24,30,36,42 లేదా 48 సంవత్సరములలో ఒక పధ్ధతి ప్రకారము క్రియలు మరియు ధ్యానము చేస్తే 10 లక్షల సంవత్సరముల ప్రగతిని సాధించగలడు. ఒకవేళ క్రియాయోగి సంపూర్ణ ప్రగతిని సాధించ కుండానే మరణిస్తే తనతోపాటే క్రియాయోగఫలితాన్ని తీసికెల్తాడు. క్రియాయోగిజీవతము అతని సంచితకర్మలతో ప్రభావితము కాదు.  అది పూర్తిగా ఆత్మచూపే మార్గదర్శకత్వములోనే కొనసాగుతుంది. క్రియాయోగము మితభోజనముతోను, పూర్తిగా ఏకాంతములోను చేయవలయును.
క్రియాయోగములో హఠయోగము(శక్తిపూరక అభ్యాసములు), లయయోగము(సోహం మరియు ఓం ప్రక్రియలు), కర్మయోగము (సేవ),మంత్రయోగము(చక్రములలోబీజాక్షరఉచ్ఛారణ), రాజయోగము (ప్రాణాయామ పద్ధతులు) ఉండును.
తలనుండి క్రిందికి వెళ్ళే ప్రాణశక్తి మనస్సును ఇంద్రియములకు తీసికెళ్ళి తను దివ్యాత్మస్వరూపుడ్ని అనే విషయము మరుగున పడేటట్లుచేసిభౌతికతోముడిపడునట్లు చేస్తుంది. ఒక్క క్రియాయోగము ద్వారానే అథోముఖమై భౌతికతో ముడిపడిన ప్రాణశక్తిని ఊర్థ్వ ముఖముజేసి మేరుదండములోని చక్రములద్వారా తలలోకి తీసి కెళ్ళి ఆధ్యాత్మికతకు దారితీస్తుంది. మానవుడిగా పుట్టుటం లోని అంతరార్థము తెలియజేస్తుంది.
సాధకునికి ప్రాణశక్తి నియంత్రనే మాయనిజయించే వజ్రాయుధము,.
ఖేచరీముద్రలో నాలుకను వెనక్కునెట్టి కొండనాలుక క్రిందుంచి క్రియాయోగముజేసే సాధకుడికి తన సాధన సర్వము సమకూర్చే కామధేనువు.
మనము తీసికొనే శ్వాసను పవిత్రమొనర్చి ప్రాణశక్తి  నియంత్రణకు తోడ్పడి సాధకుడ్ని పరమాత్మతో అనుసంధానం మొనర్చునది క్రియాయోగము. ఆ సాధనకి తోడ్పడే  పవిత్రమొనర్చు వాయువు పరమాత్మే.
సాధనలో కలిగే ఆటంకములను తొలగించే ఆయుధము ఓంకారోచ్ఛారణ.  ఉచ్ఛరించిన ఓంకారం అనే ఒక్క అక్షరము  వృధాగా పోదు. అది బ్రహ్మాండములోని నకారాత్మకశక్తులను నాశనము చేస్తునే యుంటుంది. ఓంకారం పరమాత్మకి ప్రతీక. శ్రీరామచంద్రుడు కూడా పరమాత్మకి ప్రతీక. . శ్రీ రామునిది ఒకే ఒక్క బాణము, ఒకేమాట. అదే ఓంకారం. ఓంబాణమే రామబాణం.
తనలోని లోకములను(చక్రములను) క్రియాయోగము ద్వారా కుండలినీ జాగృతిచేసి ప్రక్షాళణచేసి పరమాత్మతో అనుసంధానం పొందుటకు తీవ్రప్రయత్నం చేయాలి.
శక్తి మరియు జాగృతి రెందూఉన్నది ప్రాణశక్తి. ప్రాణవాయువులో ఒక్క శక్తిమాత్రమే ఉన్నది. శుష్కంచిపోయేదిశరీరము. దహించిపోయే ది దేహము. కుళ్ళిపోయేది కళేబరము. క్రియాయోగమువలన శరీరముశుష్కంచదు, దేహముదహించిపోదు, కళేబరముకుళ్ళిపోదు.            
క్రియాయోగము శాస్త్రీయమైనది. నిశ్చయమైనది. నిశ్చితఫలితాలు ఇచ్చే క్రమపద్ధతులద్వారా ఆత్మ పరమాత్మలకలయికే యోగము. అది మూఢ విశ్వాసాలవల్లకలిగే విభేదాలనుండి మతాన్ని అతీతముగా ఉంచుతుంది.                      
శారిరకవ్యామోహమును, బానిసత్వాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. ఆధిపత్యం సాధించేవరకు శరీరమే సాధకునికి శతృవు. దైవనామము వ్యాప్తి చెయ్యడం, నిత్యమూ ఆయనగురించి ఆలోచిస్తూ గానం చెయ్యడం తప్ప సాధకుడు ఇంకేమీ కోరకూడదు. ఆత్మసమర్పణకంటే దేవుని ప్రేమను పొందే మార్గము ఇంకేమీలేదు. దానికి క్రియాయోగముద్వారా మనస్సును లొంగదీసుకొనటము మార్గము. 

పరమాత్మచేతన మరియు పరమాత్మశక్తి, మానవచేతన అనగా మానవ మనస్సు మరియు ప్రాణశక్తిగా వ్యక్తీరించుటకు మార్గము కూటస్థములోని మూడవకన్ను.
కారణశరీరము మరియు సూక్ష్మశరీరముల రెండింటి వ్యక్తీకరణకు మార్గము ఈమూడవకన్నే. 
సూక్ష్మశరీరమూడవకన్నుకి కారణమైనది కారణశరీర మూడవకన్ను.
కారణశరీరమునకు కారణశరీర మేరుదండము, అలాగే సూక్ష్మశరీరమునకు సూక్ష్మశరీర మేరుదండము ఉంటాయి.
సుషుమ్ననాడి సూక్ష్మశరీర మేరుదండమునకు, దానిలోని వజ్ర, వజ్రలోని చిత్రి,  మరియు చిత్రిలోని   బ్రహ్మనాడి కారణశరీర మేరుదండమునకు సంబంధించినవి.              
పరమాత్మచేతన మరియు పరమాత్మశక్తి, రెండూను మొదట కారణశరీర మూడవకన్నుద్వారా కారణశరీర మేరుదండములోనికి కారణ చేతన మరియు కారణ ప్రాణశక్తిగా ప్రవేశిస్తాయి.
కారణశరీర మేరుదండముద్వారా సూక్ష్మశరీర మూడవకన్నులోనికి, దాని ద్వారా సూక్ష్మశరీర మేరుదండములోనికి సూక్ష్మచేతన మరియు  సూక్ష్మప్రాణశక్తిగా ప్రవేశిస్తాయి.
ఈసూక్ష్మశరీరమూడవకన్నునే ఇక్ష్వాకు అంటారు. ఇక్ష్ అనగా నేత్రము అని అర్థము.
మనువు అనగా కారణ చేతనా మనస్సుయొక్క కొడుకు ఇక్ష్వాకు.
ఇక్ష్వాకుస్థితిలో ఉండే అహంకారము స్థూల ఇంద్రియములనుండి రాదు. ఆత్మనుండి వస్తుంది.  దీనినే సహజావబోధన అంటారు.
సూక్ష్మశరీర మేరుదండముద్వారా స్థూలశరీర మేరుదండము లోనికి మానవచేతన మరియు  ప్రాణశక్తిగా ప్రవేశిస్తాయి.  అక్కడినుండి విషయాసక్తిగల స్థూలజ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలలోనికి ప్రవేశిస్తాయి. విషయాసక్తిగల స్థూలజ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాల స్థితిని రాజర్షిస్థితి అంటారు. ఆ విషయాసక్తిగల స్థితిలో మనిషి యోగము మర్చిపోతాడు, చెయ్యడు.  
భౌతిక నేత్రము తెరిచినప్పుడు మనిషికల కరిగిపోవును. పరమాత్మ కల కరిగిపోవుటకు జ్ఞాననేత్రము తెరిచిన కరిగిపోవును.  దానికే ఈ సాధన.
వివిధములైన  అణువులు కలిసి ఒక పురుగు, వృక్షము, పక్షి, జంతువు మరియు మనిషిగా వివిధరూపములలో వ్యక్తమగుచున్నవి. ఈ ప్రాణులలో ఆన్నింటికీ మరియు ఆయా ప్రాణులకు సంబంధించిన అణువులకీ కావలసిన రీతిలో వివిధములుగా వ్యక్తమగుచున్నది ఈ ప్రాణశక్తే.  ఈ విధముగా మొత్తము మనిషికి తగు రీతిగా లభ్యమగు ప్రాణమును ముఖ్య ప్రాణశక్తి అందురు.
ఆ ముఖ్య ప్రాణశక్తి గర్భధారణసమయములో జీవాత్మతో పాటుగా ప్రవేశించును. ఆయా ప్రాణియొక్క కర్మననుసరించి జీవితాంతము వరకు ఉండును. ఆ జీవి మనుగడ ఆహారము, ప్రాణవాయువుమీద ఆధారపడి యుంటుంది. అంతేకాక ఈ ముఖ్యప్రాణశక్తి బ్రహ్మాండమునుండి పరమాత్మచేతన రూపముగా మేడుల్లా ద్వారా పెద్దమెదడు (Cerebrum) లో ప్రవిశించి నిక్షిప్తమై యుండును. అక్కడినుండి మేరుదండములోని వివిధచక్రములకు తగురీతిలో పంచబడును. ప్రాణవాయువుకు శక్తిమాత్రమేయుండును. కాని ప్రాణశక్తికి చేతన మరియు శక్తి రెండూ ఉండును.
ప్రాణశక్తి దేహమంతావ్యపించియుండును. కాని వివిధభాగములలో వివిధములైన పనులుచేస్తూ వివిధ నామములతో వ్యక్తమగుచున్నది.
ప్రాణవాయువుగా స్ఫటికీకరణము(Crystallization)నకు అనగా అన్ని పనుల వ్యక్తీకరణకు తోడ్పడును. అపానవాయువుగా అన్ని వ్యర్థ పదార్థముల  విసర్జన(Elimination)కు తోడ్పడును. వ్యాన వాయువుగా ప్రసరణ(Circulation)కు   తోడ్పడును.
సమాన వాయువుగా స్పాంజీకరణ(Assimilation)కు అనగా అరుగుదలకు, తద్వారా వివిధకణములకు, అంగములకు కావలసిన పోషకపదార్థముల వితరణ మరియు చచ్చినకణముల స్థానములలో  కొత్తకణములను సృష్టించుటకు  తోడ్పడును.
కేశవృద్ధి, చర్మము, మాంసము మొదలగు వాటికి వివిధ రకములైన కణములు కావలయును. అందుకు అనంతమైన సమీకరణములు జరుగుచుండును. ఆ పద్ధతిని  జీవాణుపాక అందురు. ఉదానవాయువుగా జీవాణుపాక(Metabolizing)కు  తోడ్పడును.
ప్రాణ అపాన అనేవి మన శరీరములో రెండు ముఖ్యమైన విద్యుత్తులు.
మొదటిది అపానవిద్యుత్తు. అది రెండుకళ్ళ మధ్యనున్న  కూటస్థమునుండి మూలాధారముగుండా దానిని ఆనుకొని క్రిందయున్న మలద్వారము ద్వారా  బయటకుపోవునది. ఇది చంచలమైనది. మనిషిని ఇంద్రియలోలుడ్ని చేయును.
రెండవది ప్రాణవిద్యుత్తు మలద్వారము గుండా దానిని ఆనుకొనియున్న మూలాధారము ద్వారా కూటస్థమునకు పోవునది. ఇది శాంతియుతమైనది. నిద్ర మరియు ధ్యానసమయములోనూ, మనిషి ఏకాగ్రతను పరమాత్మతో కలుపును. కనుక ఒక విద్యుత్తు మనిషిని క్రిందకు అనగా బాహ్యప్రపంచమునకు లాగును. ఇంకొక విద్యుత్తు మనిషిని  లోపలికి అనగా అంతర్ముఖము చేయును.  సాధనకు అంతర్ముఖము అగుటద్వారా పరమాత్మపొందు సులభ మగును. దీనినే క్రియాయోగమందురు. 
ముఖ్యప్రాణము కూటస్థమునుండి మలద్వారము ద్వారా బహిర్గతమగునపుడు కణములు, కండరములు మరియు అంగములు మెదడుకు సమాచారము తీసికెళ్ళుటకు, పట్టుకెళ్ళేందుకు ఉపయోగములోఉండే నరములవలననూ మరియు మానసిక వ్యాపారములవలననూ శక్తి ఖర్చు అగును. అప్పుడు అవి వ్యర్థ లేక కలుషితములను రక్తములో వదిలిపెట్టును. వాటిలో బొగ్గుపులుసు వాయువు (CO2) ఒకటి. ఆ కలుషితరక్తమును వెంటవెంటనే శుద్ధీ కరణ చేయుట చాలా అవసరము. లేనియడల భౌతికమరణము సంభవించును. ఆ ఖర్చయినశక్తిని పునరుద్ధరించుటకు శ్వాస ద్వారా వచ్చు ఈ ముఖ్య ప్రాణము అవసరము.
మేరుదండములోని  ప్రాణ అపానముల పరస్పర విరుద్ధమైన లాగుళ్ళ వలన శ్వాస నిశ్వాసల ప్రక్రియ జరుగును. ప్రాణశక్తి పైకి పోయినప్పుడు ప్రాణవాయువుతో కూడిన ప్రాణశక్తిని ఊపిరి తిత్తుల లోనికి తీసికొనివెళ్ళి బొగ్గుపులుసువాయువును(co2) వెంటనే  తీసివేయును. దీనినే శ్వాసపీల్చుకోవటం అంటారు.  అదే పొట్టలోని ద్రవ మరియు ఘన పదార్థముల శుద్ధీకరణ చేయుటకు ఎక్కువ సమయము పట్టును. ఆ శుద్ధీకరణ చేసిన లేక అయిన  శక్తిని కణములలోనికి పంపునది ప్రాణశక్తే. ఈశుద్ధీకరణ చేసిన లేక అయిన ప్రాణశక్తి మేరుదండములోని అన్ని చక్రములలోను, కూటస్థము మరియు పెద్దమెదడు అనగా సేరేబ్రంలలోను శక్తిని పునరిద్ధరించుచుండును. శ్వాసలోని మిగులు శక్తిని రక్తము శరీరము మొత్తములోను తీసికెళ్ళుచూ ఉండును. అక్కడ పంచప్రాణములు వాటికి కావలిసినరీతిలో ఉపయోగించు కొనును.
భౌతికశరీరమునకు భౌతిక మేరుదండము మెదడు మరియు భౌతికచక్రముల స్థానములు ఉండును.
సూక్ష్మశరీరమునకు  సూక్ష్మశరీర మేరుదండమును, వెయ్యి దళముల  సూక్ష్మమెదడు,  ప్రకాశము మరియు శక్తిగల  సూక్ష్మ చక్రముల స్థానములు, సూక్ష్మనరముల సిస్టం (system) ఉండును. సూక్ష్మనరములను సూక్ష్మనాడులు అంటారు. నరము అనేది భౌతికము. నాడి అనేది సూక్ష్మము అనగా కనబడనిది.
భౌతికశరీరమునకు, భౌతికశరీరములోని పంచకర్మేంద్రియ పంచ జ్ఞానేంద్రియములకు కావలిసిన శక్తుల మూలము ఈసూక్ష్మశరీరము. సూక్ష్మనాడుల ద్వారా పంచ ప్రాణములకు వలసినరీతిలో శక్తిని ప్రసాదించును. ముఖ్యమైన సుషుమ్నాసూక్ష్మనాడి యొక్క బయటి ప్రకాశపుతొడుగు ప్రాణాణువులు, ఏడుచక్రములు మరియు పంచభూతముల సూక్ష్మనాడుల ప్రాణాణువులను, నియంత్రించును.
సుషుమ్నాసూక్ష్మనాడి మూలాధారచక్రమునుండి పెద్దమెదడులోని బ్రహ్మరంధ్రమును ఆనుకొనియున్న సహస్రారచక్రము వరకు వ్యాపించియుండును. భౌతిక మేరుదండమునకు ఇరువైపులా నాలుగు వరుసలుగా ఉండే సింపథటిక్ నరముల సిస్టం (sympathetic nervous system) సూక్ష్మశరీర మేరుదండమును బోలియుండును. ఇడా, పింగళా, ఆ రెండింటి మధ్యనున్న సుషుమ్నా కలిపి ఒకటి, సుషుమ్నాలోని వజ్ర రెండవది, వజ్రలోని చిత్రి మూడవది, దానిలోపల బ్రహ్మనాడి యుండును. బ్రహ్మనాడియొక్క బయటి భాగము సూక్ష్మ మేరుదండముయొక్క నాలుగవ వరుస.  ఈ బ్రహ్మనాడి కారణ శరీరముయొక్క మేరుదండము. ఈ భౌతిక మేరుదండములోని ఒకదానిలోఒకటిగా అమర్చియున్న నాలుగువరుసల సింపథటిక్ నరముల సిస్టంయొక్క రక్షణకై 33 పూసల కవచము ఏర్పాటు చేయబడినది.
అన్నిటికంటే బయటయున్న నరములలో లిమ్ఫ్(lymph) తో నింపబడియున్న Dura matter membrane అనే కండరము ఉండును.  దానిలోపలయున్న నరములలో మెదడునుండి వచ్చే ద్రవమును రక్షిస్తూ సున్నితమైన Archnoid membrane అనే కండరము ఉండును. దానిలోపల pia matter అని పిలవబడే white & gray matter అనేది Vascular membrane తో చుట్టబడి  Afferent & efferent అను సున్నితమైన నరములతో పెద్దమెదడుతో కండరములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మరియు  ముఖ్యమైన అంగములను వాటివాటి నరములకు కలపబడి ఉండును.  white & gray matter అనే పదార్థము లోపల అతి సున్నితమైన కాలువ ఉండును.        
భౌతికమైన కన్నులో White, Iris మరియు Pupil ఉండును. దాని వెనకాల సూక్ష్మమైన జ్ఞాననేత్రములో Whiteకు అనుగుణముగా బంగారు రంగు చక్రము, దానిలోపల నీలపు చక్రము దానిలోపల ఐదు భుజములు గల వెండినక్షత్రము క్రమముగా ఉండును. చేతులు చాచిన  మనిషి యొక్క చేతులు, తల మరియు పాదములు కలిపి  ఐదు భుజములుగల నక్షత్రము.  తల ఆకాశమునకు, రెండుచేతులు వాయువు మరియు అగ్నికి, రెండు పాదములు జలము మరియు పృథ్వికి ప్రతీకలు.          
మన శరీరములో 72,000 సూక్ష్మ నాడులు ఉన్నవి. వాటిలో ఇడా, పింగళా మరియు సుషుమ్నా ముఖ్యమైనవి. ప్రకాశము యొక్క బయటి తొడుగు సుషుమ్నా సూక్ష్మ నాడి. ఇది  సూక్ష్మ శరీరము యొక్క సూక్ష్మ ప్రాణాణువుల స్థూలమైన పనులను నియంత్రించును. దీనికి రెండువైపులా అనగా ఎడమవైపు ఇడా(ప్రాణవాయువుకు అనుగుణంగాఉన్న), కుడివైపు (అపానవాయువుకు అనుగుణంగా ఉన్న) పింగళా సూక్ష్మనాడులు ఉండును. ఇడా మరియు పింగళా సూక్ష్మనాడులు స్థూల శరీరములోని  సింపతటిక్ నెర్వస్ సిస్టంని (sympathetic nervous system) నియంత్రించును.
సుషుమ్న మూలాధారమునుండి బ్రహ్మరంధ్రమును ఆనుకొనియున్న సహస్రారచక్రము వరకు వ్యాపించియుండును.
సుషుమ్నలోని  వజ్ర అనే సూక్ష్మనాడి స్వాధిష్ఠానమునుండి బ్రహ్మరంధ్రమును ఆను కొనియున్న సహస్రారచక్రము వరకు వ్యాపించియుండును. ఇది సూక్ష్మ శరీరముయొక్క  వ్యాకోచము, సంకోచము మరియు అన్ని కదలికలకు కావలసిన శక్తిని సమకూర్చును.
వజ్ర లోని చిత్ర అనే సూక్ష్మనాడి మణిపురమునుండి బ్రహ్మ రంధ్రమును ఆను కొనియున్న సహస్రారచక్రము వరకు వ్యాపించి యుండును. ఇది సూక్ష్మశరీరముయొక్క ఆధ్యాత్మిక అనగా చేతనాసంబంధమైన పనులను చక్కబరుచును.
సుషుమ్న, వజ్ర మరియు చిత్రలయొక్క నియంత్రణ ముఖ్యముగా సహస్రారము చేయుచుండును.
సహస్రారము సూక్ష్మశరీరము యొక్క మెదడు(Brain). ఈ సహస్రారము యొక్క ప్రకాశకిరణములు ఏడుచక్రములకు వాటివాటి పనులకు మరియు చేతనకి  కావలిసిన శక్తిని ప్రసాదించును. భౌతిక మెదడు(Brain)కి  మరియు స్థూలచక్రస్థానములకు, నరముల కేంద్రములకు, వాటిద్వారా నరములకు, వాటివాటి స్థూల పనులకు మరియు చేతనకి  కావలిసిన శక్తిని ప్రసాదించును.
స్థూలశరీరము మాంసమయము.  సూక్ష్మశరీరము ప్రాణశక్తి, ప్రాణాణువులు లేదా జ్ఞానప్రకాశముతో కూడి ఉంటుంది. కారణశరీరము కేవలము చైతన్యము లేదా ఆలోచనాణువులతో కూడి ఉంటుంది.
మానవ చేతనకు,  స్థితివంతమునకు, కారణము ఈకారణ శరీరమే.
కారణ శరీరమునకు జ్ఞానవంతమైన మెదడు(Brain), ఆధ్యాత్మికతో కూడిన బ్రహ్మనాడి అనే మేరుదండము ఉండును. ఇది చిత్రి సూక్ష్మనాడిలో ఉండును. ఇది కేవలచేతనతో కూడియుండును.
స్థూలశరీరమునకు స్థూలచక్రస్థానములు ఉన్నవి. స్థూలచక్రస్థానములకు అనుగుణముగా సూక్ష్మశరీరమునకు సూక్ష్మచక్రములు ఉన్నవి. అదేవిధముగా సూక్ష్మచక్రములకు అనుగుణముగా  ఈ కారణశరీరమునకు ఏడు కారణ చక్రములు ఉండును.
స్థూలచక్రస్థానములు, స్థూలమెదడు (Brain), సూక్ష్మశరీరచక్రములు, సూక్ష్మమెదడు (Brain), మరియు కారణశరీరచక్రములు, కారణ మెదడు (Brain) కలిసి పనిచేయును. అందువలన స్థూల, సూక్ష్మ మరియు కారణశరీరములు కలిసి ఒకే మూసగా కలిసి పనిచేయును. సూక్ష్మ మరియు స్థూలశరీరములు రెండునూ ఈ కారణశరీరచేతనతో గుర్తించుట, ఆలోచించుట, కోరుట మరియు అనుభవించుటకు తోడ్పడును.  కారణశరీరమెదడు (Brain) నిత్యశక్తివంతము, నిత్య చైతన్యము, మరియు నిత్యనూతనానందము అయిన పరమాత్మ చేతనకు భాండాగారము.
పరమాత్మచేతనయొక్క వ్యష్టి వ్యక్తీకరణే వ్యష్టాత్మ. పరమాత్మచేతన కారణశరీరచక్రములలోకి ప్రవేశించునపుడు, కారణసేరేబ్రం అనగా పెద్దమెదడులో శుద్ధజ్ఞానముగా, కారణ మేడుల్లా (Medulla)లో ఆత్మబోధ(intuition)గా, కారణ విశుద్ధలో శాంతిగా, కారణ అనాహతలో ప్రాణశక్తి నియంత్రణకి, కారణ మణిపురలో ఆత్మనిగ్రహశక్తిగా, కారణస్వాధిష్ఠానలో పట్టుదలగా, కారణ మూలాదారలో నిగ్రహశక్తిగా మరియు నిత్య నిరంతర ఆలోచనలకు చేతనగా వ్యక్తీకరించుచున్నది.
సాధకుడు ప్రాణశక్తిని,అహంకారమును,చేతనని, మేరుదండములోనికి  ఉపసంహరించు కుంటాడు. సూక్ష్మమేరుదండములోని సుషుమ్నా, దానిలోని వజ్ర, దానిలోని చిత్రిలోనికి ఒకే విద్యుత్ ధారగా పంపు తాడు. ఆ ధార చిత్రిలోని బ్రహ్మనాడి ద్వారా ఆరోహణలో పరమాత్మకి చేర్చబడుతుంది. ఈబ్రహ్మనాడి ద్వారానే పరమాత్మ  క్రమముగా ఆత్మ, ప్రాణ మరియు చేతనగా అవరోహణలో ఈ జడ శరీరములోనికి ప్రవేశించి దానిని చైతన్యవంతము చేస్తున్నది.
అగ్నిర్జ్యోతిరహశ్శుక్లష్షణ్మాసా ఉత్తరాయణం
తత్ర ప్రయతా గచ్ఛన్తి బ్రహ్మబ్రహ్మవిదోజనాః                     24
అగ్ని, ప్రకాశము, పగలు, శుక్లపక్షము, ఆరునెలలుగా ఉత్తరాయణము, ఏ మార్గమందుగలవో, ఆ మార్గమున  వెడలిన బ్రహ్మవేత్తలగు జనులు బ్రహ్మమునే పొందుచున్నారు.
ధూమోరాత్రిస్తథా కృష్ణ ష్షణ్మాసా దక్షిణాయణం
తత్ర చాన్ద్రమసంజ్యోతి ర్యోగీ ప్రాప్య నివర్తతే                           25
పొగ, రాత్రి, కృష్ణపక్షము, ఆరునెలలుగా దక్షిణాయణం, ఏ మార్గ మందుగలవో, ఆ మార్గమున  వెడలినసకామకర్మయోగి చంద్ర సంబంధమైన ప్రకాశామునుబొంది మరల వెనుకకువచ్చి జన్మము బొందుచున్నాడు.
శుక్లకృష్ణగతీహ్యేతే జగతః శాశ్వతే మతే
ఏకయాయాత్యనావృత్తిమన్యయావర్తతే పునః                       26
ఈ శుక్లకృష్ణమార్గములు రెండును జగత్తునందు శాశ్వతముగా నుండునవిగా తలంపబడుచున్నవి. అందు మొదటిదానిచే జన్మరా హిత్యమును, రెండవదానిచే మరల జన్మమును యోగి పొందు చున్నాడు.
అగ్ని అనగా కుండలినీ ప్రాణశక్తి. సాధకుడు కుండలినీ ప్రాణశక్తి నియంత్రణను సాధించాలి. ప్రాణశక్తి నియంత్రణను సాధించిన యోగి యొక్క మార్గము ప్రకాశము లేదా పరమాత్మచైతన్యము  అనగా సహస్రారచక్రమువైపు ఉంటుంది. ఈమార్గము శుక్ల లేదా తెల్లని మార్గము. ఇక్కడ పగలు అనగా సాధకునికి సమాధి స్థితిలోకనబడే కూటస్థములోని మూడవకన్ను.  ఆరునెలలుగా ఉత్తరాయణము అనగా మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ మరియు ఆజ్ఞా అనే ఆరు చక్రములు. సహస్రారచక్రము ఉత్తరము. ఈ ఆరు చక్రములలో సాధకుడు తన సాధనలో ఆరు విధములైన పరమాత్మచేతనను అనుభూతి పొందుతాడు. ఈవిధముగా ప్రాణశక్తి, చేతన ఉత్తరదిక్కుకుపయనించి, సుషుమ్నా,వజ్ర, మరియు చిత్రి, అనే  మూడు సూక్ష్మ మేరుదండములను దాటి,  స్థూల,సూక్ష్మ శరీరములనుదాటి, ఆఖరికి కారణశరీరములోని అతిసూక్ష్మమైన బ్రహ్మనాడి ద్వారా అత్యుత్తమమైన బ్రహ్మములో ఐక్యము పొందుతాడు. ఇక జనన మరణములు అనే బంధములనుండి విముక్తిపొందుతాడు.
        సాధారణ మానవులలో ప్రాణశక్తియొక్క మార్గము క్రిందకి అనగా చీకటి అనగా కృష్ణ మార్గము. పొగ అనగా అజ్ఞానము. రాత్రి అనగా  అనగా అజ్ఞానస్థితి. పరమాత్మచేతన సహస్రారచక్రమునుండి     ఆరునెలలుగా దక్షిణాయణము అనగా ఆజ్ఞా, విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్ఠాన, మరియు మూలాధార, అనే ఆరు చక్రములద్వారా ద్వంద్వములతోకూడిన సంసారములోనికి దిగుట మరియు జనన మరణములు అనే బంధములలో చిక్కుకొనుట. మూలాధార చక్రము దక్షిణము. ఈ ఆరు చక్రములలో మానవుడు తనలో  పరమాత్మచేతనను అనుభూతిని క్రమముగా  కోల్పోతాడు.                        
  జీవుడు ప్రయాణము చేయునపుడు  అవిద్య లేక కారణశరీరముతో కూడిన సూక్ష్మశరీరము, కామము, కర్మము, పంచమహాభూతములు జీవుని వెన్నంటియుంటాయి.   కారణశరీరములోని చిత్రగుప్తుని చిట్టా ఉండును. ఇది మొబైల్ లోని (Mobile cell) చిప్(chip) లాంటిది.   ఈ చిత్రగుప్తుని చిట్టాలో  తన పూర్వ జన్మల వాసనలు, కర్మఫలములు పొందుపరచి యుండును.
జీవుడు కారణ సూక్ష్మ శరీరములతో ఆకాశము, వాయువు, ధూమము, వర్షించు మేఘముద్వారా పయనించి, ధాన్యముల (వ్రీహ్యాదులు) ద్వారా అన్న స్వరూపము అగును. ఆ అన్నమును భుజియించిన పురుష శరీరములో జీవుడు ప్రవేశించును. పురుష శుక్లము ద్వారా పయనించి, స్త్రీ శరీరములోని శోణితముతో కలియును. సూక్ష్మశరీరము, మరణానంతరం నశించిన స్థూలశరీర పంచీకృత మహాభూతముల సూక్ష్మాంశములు, పుణ్యపాప కర్మఫలములు, వాసనలరూపములోనున్న తీరని కోరికలు, త్రిగుణాత్మకమైన కారణశరీరముగల జీవుడూను, జన్మరాహిత్యముచెందనంతవరకు తోటి ప్రయాణీకులే. 
సుషుమ్నానాడి ముడ్డిలోనున్న మూలాధారము నుండి బ్రహ్మరంధ్రములోని సహస్రారము వరకు మేరుదండములో వ్యాపించియున్నది. జ్ఞానులు, యోగులు అయిన జీవన్ముక్తులు ఈ మార్గమున వెడలుదురు.
ఇడా సూక్ష్మనాడి మూలాధారమునుండి ముక్కురంధ్రము వరకు సుషుమ్నానాడికి ఎడమవైపున మేరుదండములో వ్యాపించి యున్నది. దీనినే చంద్రనాడి, పితృయాననాడి, లేదా కృష్ణయాననాడి అంటారు. ఆత్మజ్ఞానశూన్యులు, కర్మఫలమును ఆశించువారు ఈ మార్గమున వెడలుదురు.
మూలాధారమునుండి ముక్కురంధ్రము వరకు సుషుమ్నానాడికి కుడివైపున మేరు దండములో వ్యాపించియున్ననాడి పింగళానాడి. దీనినే సూర్యనాడి, దేవయాననాడి, లేదా శుక్లయాన నాడి అంటారు. నిష్కామముతో కర్మఫలమును ఆశించక సకార్యములుజేయువారు ఈ మార్గమున వెడలుదురు.

   















    
        



Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana